Skip to main content

మహాభారతం - ఆదిపర్వము

    

                               మహాభారతం 

    

    తింటే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది. ప్రపంచంలో వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.  

                ఈ కావ్యాన్ని వ్యాసమహర్షి సంస్కృతంలో వంద పర్వాలుగా రాశారు. ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో కవిత్రయంగా పేరుగాంచిన నన్నయతిక్కన, ఎర్రన పద్దెనిమిది పర్వాలుగా తెలుగులోకి అనువదించారు. వ్యాసుడు మహా భారతాన్ని మూడు సంవత్సరాలపాటు రాశాడు. రాయడం పూర్తయ్యాక ఈ మహాభారతాన్ని స్వర్గలోకంలో చెప్పడానికి నారదుడిని , పితృలోకంలో చెప్పడానికి దేవులుడిని, గరుడ గంధర్వ యక్ష రాక్షసులకు చెప్పడానికి తన కుమారుడైన శుక మహర్షిని, సర్పలోకముములో చెప్పడానికి సుమంతుడిని, మానవులకు చెప్పడానికి వైశంపాయనుడిని నియమించాడు. సర్వలోకాలలో ఈ కావ్యాన్ని చెప్పబడిందంటే ఈ కావ్యం మానవులకే కాదు, అందరికీ అవసరమే అని తెలుస్తోంది. 

        కథా ప్రారంభం 

             నహుషుని కుమారుడు యయాతి. ఆయన కుమారులలో చివరి వాడు పూరువు. అతని కారణంగా పురువంశం ఏర్పడింది. పురువంశంలో ప్రముఖుడు ప్రతీపుడు.
            ప్రతీపుడు గంగానదీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు గంగాదేవి స్త్రీ రూపంలో వచ్చి అతని కుడి తొడ మీద కూర్చుంది. ప్రతీపుడు ఆమెను చూసి ఆశ్చర్యపోయి ఆమెను ఎవరివని అడిగాడు.
            ఆమె, నేను జాహ్నముని కూతుర్ని. నీకు భార్యను అవుదామని వచ్చాను. నన్ను స్వీకరించండని అడిగింది. 
             అప్పుడు ప్రతీపుడు "నాకు ఇప్పటికే పెళ్లి అయ్యింది. నేను, నా భార్యను తప్ప మరొక స్త్రీని మనసులో కూడా తలుచుకోను. పైగా భార్య భర్త ఎడమ తొడ మీద కూర్చుంటుంది. పుత్రులు కూర్చుంటారు. నువ్వు తెలిసో తెలియకో కుడి తొడపై కూర్చున్నావు. కాబట్టి నా కొడుకుని వరించి పెళ్లి చేసుకో" అని చెప్పాడు. గంగాదేవి సమ్మతించి వెళ్ళిపోయింది.
           ప్రతీపునికి, అతని భార్య అయిన సునందకు, మహాభిషుడు బ్రహ్మ వాక్కు ప్రకారం శంతనుడిగా జన్మించాడు.  ప్రతీపుడు రాజ్యభారాన్ని శంతనుడికి అప్పగించి, గతంలో తనకు గంగాదేవి జరిగినటువంటి విషయాన్ని చెప్పి, తను తపోవనానికి వెళ్ళి పోయాడు.
         ఒకరోజు శంతనుడు వేటకు వెళ్లి, అలసిన తర్వాత గంగా నది తీరంలో సేదతీరుతూ విహరిస్తున్నాడు. స్త్రీ రూపంలో ఉన్న గంగను చూసి ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. 
ఆమెను సమీపించి " దేవ,దానవ, నాగ, గంధర్వ,యక్ష, రాక్షస, మానవులలో నీ అంతటి  సౌందర్యవతి నేను ఇప్పటివరకూ చూడలేదు. నన్ను అనుగ్రహించు" అన్నాడు. అందుకు ఆమె "మహారాజా నాకేమీ అభ్యంతరం లేదు. అయితే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నా మాటను కాదన్నా, నా మనసుకి కష్టం కలిగించినా, ఆ క్షణంలోనే నేను మిమ్మల్ని విడిచి వెళ్తాను. ఇది మీకు అంగీకారం అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను" అని చెప్పింది. శంతనుడు అందుకు అంగీకరించాడు. గంగా శంతనుల వివాహం జరిగింది. 

             గంగకు శంతనుడికి ఏడు మంది కుమారులు కలిగారు గంగ వారందరినీ పుట్టిన వెంటనే గంగానదిలో పడవేసింది. శంతనుడికి మనసులో బాధగా ఉన్నా అనుకున్న మాట ప్రకారం ఏమీ అనలేక పోతున్నాడు. 
         తరువాత పుట్టిన ఎనిమిదవ కుమారుని కూడా గంగానదిలో వేయడానికి పోతుండగా శంతనుడు సహించలేక ఎందుకిలా చేస్తున్నావని అడిగాడు. వసిష్టుల శాపం వల్ల వసువులకు నరజన్మ ఎత్తవలసి వచ్చింది. వారు నా గర్భాన పుడతామని, పుట్టిన వెంటనే నదిలో పడవేయని వేడుకున్నారు. అందుకే వారి శాపవిమోచనం కోసం ఇలా చేశాను. ఇంక ఈ బాలుడు వారందరి అంశతో జన్మించాడు . నీ వంశ ప్రతిష్ట నిలుపుతాడు. ఈ బాలుడి విద్యాభ్యాసం పూర్తయ్యేవరకు నా వద్ద ఉంచుకుని తర్వాత నీకు అప్పగిస్తాను. ఈ బాలుడు గంగానందనుడిగా పిలవబడతాడు. మన నియమం ప్రకారము నేను వెళ్ళిపోతున్నాను" అని గంగాదేవి చెప్పి ఆ బాలుని తీసుకొని వెళ్ళిపోయింది.                

         భారతం క్విజ్ - 1 కోసం కింది లింకును క్లిక్ చేయండి

                         
                శంతనుడు ఒక రోజు వేట నిమిత్తం గంగా నది తీరానికి వెళ్ళాడు. ఒక చోట గంగా నది ప్రవాహం ఆగిపోయినట్టు కనిపించింది. ఇది చూసి ఆశ్చర్యపోయాడు శంతనుడు. ఇలా జరగడానికి  కారణం ఏమిటో అని గంగాతీరం వెంట నడుస్తూ ఉండగా ఒక చోట ఒక బాలుడు తన బాణాలతో గంగానదికి అడ్డుకట్ట కడుతూ కనిపించాడు. ఆ బాలుడే గంగాదేవికి,శంతనుడికి జన్మించిన గాంగేయుడు. ఇతనికి దేవవ్రతుడు అనే పేరు కూడా ఉంది. అప్పుడు గంగాదేవి అక్కడికి వచ్చి గాంగేయుడిని శంతనుడికి అప్పగించింది. శంతనుడు తన కుమారుని రాజ్యానికి తీసుకుని వచ్చి యువరాజుని చేసి పట్టాభిషేకం చేశాడు.

      ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు శంతనుడు యమునా నదీతీరంలో విహరిస్తున్నాడు. దూరం నుంచి ఏదో మంచి సువాసన వెదజల్లే పరిమళం వస్తుంది. ఆ పరిమళం వస్తున్న వైపుగా వెళ్ళాడు. అక్కడ అ ఒక స్త్రీ ఉంది. ఆమె నుంచే ఆ పరిమళం వస్తున్నది. ఆమె పరాశరుని వరం చేత యోజనగంధిగా మారిన మత్స్యగంధి. 

