సంస్కృత సంధులు
సంధి వివరణ:
మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది. 'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని సంధి అంటారు.
ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది. వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను సంధి అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును సంధికార్యము అని అంటారు. సంధిలో రెండు పదాలు ఉంటాయి. వీటిలో మొదటి పదాన్ని 'పూర్వ పదం' అని రెండో పదాన్ని 'పరపదం'అని లేదా 'ఉత్తర పదం' అంటారు. పూర్వ పదం లోని చివరి అక్షరంలోని అచ్చును 'పూర్వ స్వరం' అని, పర పదంలోని మొదటి అక్షరం లోని అచ్చుని 'పర స్వరం' అని అంటారు.
సంధులు రెండు రకాలు. తెలుగు పదాల మధ్య జరిగే సంధులను తెలుగు సంధులని, సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను సంస్కృత సంధులని అంటారు.
సవర్ణదీర్ఘ సంధి :-
కవీంద్రుడు=కవి+ఇంద్రుడు
ఇక్కడ పూర్వ పదం 'కవి' లో చివరి అక్షరం'వి'లో 'ఇ', పరపదం 'ఇంద్రుడు'లో మొదటి అక్షరం 'ఇ' సవర్ణాలు. ఈ రెండూ సవర్ణాలు కలిసినప్పుడు 'ఈ' అనే దీర్ఘాచ్చు ఏర్పడింది.
భానూదయం = భాను + ఉదయం
ఇక్కడ పూర్వ పదం 'భాను' లో చివరి అక్షరం'ను'లో 'ఉ', పరపదం 'ఉదయం'లో మొదటి అక్షరం 'ఉ' సవర్ణాలు. ఈ రెండూ సవర్ణాలు కలిసినప్పుడు 'ఊ' అనే దీర్ఘాచ్చు ఏర్పడింది.
పితౄణం = పితృ + ఋణం
సూత్రం: అ,ఇ,ఉ,ఋ అనే వర్ణాలకు సవర్ణాలు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశమగును.
సవర్ణాలు అంటే అవే అచ్చులు అని అర్థం. 'అ' వర్ణానికి అ,ఆ సవర్ణాలు అవుతాయి. 'ఇ' వర్ణానికి ఇ,ఈ సవర్ణాలు అవుతాయి. ఇదేవిధంగా గా 'ఉ' వర్ణానికి ఉ,ఊ లు; 'ఋ' వర్ణానికి ఋ,ౠ లు సవర్ణాలు అవుతాయి. శ్ర
*సవర్ణాలతో ఏర్పడుతున్న సంధి కాబట్టి దీనికి సవర్ణదీర్ఘ సంధి అని పేరు.
రామానుజుడు = రామ + అనుజుడు
ఇక్కడ పూర్వ పదం 'రామ' లో చివరి అక్షరం'మ'లో 'అ' అనే అచ్చు ఉంది. పరపదం 'అనుజుడు'లో మొదటి అక్షరం 'అ' ఉంది. ఈ రెండూ సవర్ణాలు కలిసినప్పుడు 'ఆ' అనే దీర్ఘాచ్చు ఏర్పడింది.
రామాలయం = రామ + ఆలయం
ఇక్కడ పూర్వ పదం 'రామ' లో చివరి అక్షరం'మ'లో 'అ', పరపదం 'ఆలయం'లో మొదటి అక్షరం 'ఆ' సవర్ణాలు. ఈ రెండూ సవర్ణాలు కలిసినప్పుడు 'ఆ' అనే దీర్ఘాచ్చు ఏర్పడింది.
ఇక్కడ పూర్వ పదం 'పితృ' లో చివరి అక్షరం'తృ'లో 'ఋ', పరపదం 'ఋణం'లో మొదటి అక్షరం 'ఋ' సవర్ణాలు. ఈ రెండూ సవర్ణాలు కలిసినప్పుడు 'ౠ' అనే దీర్ఘాచ్చు ఏర్పడింది.
