పూర్వకాలంలో ఇంద్రసేన అనే ఆమె మౌద్గల్య మహాముని భార్య. ఆమె మహా పతివ్రత. మౌద్గల్యుడు కుష్టురోగం తో బాధపడుతున్నాడు చర్మమంతా వదిలిపోయింది అవయవాలు కూలిపోయాయి కానీ ఇంద్రసేన అసహ్యించు కోకుండా భర్తకు సేవలు చేస్తూ ఉంది. ఒకరోజు భర్తకు భోజనం పెట్టింది. మిగిలిన అన్నం తింటూ ఉంది. అందులో భర్త వేలు ఒకటి ఊడి పడి ఉంది. ఇంద్రసేన ఆ వేలుని తీసి పక్కన పెట్టి మిగిలిన అన్నం తింటూ ఉంది. దీన్ని చూసి మౌద్గల్యుడు ఆశ్చర్యపోయాడు.
"ఇంద్రసేన నీ పతిభక్తి అమోఘం. నీకు ఏ వరం కావాలో కోరుకో ఇస్తాను" అన్నాడు దానికి ఇంద్రసేన "నాకు కామవాంఛలు ఎక్కువగా ఉన్నాయి. అవి మీ వల్ల ఈ రూపంలో తీర లేదు కాబట్టి మీరు అందమైన, మనోహరమైన రూపము ధరించి ఐదుగురిగా మారి ఐదు విధాలుగా నా కామవాంఛలు తీర్చండి"అని కోరింది. దానికి ఆ మహాముని సంతోషించాడు. తన తపో మహిమతో మనోహరమైన రూపము ధరించి ఐదుగురిగా విడిపోయాడు. ఐదు విధాలుగా భార్యతో కామ సుఖాలు అనుభవించాడు. తరువాత బ్రహ్మ లోకానికి వెళ్ళాడు.
కానీ ఇంద్రసేనకు కామవాంఛలు ఇంకా తీరలేదు. మరుజన్మలో కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలాకాలం కన్యగానే మిగిలిపోయింది. శివుని గూర్చి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏమి కావాలో కోరుకోమన్నాడు.
శివుని చూచిన తత్తరపాటుతో తన మనసులో ఉన్న బలమైన కోరికతో "నాకు భర్త కావాలి.. నాకు భర్త కావాలి" అంటూ అప్రయత్నంగా ఐదుసార్లు అడిగింది. అప్పుడు శివుడు ఆమెకు మరుజన్మలో ఐదుగురు భర్తలు ఉంటారని వరమిచ్చాడు. తర్వాత ఆమె తన పొరపాటు గ్రహించి, ఎక్కడన్నా ఒక కన్యకు ఐదుగురు భర్తలు ఉంటారా? అది ధర్మ విరుద్ధం కాదా? కాబట్టి నాకు ఆ వరం వద్దని చెప్పింది. దానికి శివుడు నువ్వు ధర్మం తప్పకుండా ఐదుగురు భర్తలతో ఉంటావని అన్నాడు.
ఇంద్రుడు, ఇతర దేవతలు ఇంద్రలోకం వెళుతూ మార్గ మధ్యంలో గంగా నది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ కాశీరాజు కూతురు ఏడుస్తూ ఉంది. ఆమెను సమీపించి ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు దేవేంద్రుడు. అప్పుడామె వాళ్లను శివుని వద్దకు తీసుకుని వెళ్ళింది. ఆ సమయంలో మహాశివుడు ఒక నవ యువకుడి రూపంలోకి మారి ఒక యువతితో జూదం ఆడుతున్నాడు. అది చూసి దేవేంద్రుడికి కోపం వచ్చింది. ముల్లోకాలకు అధిపతిని, నా ముందు జూదమాడుతున్నావా? అని గర్వంగా అన్నాడు.
దానికి శివుడు కోపించి, నీకు చేతనైతే ఆ కొండ గుహను రెండుగా చీల్చమన్నాడు. ఇంద్రుడు తన బాహువులతో ఆ గుహను రెండుగా చీల్చగా అందులో నలుగురు బలవంతులైన వీరులను చూసి ఆశ్చర్యపోయాడు. ఈశ్వరుడు తన నిజరూపంతో సాక్షాత్కరించి ఆ ఐదుగురు ఇంద్రులను మానవలోకంలో జన్మించమన్నాడు.
ఆ ఐదుగురు ఇంద్రులే ఈ పాండవులు. ఆ ఆకాశరాజు పుత్రికే ఇప్పుడు నీ కుమార్తె గా ఉన్నా ఈ ద్రౌపది అంటూ వ్యాసుడు తెలిపాడు.
Comments
Post a Comment