       శంతనునికి ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది. ఆ విషయమే ఆమెతో చెప్పాడు. అందుకామె మా తండ్రి దాశరాజుతో మాట్లాడండి అని చెబుతోంది.

        శంతనుడు దాశరాజు వద్దకు వెళ్లి తన కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అందుకు దాశరాజు సంతోషిస్తూ తన కుమార్తెను శంతనుడికి ఇవ్వడానికి  అభ్యంతరం లేదని, కానీ మత్స్యగంధికి పుట్టబోయే సంతానానికి రాజ్యాధికారం దక్కాలని అడుగుతాడు. ఆ నియమానికి శంతనుడు ఒప్పుకోలేదు. గాంగేయుడికి తప్ప వేరే వారికి రాజ్యం ఇవ్వడం అతనికి ఇష్టం లేదు.

       

   విచారంతో శంతనుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. కానీ అతని మనసంతా యోజనగంధి మీద లగ్నమవడం  వల్ల అతను రాచకార్యాలను సరిగా చూడటం లేదు. ఎప్పుడూ విచారంగా ఉంటున్నారు.

         తండ్రి విచారానికి కారణమేదో కనుక్కున్న గాంగేయుడు, తన మంత్రులతో చర్చించి దాశరాజు దగ్గరకు వెళ్లాడు.

            దాశరాజు నియమానికి ఒప్పుకున్నాడు. అప్పుడు దాశరాజు ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాడు."మీరు మాట ఇచ్చారు కాబట్టి మాట మీద నిలబడతారు. కానీ మీరు  మీ కుమారులు రాజ్యానికి పోటీ రారని నమ్మకం ఏముంది?" అని.

              అప్పుడు గాంగేయుడు "పెళ్ళి చేసుకుంటేనే కదా! కుమారులు పుడతారు. అందుకే నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని" భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా పేరుగాంచాడు.

         యోజన గంధి(సత్యవతి) శంతనులకు ఇచ్చి వివాహం జరిగింది. వీరికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు కుమారులు కలిగారు.

    శంతనుడు కొంత కాలానికి చనిపోయాడు. భీష్ముడు చిత్రాంగదుడువిచిత్రవీర్యులను పెంచి పెద్ద  చేసి చిత్రాంగదుడిని చక్రవర్తిగా చేశాడు. ఒకసారి ఒక గంధర్వరాజుతో యుద్ధానికి తలపడి ఆ యుద్ధంలో చిత్రాంగదుడు చనిపోయాడు.

    తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని చక్రవర్తిని చేశాడు.

              కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటిస్తే భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్లి క అంబ, అంబిక, అంబాలికలను అందరి రాజులను ఓడించి తీసుకొచ్చి తన సోదరుడికిచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అప్పుడు అంబ తన తండ్రి తన్ని సాల్వుడికిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించారని, తనకు కూడా సాల్వుడంటే ఇష్టమని, మీరు నన్ను బలవంతంగా తీసుకు వచ్చారు ధర్మం మీరే నిర్ణయించండి అని అడిగింది. వెంటనే భీష్ముడు ఆమెను సాల్వుడి దగ్గరకు పంపడానికి ఏర్పాటు చేశాడు. కానీ  సాల్వుడు ఆమెను వివాహమాడడానికి ఒప్పుకోలేదు. 

          అంబిక, అంబాలికలను విచిత్రవీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు భీష్ముడు. కొంతకాలానికి విచిత్రవీర్యుడు చనిపోతాడు. 

                ఇప్పుడు రాజ్యం రాజు లేని రాజ్యం అయింది. ఏమి చేయాలో అర్థం కాలేదు సత్యవతికి. తన వంశం నిర్వీర్యం అయిపోతున్నందుకు చాలా బాధపడుతుంది. ఆమె ఆలోచించి ఒకరోజు భీష్ముని వద్దకు వచ్చి కుమార ప్రస్తుతం ఈ భరత సామ్రాజ్యానికి వారసులు లేరు. నువ్వు ఒక్కడివే ఉన్నావు. కాబట్టి నువ్వు హాయిగా పెళ్లి చేసుకుని వంశాన్ని నిలుపమని అర్ధించింది.  అందుకు భీష్ముడు ఒప్పుకోలేదు. నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నేను వివాహం చేసుకోలేనని సత్యవతి కోరికను తిరస్కరించాడు.                            

                  విధిలేని పరిస్థితుల్లో ఉత్తమ బ్రాహ్మణుల వలన సంతానం పొందడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది ధర్మ విరుద్ధం కాదు. అందుకని మనం ఇప్పుడు ఒక ఉత్తమ బ్రాహ్మణుని ద్వారా ఈ వంశాన్ని నిలబెట్ట వచ్చని, దీనిని దేవరన్యాయం అంటారని భీష్ముడు తెలిపాడు.

                   సత్యవతికి తనకు వ్యాసుడు కుమారుడుగా జన్మించినపుడు ఇచ్చిన మాట గుర్తుకు వస్తుంది- ఎప్పుడు తలచుకుంటే అప్పుడు ప్రత్యక్షం అవుతానని. వ్యాసుని తలంచుకుంటుంది. మహర్షి ప్రత్యక్షమవుతాడు. సత్యవతి  పిలిపించిన కారణం చెబుతుంది. అందుకు వ్యాసుడు అంగీకరిస్తాడు.

             అంబిక జడలతో వికృతంగా ఉన్న తనని  చూసి భయంతో కళ్ళు  మూసుకున్నందు వల్ల   పుట్టు గుడ్డి వాడు అయిన కుమారుడు జన్మిస్తాడని చెబుతాడు వ్యాసుడు. కురు సామ్రాజ్యానికి గుడ్డివాడు రాజు కావడానికి వీల్లేదు. అందుచేత రాజ్యాధికారం వహించగల కుమారుని అంబాలిక అనుగ్రహించమని వ్యాసుని కోరుతుంది సత్యవతి. అందుకు వ్యాసుడు అంగీకరిస్తాడు.

                అంబాలిక కూడా వ్యాసుని చూసి భయపడి పాలిపోతుంది. అందువల్ల పాండు రోగం గలిగిన కుమారుడు పుడతాడు అని వ్యాసుడు చెప్తాడు.  అప్పుడు మళ్ళీ సత్యవతి ఏ అవలక్షణాలు లేని మరో కుమారుని ప్రసాదించమని అడుగుతుంది. సత్యవతి పెద్ద కోడలు అంబికను మళ్లీ వ్యాసుని శయ్యాగృహానికి వెళ్ళమంటుంది. అది ఇష్టం లేదు అంబికకు. మరోవైపు ఎదురు చెప్పలేదు. అందుకే ఒక ఉపాయం ఆలోచించింది. వ్యాసుని  పడకగదికి తన దాసిని  పంపింది. దాసి సంతోషంగా వ్యాసునితో గడిపింది. 