ఉదాహరణలు:-
- అగ్రాసనాధిపతి = అగ్ర + ఆసన + అధిపతి
- కరీంద్రం = కరి + ఇంద్రం
- కరాగ్రం = కర + అగ్రం
- కాలాంబర = కాల + అంబర
- కేశాలంకరణ = కేశ + అలంకరణ
- కోటీశ్వరుడు = కోటి + ఈశ్వరుడు
- చారూహ = చారు + ఊహ
- జనార్దన = జన + అర్దన
- జలజాకరము = జలజ + ఆకరము
- దేవాలయం = దేవ + ఆలయం
- దేశాభిమానం = దేశ + అభిమానం
- పరమాత్మ = పరమ + ఆత్మ
- పరమాన్నం = పరము + అన్నం
- పండితాగ్రగణ్యులు = పండిత + అగ్రగణ్యులు
- ప్రాచీనాంధ్రులు = ప్రాచీన + ఆంధ్రులు
- ఫణాగ్రము = ఫణ + అగ్రము
- బిరుదాంకితులు = బిరుదు + అంకితులు
- భోజనానంతరం = భోజన + అంతరం
- మంత్రాలయం = మంత్ర + ఆలయం
- మధూదయం = మధు + ఉదయం
- మధురాశ్రువులు = మధుర + అశ్రువులు
- మహానందము = మహా + ఆనందము
- మహాత్ముడు = మహా + ఆత్ముడు
- మహీంద్రుడు = మహి + ఇంద్రుడు
- మాసాంతరము = మాస + అంతరము
- మాతౄణం = మాతృ + ఋణం
- మీనాక్షి = మీన + అక్షి
- యథార్థం = యథా + అర్థం
- విద్యాధికుడు = విద్య + అధికుడు
- విద్యార్థులు = విద్య +అర్థులు
- విదురాది = విదుర + ఆది
- వారాంతము = వార + అంతము
- విలాపాగ్నులు = విలాపం + అగ్నులు
- విషాదాశ్రువులు = విషాదం + అశ్రువులు
- విశాలాక్షి = విశాల + అక్షి
- వేదాంతం = వేద + అంతం
- రవీంద్రుడు = రవి + ఇంద్రుడు
- రామేశ్వరము = రామ + ఈశ్వరము
- లఘూత్తరం = లఘు + ఉత్తరం
- లేఖావళి = లేఖ + ఆవళి
- శతాబ్దం = శత + అబ్దం
- శైలాగ్రం = శైల + అగ్రం
- సమరాంగణం = సమర + అంగణం
- సజ్జనావళి = సజ్జన +ఆవళి
- సువర్ణాధ్యాయం = సువర్ణ + అధ్యాయం
- సోమనాద్రి = సోమన + అద్రి
గుణసంధి :-
రాజ + ఇంద్రుడు = ?
'జ'లో (జ్+అ) అకారముంది. పరపదమైన 'ఇంద్రుడు'లో మొదటి అక్షరంగా 'ఇ' ఉంది.
అ+ఇ =ఏ
జ+ఇ =జే
రాజ + ఇంద్రుడు =రాజేంద్రుడు
దేశ + ఉన్నతి = ?
'శ'లో (శ+అ) అకారముంది. పరపదమైన 'ఉన్నతి'లో మొదటి అక్షరంగా 'ఉ' ఉంది.
అ+ఉ =ఓ
శ+ఉ =శో
దేశ + ఉన్నతి = దేశోన్నతి
మహా + ఋషి = ?
'హా'లో (హ్+ఆ) అకారముంది. పరపదమైన 'ఋషి'లో మొదటి అక్షరంగా 'ఋ' ఉంది.
ఆ+ఋ =అర్
హ్+అర్+షి=
హ్+అ + ర్+షి =
హ + ర్షి =
మహా + ఋషి = మహర్షి
సూత్రం:-
అకారానికి ఇ,ఉ,ఋ లు పరమైనపుడు క్రమంగా ఏ,ఓ,అర్ లు ఏకాదేశమౌతాయి. (క్రమముగా అంటే అకారానికి ఇ,ఈ లు పరమైతే 'ఏ' ; ఉ,ఊ లు పరమైతే 'ఓ' ;ఋ,ౠ లు పరమైతే 'అర్' )
అ, ఆ లను అకారమని; ఇ,ఈ లను ఇకారమని; ఉ, ఊ లను ఉకారమని అంటారు.