              

  వ్యాసుడు సత్యవతితో "అమ్మా! అంబిక తన దాసిని పంపింది. ఆమె గర్భంలో శాపగ్రస్తుడైన యమధర్మరాజును నిక్షిప్తం చేశాను. వాడు మహా విద్వాంసుడు, ధర్మ పరుడూ అయి ఈ వంశ శ్రేయస్సుకు పాటుపడతాడు" అని చెప్పి వ్యాసుడు నిష్క్రమించాడు.

               అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, దాసికి విదురుడు జన్మిస్తారు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు భీష్ముని సంరక్షణలో పెరిగి పెద్దవారయ్యారు. భీష్ముడు దృతరాష్ట్రునికి యువరాజ పట్టాభిషేకం చేశాడు. గాంధారదేశ రాజు సుబలుడి కుమార్తె గాంధారిని తెచ్చి ధృతరాష్ట్రునికి పెళ్లి చేశాడు. ధృతరాష్ట్రుడు గాంధారి చెల్లెళ్ళు పదిమందిని కూడా వివాహం చేసుకున్నాడు. ధృతరాష్ట్రునికి మరొక నూరు మంది కన్యలతో కూడా వివాహం జరిపించాడు. . వీరితో కలిపి ధృతరాష్ట్రుని భార్యలు 111 మంది.  

            భారతం క్విజ్ -2 కోసం కింది లింకును క్లిక్ చేయండి

             

                కుంతిభోజుడు కుంతికి స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరంలో కుంతి పాండురాజును వరించింది. వారిద్దరికీ వివాహం జరిగింది. తరువాత భీష్ముని అనుమతితో పాండురాజు మద్రరాజు కుమార్తె అయిన మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత పాండురాజు దిగ్విజయ యాత్రకు వెళ్లాడు. నాలుగు దిక్కులలో ఉన్న రాజులందరినీ జయించి రాజ్యాన్ని విస్తరించాడు 

      ఒకరోజు  పాండురాజు వేట నిమిత్తం అడవికి వెళ్ళాడు. అడవిలో ఒక చోట కిందముడనే ముని, ముని భార్య జింకల రూపంలో  శృంగార క్రీడలో ఉన్నప్పుడు వాటి పైకి బాణం వదిలాడు. ఆడ జింక వెంటనే చనిపోయింది. తన తోడు దూరమైనందుకు మగ జింక అల్లాడుతూ దీనికి కారణమైన పాండురాజుకు "ప్రణయ కలాపంలో ఉన్న మమ్మల్ని కొట్టావు కాబట్టి, నువ్వు నీ భార్యలతో సంగమిస్తే మరణాన్ని పొందుతావని శాపం పెట్టి మగ జింక కూడా చనిపోతుంది.

      పాండురాజు శతశృంగ పర్వతం మీద తన భార్యలతో నివాసముంటూ తనకు సంతానం పొందే అవకాశం లేనందుకు చింతిస్తూ ఉంటాడు. పితృ ఋణం తీర్చుకునే యోగం తనకు లేదని బాధపడుతూ కుంతితో ధర్మమార్గంలో తమకు సంతానం కలిగేటట్లు చేయమని కోరుతాడు. అప్పుడు కుంతి తనకు దుర్వాస మహర్షి ప్రసాదించిన వరం గురించి చెబుతుంది. పాండురాజు సంతోషంగా తన అంగీకారాన్ని తెలుపుతాడు. 

       దృతరాష్ట్రుడి వలన హస్తినాపురంలో గాంధారి గర్భవతి అయ్యింది.

       కుంతి ధర్మ దేవుని ఆరాధించి గర్భం ధరించి, ధర్మరాజుని ప్రసవించింది. 

    ఈ విషయం తెలుసుకున్న గాంధారి కుంతి కంటే ముందే గర్భం ధరించిన తనకు ముందు ప్రసవం కాకుండా తనకంటే ముందే కుంతికి ధర్మరాజు పుట్టడం వలన భరించలేక కడుపు మీద కొట్టుకుంటుంది ఆమెకు గర్భస్రావం అయ్యింది. ఇది తెలిసిన వ్యాసుడు హస్తినాపురానికి వచ్చి ఆ మాంస ఖండాలను 101 భాగాలుగా విభజించి, వాటిని నేతి కుండలలో పెట్టి కాపాడమని చెప్పాడు. ఆ కుండలలో నుంచి 100 మంది పుత్రులు ఒక పుత్రిక కలుగుతారని చెప్పాడు. 

  కుంతీదేవి భర్త కోరిక ప్రకారము వాయుదేవుని ప్రార్ధించి ఆయన దయ వలన  భీముడికి జన్మనిచ్చింది.

  ఇదే సమయంలో హస్తినలో కలి అంశతో దుర్యోధనుడు జన్మించాడు. తరువాత రోజుకు ఒకరు చొప్పున నూరు మంది కుమారులు జన్మించారు. చివరగా  నూటొకటో పిండము నుంచి దుస్సల పుట్టింది.

                  కుంతి దేవేంద్రుని ఆరాధించి అర్జునుడికి జన్మనిచ్చింది. మాద్రికి కూడా సంతాన భాగ్యం కలిగేలా చేయమని మాద్రిని కోరాడు పాండురాజు. దుర్వాసుని మంత్ర ప్రభావంతో అశ్వనీదేవతలను ప్రార్ధించింది. మాద్రికి సంతానం కలిగించమని కోరింది. మాద్రికి అశ్వనీదేవతల అంశతో నకుల, సహదేవులు జన్మించారు.

              కుంతికి సంతానం కలిగిన వి‌షయం తెలిసి కుంతి అన్న వసుదేవుడు తన చెల్లెలు పిల్లలకు ఎన్నో కానుకలను తన పురోహితుడు కశ్యపుని చేత పంపించాడు.

          ఇంతలో వసంత కాలం వచ్చింది. ఒకరోజు పాండురాజు మాద్రి మనోహర రూపాన్ని చూసి తన్మయుడై బలవంతంగా ఆమెతో సంభోగ సుఖాన్ని అనుభవించి ప్రాణాలు కోల్పోయాడు. మాద్రి పాండురాజు చితి మీదికి ఎక్కి సహగమనం చేసింది.

    తరువాత కుంతి ఐదు మంది పాండు కుమారులతో హస్తినకు చేరుకుంది. దృతరాష్ట్రుడు తన కుమారులు, పాండు రాజు కుమారులు అనే బేధ భావన లేకుండా అందరినీ సమానంగా పెంచుతున్నాడు. ఆటపాటల్లో ఎప్పుడు భీముడే అందరికన్నా మేటిగా  ఉండేవాడు.  భీముడు పెట్టే బాధలు పడలేక దుర్యోధనుడు తన మేనమామ శకుని, తమ్ముడు దుశ్శాసనుని తో భీముని ఎలా అణచాలని ఆలోచిస్తూ ఉండేవాడు.  చివరికి భీముని చంపాలి అనే ఆలోచన వస్తారు.

       ఒక రోజు అందరూ జలక్రీడలు ఆడి మైమరచి నిద్రపోతున్న సమయంలో దుర్యోధనుడు భీముని తీగలతో కట్టించి గంగలో తోయించాడు. కానీ భీముడు నిద్ర మేల్కొని ఒళ్ళు విరుచుకోగానే తీగలన్నీ గడ్డిపోచల్లా తెగిపోయాయి. చాలాసార్లు దుర్యోధనుడు భీముని చంపించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

          భీష్ముడు కౌరవులకు, పాండవులకు కృపాచార్యులు, ద్రోణాచార్యులను గురువులుగా నియమించి  విలువిద్య నేర్పించ సాగాడు. ఒకరోజు ద్రోణాచార్యుడు తన శిష్యులతో మీలో నా కోరికను ఎవరు తీరుస్తారు? అని అడుగుతాడు. కౌరవులంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. కానీ అర్జునుడు మాత్రం ముందుకు వచ్చి నేను మీ కోరిక తీరుస్తానంటాడు. ద్రోణుడు సంతోషిస్తాడు అర్జునుని కౌగిలించుకున్నాడు. అర్జునుడికి పరశురాముడు తనకు ఇచ్చిన శాస్త్రాస్త్రాలను అన్నింటిని నేర్పిస్తాడు. 

            దేశదేశాల రాకుమారులు వచ్చి ద్రోణుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నారు. ద్రోణుడి కీర్తి విని హిరణ్యధన్యుడు అనే ఎరుకల రాజు కొడుకు ఏకలవ్యుడు ద్రోణుని వద్దకు వచ్చి విలువిద్య నేర్పమని అడిగాడు. కానీ ద్రోణుడు హీనజాతి వాళ్లకు విలువిద్య నేర్పనని తిరస్కరించాడు.

           ఒకరోజు ద్రోణుడు తన శిష్యుల విలువిద్యా నైపుణ్యాన్ని పరీక్ష చేయడానికి ఒక బొమ్మ పక్షిని తయారు చేసి ఒక చుట్టు పైభాగంలో ఒక కొమ్మకు కట్టాడు. తన శిష్యులను పిలిచి దాన్ని చూపించాడు. నేను చెప్పినప్పుడు ఆ పక్షిని కొట్టాలని చెప్పాడు. మొదట ధర్మరాజును పిలిచి 

        "ధర్మజా.. చెట్టు కొసన ఉన్న పక్షిని చూసావా ? " అని అడిగాడు. 

        "చూశాను గురువర్యా" అని బదులు చెప్పాడు ధర్మరాజు. 

        " ఆ చెట్టును, నన్ను, నీ తమ్ముళ్ళను చూశావా" అని అడిగాడు.

        "చూశాను గురువర్యా" అన్నాడు ధర్మరాజు. ద్రోణుడు ధర్మరాజుని చూసి "నీ దృష్టి చెదిరింది" నువ్వు కొట్టలేవు" అన్నాడు.   ఇదే విధంగా మిగిలిన వారినందరినీ అడిగాడు. వారందరూ తమకు చెట్టు కొసన పక్షి తలతో పాటు మిగిలిన అన్నీ కనపడుతున్నాయని చెప్పారు. ఆఖరున అర్జునుడిని విల్లు ఎక్కు పెట్టమన్నాడు ద్రోణాచార్యుడు. మిగిలిన వాళ్ళును అడిగినట్లుగానే అర్జునుని కూడా అడిగాడు. అర్జునుడు మాత్రం "గురుదేవా.. నాకు పక్షి తప్ప మరి వేరే ఏదీ కనిపించడం లేదు" అని బదులిచ్చాడు. అర్జునుడి ఏకాగ్రతకు లక్ష్య భేధనకు ద్రోణుడు సంతోషించాడు. 

xxxxxxxxx

          ఒకరోజు రాకుమారులతో పాటు ద్రోణుడు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్లారు. ద్రోణుడు నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఒక మొసలి ద్రోణుడు కాలు పట్టుకుని నీటిలోకి లాగసాగింది. రాకుమారులంతా దిక్కుతోచక పరిగెడుతున్నారు. అర్జునుడు మాత్రం నీటిలో కనిపించకుండా ఉన్న ఆ ముసలి తన బాణాలతో కొట్టి ద్రోణుని కాపాడాడు. అతని విలువిద్యా నైపుణ్యానికి ద్రోణుడు సంతోషించి ఎప్పటికైనా ద్రుపదుని మీద ఉన్న తన పగను తీర్చే వాడు అర్జునుడేనని నమ్మకం కుదిరింది. అర్జునుడికి అనేక దివ్యమైన అస్త్రాలను ఇచ్చాడు.

            రాకుమారుల విద్యాభ్యాసం పూర్తి అయింది. విద్యా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనలో రాకుమారులంతా తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అర్జునుడి ప్రదర్శన చూసి సభాసదులంతా చప్పట్లతో జేజేలు కొడుతున్నారు. ఇంతలో కర్ణుడు ప్రవేశించాడు. సహజ కుండలాలతో ప్రకాశిస్తున్న కర్ణుని చూచి జనం విస్మయంతో చూస్తున్నారు. సభా మధ్యంలో నిలబడి అందరికీ నమస్కరించి, అర్జునుడు ప్రదర్శించే విద్యలన్నీ తాను కూడా ప్రదర్శించగలనని అన్నాడు. ద్రోణుడు తెచ్చాడు అర్జునుడు చూపిన అష్ట విద్యలన్నీ తాను చేసి చూపాడు. అర్జునుడితో ద్వంద్వ యుద్ధానికి అనుమతి కోరాడు. అందుకు కృపాచార్యుడు, యుద్ధం చేయాలంటే రాజులకు మాత్రమే అర్హత ఉంది. నీ తల్లిదండ్రుల గురించి చెప్పి అర్జునునితో యుద్ధంలో పాల్గొనవచ్చని అన్నాడు. దుర్యోధనుడు అప్పటికప్పుడు భీష్ముడు ధృతరాష్ట్రుని అనుమతితో అక్కడికక్కడే కర్ణుడిని అంగ రాజ్యానికి రాజుని చేశాడు. ఆనందంతో కర్ణుడు తాను దుర్యోధనునితో ఏమివ్వగలనని అంటాడు. అందుకు దుర్యోధనుడు నీ స్నేహాన్ని కోరుతున్నాను. నాతో స్నేహం చేయి అని కోరతాడు. కర్ణుడు జీవితాంతం దుర్యోధనుడికి మిత్రుడిగా ఉండటానికి అంగీకరించాడు. ఆ రోజుకు ప్రదర్శన ముగిసింది దుర్యోధనుడు కర్ణుడిని వెంటబెట్టుకుని రాజసౌధానికి వెళ్ళాడు. ఇదంతా చూస్తున్న కుంతిదేవి కర్ణుడిని గుర్తు పట్టింది. కానీ అర్జునుడి మీద ప్రేమతో దాన్ని బయటపడనీయలేదు. 


           రాకుమారులందరికీ విలువిద్య పూర్తయింది. గురుదక్షిణగా ఏమి కావాలో చెప్పమని రాకుమారులు గురువు గారిని అడిగారు. ద్రోణుడికి పాత పగ గుర్తుకు వచ్చింది. గర్వాంధుడైన ద్రుపదుడిని పట్టి తెచ్చి ఇవ్వమని అడిగాడు.

               వెంటనే దుర్యోధనాదులు రథాలపై పాంచాల దేశం వైపు వెళ్లారు. కానీ ద్రుపదుని చేతిలో ఓడిపోయారు. పాండవులు ద్రోణాచార్యుని రధము మీద ఎక్కించుకుని పాంచాల దేశం వెళ్లారు. ద్రుపదుని ఓడించి రథ చక్రానికి కట్టి తీసుకుని వచ్చి ద్రోణుడి ముందు పడవేశారు. తన పగ తీరని అందుకు ద్రోణుడు సంతోషించి ద్రుపదుని వదిలిపెట్టాడు.