ఉదాహరణలు:-
- ఆంగ్లేయోపన్యాసం = ఆంగ్లేయ + ఉపన్యాసం
- కంఠోక్తి = కంఠ + ఉక్తి
- కులోచితం = కుల + ఉచితం
- ఉపేంద్రుడు = ఉప + ఇంద్రుడు
- కావ్యేతర = కావ్య + ఇతర
- గజేంద్రుడు = గజ+ ఇంద్రుడు
- గర్వోక్తి = గర్వ + ఉక్తి
- గృహోపకరణ = గృహ + ఉపకరణ
- దేవర్షి = దేవ + ఋషి
- పరోపకారం = పర+ ఉపకారం
- పురుషోత్తముడు = పురుష + ఉత్తముడు
- బసవేశ్వరుడు = బసవ + ఈశ్వరుడు
- భాషోచ్చారణ = భాష + ఉచ్చారణ
- బ్రాహ్మణేతరులు = బ్రాహ్మణ + ఇతరులు
- మదోన్మాదం = మద + ఉన్మాదం
- మహేంద్రుడు = మహా + ఇంద్రుడు
- మహోగ్రము = మహా + ఉగ్రము
- మహోన్నతి = మహా + ఉన్నతి
- వక్రోక్తి = వక్ర + ఉక్తి
- వేదోక్తి = వేద + ఉక్తి
- రాజర్షి = రాజ + ఋషి
- రాజేశ్వరి = రాజ + ఈశ్వరి
- స్వాతంత్ర్యోద్యమం = స్వాతంత్ర్య + ఉద్యమం
- శీతోష్ణము = శీత + ఉష్ణము
- సురేంద్రుడు = సుర+ ఇంద్రుడు
- సూర్యోదయం = సూర్య + ఉదయం
యణాదేశసంధి :-
సూత్రం: ఇ,ఉ,ఋ లకు అసవర్ణాలు పరమైనపుడు క్రమంగా య,వ,ర లు ఆదేశంగా వస్తాయి.
అసవర్ణాల అంటే వేరే అచ్చులు. 'ఇ' కి అ,ఆ; ఉ,ఊ; ఋ,ౠలు అసవర్ణాలు. 'ఉ' కి అ,ఆ; ఇ,ఈ; ఋ,ౠలు అసవర్ణాలు. 'ఋ' కి అ,ఆ; ఉ,ఊ; ఇ,ఈలు అసవర్ణాలు.
కింది ఉదాహరణల్లో సంధి జరిగిన తీరును గమనించండి
అత్యానందం = అతి + ఆనందం
తి + ఆ
త్+ఇ + ఆ
త్ + ఇ+ఆ
త్ + యా = త్యా
అణ్వస్త్రం = అణు + అస్త్రం
ణు + అ
ణ్+ఉ + అ
ణ్ + ఉ+అ
ణ్ + వ = ణ్వ
పిత్రాజ్ఞ = పితృ + ఆజ్ఞ
తృ + ఆ
త్ + ఋ + ఆ
త్ + ఋ + ఆ
త్ + ర = త్ర
ఉదాహరణలు:-
- అణ్వాయుధం = అణు + ఆయుధం
- అత్యంత = అతి + అంత
- అత్యాశ = అతి + ఆశ
- అత్యుగ్రం = అతి + ఉగ్రం
- అధ్యక్షుడు = అధి + అక్షుడు
- అభ్యంతరం = అభి + అంతరం
- అభ్యుదయం = అభి + ఉదయం
- అభ్యుత్థానం = అభి + ఉత్థానం
- ఆద్యంతాలు = ఆది + అంతాలు
- ఇత్యాది = ఇతి + ఆది
- దధ్యోదనము = దది + ఓదనము
- ప్రత్యహం = ప్రతి + అహం
- ప్రత్యక్షం = ప్రతి + అక్షం
- ప్రత్యుత్తరం = ప్రతి + ఉత్తరం
- పిత్రార్జితం = పితృ + ఆర్జితం
- మధ్వరి = మధు + అరి
- మాత్రంశ = మాతృ + అంశ
స్వాగతం = సు + ఆగతం
వృద్ధిసంధి:-
సూత్రం:
అకారానికి ఏ,ఐ లు పరమైనప్పుడు ఐకారము; ఓ,ఔ లు పరమైనప్పుడు ఔ కారము ఏదేశమగును. ఐ, ఔ లను వృద్ధులు అంటారు.