                                  **** 

            ధృతరాష్ట్రుడు ధర్మరాజుని కురు సామ్రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. పాండవుల వైభవాన్ని చూసి దుర్యోధనుడు ఓర్వలేకపోయాడు. ఒకరోజు తండ్రి అయిన దృతరాష్ట్రుని వద్దకు వెళ్లి "తండ్రీ.. పాండవులు మహావీరులు. పైగా నువ్వు ధర్మరాజుని యువరాజుగా చేశావు. దేశంలోని ప్రజలు, మంత్రులు, సామంతులు అందరూ అతని మీదనే అనురాగం చూపుతున్నారు. ఇలాగే జరిగితే మేము మా కొడుకులు, మనుమలు వారికి సేవ చేయాల్సి వస్తుంది. బానిసలుగా జీవించాల్సి వస్తుంది. ఇది మీకు సంతోషమేనా? కాబట్టి వాళ్లను ఇక్కడ నుండి వారణావతం పంపుదాం. కొంత కాలం వారు కనబడకపోతే మంత్రులు, సామంతులు, ప్రజలు అందరూ నన్నే రాజుగా అభిమానిస్తారు. గౌరవిస్తారు. నేను రాజు గా స్థిరపడిన తర్వాత పాండవులను మళ్ళీ ఇక్కడకు పిలిపిద్దాం" అన్నాడు దుర్యోధనుడు. అందుకు సరేనన్నాడు ధృతరాష్ట్రుడు. 

               ఒకరోజు ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి " నాయనా ధర్మజా! మీరు రుమీరు మీ తండ్రికి తగ్గ తనయులు. ఇంతకాలం రాజ్యభారాన్ని వహించి అలసిపోయారు. కాబట్టి గంగా నది తీరాన ఉన్న వారణావతం సర్వ సుఖాస్పదం అని అందరూ చెబుతుంటారు. మీరు కుంతిదేవి తో సహా అక్కడ కొంతకాలం హాయిగా గడిపి రండి" అని చెప్పాడు. పెద తండ్రి ప్రేమతో చెబుతుంటే ధర్మరాజు కాదనలేక ఒప్పుకున్నాడు. 

  ధర్మరాజు ఒప్పుకోగానే దుర్యోధనుడు పురోచనుడుని పిలిచి  పాండవులు వారణావతంలో  ఉండేందుకు  తగిన గృహాలు నిర్మించాలని, వాటిని లక్క, మట్టి, నెయ్యి కలిపిన మిశ్రమంతో నిర్మించాలని, పాండవులు ఆ గృహాలు నివశిస్తూ ఏమరుపాటుగా  ఉన్నప్పుడు ఆ ఇళ్లు తగలబడేలా చేయాలని, అలా చేస్తే జీవితాంతం భోగాలు అనుభవించే లా చేస్తానని ప్రలోభపెట్టాడు. గృహాలు నిర్మించడానికి పురోచనుడు వారణావతం వెళ్ళాడు.

      పెద్దల ఆశీర్వాదాలు అందుకుని కుంతీ దేవితో వారణావతానికి బయలుదేరారు పాండవులు. నగర పౌరులు అంతా కంటతడి పెట్టారు ప్రయాణ ప్రారంభవేళ  సభలో అందరూ వింటుండగానే  విదురుడు ద్వంద్వార్థాలతో కూడిన వాక్యాలతో "పాండునందనులారా శత్రు వ్యవహారాలను అవగతం చేసుకున్నవాడు ఆ ప్రమాదం నివారణకు ప్రయత్నించాలి. లోహ నిర్మితం కాని శస్త్రం ఉన్నది. దాని అఘాతం తినకుండా రక్షించుకోవాలి. ఎండిన గడ్డి తో ఉన్న అడవి మండుతున్నా కలుగులో దూరిన ఎలుక నాశనం కాదు. తరువాత అది సరైన దారి చూసుకొని బయటపడుతుంది. దిక్కు తెలియడానికి నక్షత్రం ఉన్నది. పంచేంద్రియాలను స్వాధీనంలో ఉంచుకున్నవాడు శత్రు పీడ నుండి విముక్తులవుతాడు" అని లక్క ఇంట్లో దహనం చేయబోతున్నారని అన్యాపదేశంగా చెప్పాడు. ధర్మరాజు "మహామంత్రీ! మీ మాటలు నాకు అర్థమయ్యాయి" అని సోదరులతో పాటు ఐరావతానికి బయలుదేరాడు

  ఐరావత ప్రజలు ఆనందంతో పాండవులకు స్వాగతం పలికారు. పురోచనుడు తాను నిర్మించిన గృహాలలో పాండవుల చేత గృహప్రవేశం చేయించారు. ధర్మరాజు, భీముడు ఆ గృహాలలో లక్క నేతి వాసన రావడం గుర్తించారు. విదురుడి మాటలు ధర్మరాజుకు గుర్తుకు వచ్చాయి.

   పురోచనుడు పాండవులకు సేవ చేయడానికి ఒక బోయ వనితను నియమించాడు. ఆమెకు ఐదుగురు  కొడుకులు. అందరూ పాండవులు నివశిస్తూ ఉన్న గృహం లోనే ఉన్నారు. పాండవుల కదలికలు రహస్యంగా ఎప్పటికప్పుడు ద్రోణుడికి పురోచనుడు చేరవేస్తున్నారు హస్తినాపురం లో ఉన్న విదురునికి సుయోధనుని కుతంత్రం తెలిసింది. వెంటనే సొరంగాలను తవ్వే ఖనకుడిని పాండవుల వద్దకు పంపించాడు. ఖనకుడు పాండవులు  నివసించు లక్క ఇంటి నుండి వెలుపలికి ఒక బిలమార్గమును ఏర్పాటు చేశాడు

  ఒకరోజు కుంతీ దేవి వారణావతంలో నున్న బ్రాహ్మణులకు, ముత్తైదువులకు వారికిష్టమైన భోజనాలు ఏర్పాటు చేసి దక్షిణ ఇచ్చింది. ఆ రాత్రి పాండవులకు సాయంగా ఉన్న బోయ స్త్రీ తన కొడుకులతో పాటు కల్లు తాగి మత్తుగా నిద్రపోతున్నారు

  అంతా సద్దుమణిగిన తరువాత భీముడు ముందుగా పురోచనుడు నిద్రపోతున్న ఇంటికి నిప్పు పెట్టాడు. తన తల్లిని సోదరులను ముందుగా సొరంగ మార్గం గుండా బయటికి పంపాడు. తర్వాత తాము నివసించు ఇంటిని తగలబెట్టాడు.  ఖనకుడికి  తాము క్షేమంగా ఉన్న విషయాన్ని చెప్పి భీముడు కూడా సొరంగ మార్గం ద్వారా బయల్దేరి తల్లిని సోదరులను చేరుకున్నాడు.

   తెల్లవారిన తర్వాత లక్క ఇల్లు తగలడం వారణాసి ప్రజలు చూశారు. అందరూ వచ్చి బూడిద తొలగించారు. అందులో బోయ స్త్రీ, ఆమె ఐదుగురు కొడుకుల శవాలు కనిపించాయి. ఆ ఆరుగురు, కుంతీదేవి, పంచపాండవుల శవాలుగా భావించి భోరున విలపించారు. 

                                 ***

      పాండవులు వారణావతానికి దక్షిణంగా నడవసాగారు. అందరూ అలిసిపోగా ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. చీకటి పడింది. భీముడు వారికి కాపలాగా కూర్చున్నాడు. పాండవులు విశ్రాంతి తీసుకుంటున్న ప్రదేశాన్ని దగ్గరగా హిడింబుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడికి నర వాసన సోకే సరికి  చెల్లెలిని పిలిచి ఆ నరులను వండి పెట్టమని చెప్పాడు.

   హిడింబి పాండవుల దగ్గరకు వెళ్ళింది. పాండవులను కాపలాగా ఉన్న భీముని చూసింది. భీముడి మీద మనసు పడింది. వెంటనే మానవ రూపం ధరించింది. భీముని వద్దకు వచ్చి తనను పెళ్లి చేసుకోమని అడిగింది. భీముడు ఆమె కోరికను ఒప్పుకోలేదు

   చెల్లెలు ఎంతకూ తిరిగి రాకపోయేసరికి హిడింబుడు పాండవులు ఉన్నచోటికి అక్కడికి వచ్చాడు.

  భీముడికి హిడింబునకు ఘోరమైన యుద్ధం జరుగుతుంది. భీముని చేతిలో హిడింబుడు ప్రాణాలు విడిచాడు

  పాండవుల అక్కడి నుంచి బయల్దేరారు.  హిడింబ కూడా వాళ్లను అనుసరిస్తూ, తనకు జరిగింది, జరుగుతున్నది, జరగబోయేదీ తెలుసని మీరు నన్ను స్వీకరిస్తే మీకు ఎంతో సహాయంగా ఉంటానని, లేకపోతే ప్రాణాలు తీసుకుంటానని చెబుతుంది. మీకు జరగబోయే దాని చెబుతాను వినండని, ఇక్కడికి కొంచెం దూరంలో శాలిహోత్రుడు అని మహాముని ఆశ్రమం ఉంది. అక్కడ ఉన్న కొలనులో నీరు తాగితే ఆకలి దప్పులు ఉండవు. మీరు అక్కడే ఉండండి. మీకు వ్యాసుడు వచ్చి హితోపదేశం చేస్తాడని చెబుతుంది.

  హిడింబ మాటలపై కుంతికి నమ్మకం కలిగింది. భీముడు తల్లి మాట ప్రకారం హిడింబిని పెళ్ళి చేసుకున్నాడు. 

  ఒకరోజు వేదవ్యాసుడు పాండవుల వద్దకు వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండమని, తర్వాత దగ్గర్లో ఉన్న ఏకచక్రపురానికి వెళ్లి, అక్కడ బ్రాహ్మణ రూపంలో నివసించమని చెప్పాడు

  వ్యాసుని మాట ప్రకారము పాండవులు శాలిహోత్రుడు ఆశ్రమంలో కొంతకాలం నివసించారు. ఇంతలో హిడింబి గర్భం ధరించి ఘటోత్కచునికి జన్మనిచ్చింది. ఘటోత్కచుడు అపరిమితమైన బలం కలవాడు. కామరూపుడు శాలిహోత్రుని వద్ద పాండవులు ధర్మ శాస్త్రాలు, నీతి శాస్త్రాలు అభ్యసించారు. తరువాత వారు బ్రాహ్మణ రూపాలలో ఏకచక్ర పురం అనే గ్రామానికి వెళ్లి ఒక బ్రాహ్మణ ఇంట్లో నివాసం ఏర్పరుచుకున్నారు

  పాండవులు ప్రతిరోజు అందరి ఇళ్లకు వెళ్లి భిక్ష స్వీకరించి, తీసుకువచ్చి తల్లికి ఇచ్చేవారు. కుంతీదేవి ఆ భిక్షను రెండు భాగాలు చేసి,  ఒక భాగాన్ని భీమునికి పెట్టి, మిగిలిన దానిని తాను, నలుగురు కొడుకులు తినేవాళ్ళు. పాండవుల సత్ప్రవర్తన సహృదయత చూసి అగ్రహారం లో ఉన్న వాళ్ళందరూ ఆనందపడే వాళ్ళు.

  ఒకరోజు పాండవులు ఆశ్రయం పొందుతున్న బ్రాహ్మణుల ఇంట ఏడుపులు వినిపిస్తుంటే విషయం ఏమిటని అడిగింది కుంతి. అందుకు వాళ్ళు తమకు బకాసురుడు అనే రాక్షసుడి పీడీ ఉందని,  వాడికి రోజుకు ఒక బండి అన్నం, రెండు దున్నపోతులు, ఒక మనిషి ఆహారంగా పోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని, ఈరోజు మా ఇంటి వంతు వచ్చిందని బాధపడుతూ చెబుతారు. అందుకు కుంతి వారితో బాధపడొద్దని,మీకు మారుగా  కుమారుని  పంపుతానని చెప్పింది. అందుకు ఆ బ్రాహ్మణ కుటుంబం ఒప్పుకోకపోతే, కుంతీ దేవి బలవంతంగా వారిని ఒప్పించింది

   వెంటనే ఊరి వారంతా రకరకాలైన పిండి వంటలు ఆహార పదార్థాలు తయారు చేసి ఒక బండి నిండా నింపారు. భీముడు ఆ బండి తోలుకుంటూ బకాసురుడు ఉండే చోటికి వెళ్లాడు. బకాసురుడు కనిపించలేదు .బండిలో ఉన్న ఆహారాన్ని మొత్తం తినేసాడు. తన కోసం తెచ్చిన ఆహారాన్ని భయం లేకుండా నరుడు తినడం చూసి బకాసురుడు సహించలేకపోయాడు. భీముని ఒక పోటు పొడిచాడు. భీముడికి చీమకుట్టినట్టు కూడా లేదు. బకాసురుడు పక్కనే ఉన్న ఒక చెట్టును పీకి భీముడి మీద వేశాడు. భీముడికి కోపం వచ్చింది. బకాసురుడి తో కలబడ్డాడు. ఇద్దరికీ ఘోరయుద్ధం జరిగింది. భీముడు బకాసురుడిని మల్ల యుద్ధం చేసి చంపేశాడు. భీముడు బకాసురుని కళేబరాన్ని ఈడ్చుకుని వచ్చి ఏకచక్రపురం పొలిమేరలో పడేశాడు. అది చూసి  ఏకచక్రపుర వాసులందరూ ఎంతో సంతోషించారు. భీముని పరాక్రమాన్ని ఎంతగానో కొనియాడారు. 

                               ***

        ఒక రోజు ఒక బ్రాహ్మణుడు ఏకచక్రపురంలో ఉంటున్న పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఆ బ్రాహ్మణుడికి అతిథి సత్కారాలు చేసి,అతను ఏ ఏ దేశాలు తిరిగాడో ఆదేశాల విశేషాలు గురించి అడిగాడు.