రస + ఏక =?
అష్ట + ఐశ్వర్యం = ?
సూత్రం ప్రకారం పూర్వ పదం చివరన అకారముంది. ఈ అకారానికి పరపదంలోని 'ఏ, ఐ' పరమైతే ఐకారము రావాలి. కాబట్టి
రస + ఏక = రసైక
అష్ట + ఐశ్వర్యం = అష్టైశ్వర్యం
వన + ఓషధి = ?
రస + ఔచిత్యం = ?
సూత్రం ప్రకారం పూర్వ పదం చివరన అకారముంది. ఈ అకారానికి పరపదంలోని 'ఓ, ఔ' పరమైతే ఔకారము రావాలి. కాబట్టి
వన + ఓషధి = వనౌషధి
రస + ఔచిత్యం = రసౌచిత్యం
గుణసంధి
అ + ఇ,ఈ = ఏ
+ఉ,ఊ = ఓ
+ఋ,ౠ =అర్
వృద్ధి సంధి
+ఏ,ఐ = ఐ
+ఓ,ఔ = ఔ
పై వివరణను పరిశీలిస్తే గుణ సంధి, వృద్ధి సంధి రెండూ కవల సంధులని చెప్పవచ్చు. ఎందుకంటే రెండు సంధులూ అకారానికే పరమౌతూ ఉన్నాయి.
- ఏకైక = ఏక + ఏక
- దివ్యౌషధం = దివ్య + ఔషధం
- దివౌకసలు = దివ + ఓకసులు
- దేవైశ్వర్యం = దేవ + ఐశ్వర్యం
- దేశౌన్నత్యం = దేశ + ఔన్నత్యం
- ప్రథమైక = ప్రథమ + ఏక
- పాపౌఘము = పాప + ఓఘము
- భాషౌన్నత్యం = భాష + ఔన్నత్యం
- మహౌషధం = మహా +ఔషధం
- లోకైక = లోక+ ఏక
- సురైక = సుర + ఏక
అనునాసిక సంధి
సూత్రం: వర్గ ప్రథమాక్షరాలకు 'న'గానీ, 'మ'గానీ పరమైనపుడు అదే వర్గ అనునాసికాలు ఆదేశమవుతాయి.
వర్గాలు:క - వర్గం : క,ఖ,గ,ఘ,ఙ
చ - వర్గం : చ,ఛ,జ,ఝ,ఞ
ట - వర్గం : ట,ఠ,డ,ఢ,ణ
త - వర్గం : త,థ,ద,ధ,న
ప - వర్గం : ప,ఫ,బ,భ,మ
ఈ ఐదు వర్గాలలో ప్రథమాక్షరాలు : క,చ,ట,త,ప
క,చ,ట,త,ప లకు 'న' గానీ, 'మ'గానీ పరమైనపుడు అదే వర్గాలకు సంబంధించిన అనునాసికాలు ఆదేశమవుతాయి.
వాగ్మయం = వాక్ + మయం
రాణ్మహేంద్రవరం = రాట్ + మహేంద్రవరం
జగన్నాథుడు = జగత్ + నాథుడు
పై మూడు సందర్భాలలో క,ట,త లకు న,మ లు పరమైనవి.
అంటే 'క' పూర్వ పదం చివరలో ఉండి, పరపదంలో న లేదా మ ఉంటే సంధి జరిగినప్పుడు క స్థానంలో '' వస్తుంది.
'ట' పూర్వ పదం చివరలో ఉండి, పరపదంలో న లేదా మ ఉంటే సంధి జరిగినప్పుడు ట స్థానంలో 'ణ' వస్తుంది.
'త' పూర్వ పదం చివరలో ఉండి, పరపదంలో న లేదా మ ఉంటే సంధి జరిగినప్పుడు ట స్థానంలో 'న' వస్తుంది.
*తన్మయం = తత్ + మయం
*రాణ్మణి = రాట్ + మణి
*మరున్నందనుడు = మరుత్ + నందనుడు
Comments
Post a Comment