           ఆ బ్రాహ్మణుడు ఎన్నో దేశాలు చూశానని, కానీ ద్రుపదుడు పాలించే పాంచాల దేశాన్ని మించిన దేశం లేదని, ద్రుపద మహారాజు కు అగ్నిగుండం నుంచి ద్రౌపది అనే కుమార్తె ఉద్భవించిందని, ప్రస్తుతం ఆమెకు వివాహం సంకల్పించాడని చెబుతారు

         అప్పుడు ధర్మరాజు ఆశ్చర్యపడి ఆమె ఎందుకు మానవులకు జన్మించలేదని అగ్నిగుండంలో ఎందుకు జన్మించిందని వివరంగా చెప్పమని కోరాడు 

           ద్రోణుడు, ద్రుపదుడు మంచి స్నేహితులని, ఒకే గురువు వద్ద పేద నేర్చుకున్నారని,అగ్ని వేసిన వద్ద ఇద్దరూ ధనుర్విద్య నేర్చుకున్నారని, చిన్న విషయంలో వారి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని, తర్వాత ద్రోణుడు కుమారులకు అస్త్ర విద్య నేర్పించి గురుదక్షిణగా ద్రుపదుని బంధించి తెమ్మని కోరాడని, ఆ విధంగా అర్జునుడు ద్రుపదుని  బంధించి తెచ్చి గురువుగారి కాళ్ళ వద్ద పడవేశాడని చెబుతూ ఆపగను తీర్చుకోవడానికి ద్రుపదుడు ద్రోణుని చంపే కొడుకుని అర్జునుని వివాహమాడే కూతురు ని పొందాలని యజ్ఞం చేశాడు. యాజకుడు అనే బ్రాహ్మణుడు ద్రుపదుని ఆయన భార్య కోకిల దేవుని కూర్చోబెట్టి అగ్ని చేయించాడు ఆ సమయంలో యజ్ఞగుండంలో నుండి భయంకరమైన శరీరం కలవాడు పెద్ద ధనుస్సు కలవాడు ఉద్భవించాడు. అతనే దృష్టద్యుమ్నుడు. తరువాత ఒక అద్భుత సౌందర్యరాశి అగ్ని గుండములో నుంచి పుట్టింది. ఆమే ద్రౌపది. ఆమెకు ఇప్పుడు వివాహ వయసు వచ్చింది. ద్రుపదుడు ఆమెకు వివాహం చేయ నిశ్చయించాడు. కానీ లక్క ఇంటిలో అర్జునుడు తన సోదరులతో సహా మృతిచెందాడని తెలిసి చాలా దుఃఖించాడు. కానీ ద్రుపదుని పురోహితుడు మాత్రం, పాండవులకు అన్నీ శుభ శకునములు గోచరిస్తున్నాయి. వారు తప్పక బతికే ఉంటారు అని చెప్పాడు. 

      ద్రుపదుడు ఒక ఉపాయం ఆలోచించి ఒక బలిష్టమైన ధనుస్సును, ఒక మత్స్యయంత్రాన్ని నిర్మించి, ధనుస్సు ఎక్కుపెట్టి ఆ మత్స్యయంత్రాన్ని కొట్టిన వారికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని స్వయంవరం ప్రకటించాడు. అందుకని రాజులంతా పాంచాల దేశపు వెళ్తున్నారని బ్రాహ్మణుడు చెప్పాడు.

      పాండవులు పాంచాల దేశం పయనమయ్యారు. మార్గమధ్యంలో వ్యాసుని ఆశ్రమ దర్శించారు. వ్యాసుడు పాండవులను ఆశీర్వదించి, పాంచాల దేశం  వెళ్ళమని, వారికి మేలు కలుగుతుందని చెప్పాడు. వ్యాసుని ఆశీర్వాదం తీసుకొని పాండవులు ప్రయాణం సాగిస్తున్నారు. ఒక రోజు అర్ధరాత్రి గంగా తీరానికి చేరుకున్నారు. అది సోమశ్రవ తీర్థం. అందులో స్నానం చేయాలని అనుకున్నారు ఆ సమయానికి అక్కడికి అంగారపర్ణుడు అనే గంధర్వుడు తన భార్యలతో కూడి విహారానికి వచ్చాడు. అక్కడ పాండవులు ఉండడంతో కోపం వచ్చింది. ఇది అర్ధరాత్రి సమయమని, రాక్షసులు గంధర్వులు తిరిగే సమయమని, ఇక్కడికి మానవులు రాకూడదని, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపొండని గర్వంగా పలికాడు.

         అందుకు అర్జునుడు "నువ్వు చెప్పిన మాటలు బలహీనులైన మానవులకు వర్తిస్తాయి. కానీ మా వంటి మహావీరులకు కాదు. ఇంకొక్క మాట.. ఈ భూమి మీద ఉన్న నదులు అందరికీ సొంతం"అని పలికాడు. 

        ఈ మాటలకు అంగారపర్ణుడు కోపించి అర్జునుడి మీద బాణాలు వేశాడు. అర్జునుడా బాణాలను అవలీలగా ఎదుర్కొన్నాడు. అర్జునుడు అంగారపర్ణుడు మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. ఈ ప్రయోగంతో  అంగారపర్ణుడు రథం కాలిపోయింది. అప్పుడు అంగారపర్ణుడు అర్జునునితో " మీ పరాక్రమాన్ని మెచ్చాను. నీతో స్నేహం చేయాలని ఉంది. నేను నీకు చాక్షుసీ విద్యను ఇస్తాను. నీ వద్ద ఉన్న ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వు" అని అడిగాడు. దానికి అర్జునుడు "గంధర్వ నీ వద్దనుండి నేను విద్యలను స్వీకరించలేను. కానీ నీకు ఆగ్నేయాస్త్రం ఇస్తాను.గుర్రాలను మాత్రం స్వీకరిస్తాను" అని అన్నాడు. దానికి అంగారపర్ణుడు సమ్మతించాడు.

అర్జునుడు అంగారపర్ణుడితో" గంధర్వా.. మేము ధర్మబుద్ధి కలవాళ్ళము. మిమ్మల్ని చూసి నువ్వు ఎందుకలా గర్వంగా మాట్లాడావు? అని అడిగాడు" అప్పుడు అంగారపర్ణుడు మీరు ఎవరో నాకు తెలుసు. కానీ ఆడవాళ్ళతో విహరించేవాడు ఎంత వివేకం కలవాడైనా అహంకారం కలిగి ఉంటాడు. అందువల్లనే నేను అలా మాట్లాడాను. ఈ సమయంలో ఒక పురోహితుడు ఉంటే ధర్మాధర్మ విచక్షణ తెలియ చేస్తాడు. మనల్ని తప్పు చేయకుండా నివారిస్తాడు. ఓ తాపత్యా! మీరు కూడా ఒక పురోహితుని ఏర్పాటు చేసుకోండి. ఉత్కోచతీర్థంలో ఉన్న ధౌమ్యుడిని పురోహితునిగా పొందండి" అని చెప్పాడు అంగారపర్ణుడు.

      అంగారపర్ణుడు దగ్గర సెలవు తీసుకుని పాండవులు వారిని అర్చించి పురోహితులుగా స్వీకరించి వారితో పాంచాల దేశం వైపు సాగారు.

      స్వయంవరం లో మత్స్య యంత్రాన్ని అర్జునుడు చేధించాడు. భీమార్జునులు ద్రౌపదిని తమ విడిదికి తీసుకుని వచ్చారు. అప్పటికే కుంతిదేవి చాలా ఆందోళనగా ఉంది స్వయంవరానికి వెళ్లిన వాళ్ళు ఇంకా రానందుకు.  రాగానే అర్జునుడు "అమ్మా! మేము ఒక భిక్ష తీసుకుని వచ్చాము" అని అన్నాడు దానికి కుంతిదేవి సంతోషించి "ఐదుగురూ పంచుకోండి నాయనా" అని చెప్పింది. కుంతి వెనుతిరిగి చూసే సరికి కళ్యాణ తిలకంతో అతిలోక సౌందర్యంతో సర్వ భూషణాలంకృతమైన యువతి కంటపడింది. కొడుకు తెచ్చిన భిక్ష ఒక కన్య అని తెలిసి, అధర్మం పలికినందుకు భయపడింది కుంతి. "అయ్యో! ఏమి తెచ్చారో తెలీక అలా పలికాను. ఇది అధర్మం. ధర్మజా! ఇది లోక విరుద్ధం. ఇప్పుడు ఏం చేద్దాం?" అని అడిగింది.

     "ప్రపితామహులు వ్యాసులవారు ఈ ద్రౌపది మన ఐదుగురికి భార్య కాగలదన్నారు. ఆ మాట ప్రకారమే అమ్మగారి నోట ఆ మాట వచ్చింది. అందుచేత మనం ఐదుగురం పెళ్ళాడాలి" అని నిర్ణయించాడు అర్జునుడి వైపు చూస్తూ ధర్మరాజు. 

      ద్రౌపదిని వెంటబెట్టుకుని భీమార్జునులు వెళ్ళిన క్షణం నుంచి వారిని అనుసరిస్తూ వస్తున్న దృష్టద్యుమ్నుడు పాండవుల విడిది లో జరిగిన కథనంతా తన తండ్రికి తెలియజేస్తూ వాళ్లు పాండవుల లాగే ఉన్నారని అన్నాడు. ద్రుపదుడు సంతోషించి పాండవుల వద్దకు తన పురోహిత పంపుతూ వాళ్లందర్నీ పాంచాల దేశం వచ్చి శాస్త్ర విధిగా వివాహం జరిపించుకోమని చెప్పాడు.

     ద్రుపదుడు పంపిన రథాలపై కుంతి, ద్రౌపది, పాండవులు అందరూ పాంచాల దేశం వచ్చారు. మరునాడు వేదవ్యాసుడు పాంచాల దేశం వచ్చాడు. వ్యాసుని సత్కరించి ద్రుపదుడు ఇలా అన్నాడు "మహాత్మా! నా కుమార్తె ద్రౌపదిని అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి స్వయంవరంలో పొందాడు. కాని ధర్మరాజు తాము ఐదుగురం అన్నదమ్ములం వివాహం చేసుకుంటున్నాడు. ఇది లోక విరుద్ధం కాదా? ధర్మనిర్ణయం చేయండి" అని అడిగాడు‌

      అప్పుడు వ్యాసుడు "ద్రుపద మహారాజా! ధర్మరాజు చెప్పినట్లు నీ కుమార్తె ద్రౌపదిని ఐదుగురికి ఇచ్చి వివాహం చేయి. ఇది ధర్మ నిర్ణయం. నేను ఈ నిర్ణయానికి రావడానికి కారణం ద్రౌపది పూర్వ జన్మలోని కోరిక అంటూ ద్రౌపది పూర్వకథను ద్రుపదునికి ఏకాంతంలో చెప్పాడు. ద్రుపదుడు ద్రౌపదిని పాండవుల ఐదు మందికిచ్చి వివాహం చేయడానికి అంగీకరించాడు.

      మొదట ధర్మరాజు కిచ్చి వివాహం జరిపించాడు వివాహం కాగానే ద్రౌపది శివుని ప్రార్థించింది. ఆ మహేశ్వరుని వరం వలన ఆమెకు కన్యాత్వం సిద్ధించింది. తర్వాత ఆమెను భీమునికిచ్చి వివాహం జరిపించారు. ఆమె మళ్లీ ఈశ్వరుని ప్రార్ధించి తన కన్యత్వాన్ని పొందింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు అర్జునుడు నకులుడు, సహదేవుడు ద్రౌపదిని వివాహమాడారు.ద్రౌపదిని పెళ్ళాడిన తర్వాత పాండవులు  సంవత్సరం పాటు పాంచాల దేశంలో ఉన్నారు. 

      స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని కొట్టినది అర్జునుడని, వారు పాండవులని వేగుల ద్వారా తెలుసుకున్నాడు దుర్యోధనుడు. పాండవులు లక్క ఇంటిలో తగలబడకుండా బతికి బయట పడ్డందుకు ఎంతో చింతించాడు.  విదురుడికి పాండవుల విషయం తెలిసి ఎంతో ఆనందించాడు.

  ఒకరోజు దుర్యోధనుడు కర్ణునితో పాటు ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్లి, పాండవులు బతికే ఉన్నారని విదురుడు ఎల్లప్పుడూ పాండవుల మేలుకోరే వాడని తెలిసి కూడా తమరు విదురుని మాటకు విలువ ఇస్తున్నారని నిర్వేదంగా అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, పైకి పాండవుల అంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు నటిస్తానని, ఆ విషయం విదురునికి తెలియనీయనని అన్నాడు.

    అప్పుడు దుర్యోధనుడు తండ్రితో, పాండవులు ఇప్పుడు ద్రుపదపురంలో ఉన్నారని, వారికి పాంచాల రాజే కాకుండా శ్రీకృష్ణుడు, బలరాముడు మొదలైన వారు తోడుగా ఉన్నారు. ఇప్పుడు వారిని పాంచాల రాజు నుండి వేరు చేయాలని చెప్పాడు. 

      కర్ణుడు ద్రుపదుని ఓడించి పాండవులు తీసుకుని వద్దామని అన్నాడు. అంతా విన్న ధృతరాష్ట్రుడు పెద్దలతో ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుందామని  అన్నాడు.

     మరుసటి రోజు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మొదలైన వారిని సమావేశపరిచి విషయమంతా వివరించాడు. 

      అప్పుడు భీష్ముడు "సుయోధనా!  నాకు నీ మీద కానీ పాండవుల మీద కానీ బేధభావం లేదు. అందరూ నాకు సమానమే. కానీ పాండవులతో యుద్ధం చేయడానికి నేను అంగీకరించను. మీలాగే  పాండవులు కూడా ఈ  రాజ్యానికి వారసులు. అందుచేత పాండవులకు చెందవలసిన రాజ్యాన్ని వారికి పంచి ఇవ్వడం ధర్మం. ఆ ధర్మాన్ని ఆచరించి కీర్తిమంతుడవిగా" అన్నాడు.    ద్రోణుడు కూడా భీష్ముని మాటను సమర్ధించాడు. విదురుడు కూడా వెంటనే పాండవులను పిలిపించి అర్థ రాజ్యం ఇవ్వడమే అందరికీ శ్రేయస్కరమని అన్నాడు. చేసేదిలేక దృతరాష్ట్రుడు దానికి అంగీకరించారు పాండవులు తీసుకురావడానికి విదురుని ద్రుపద పురానికి పంపాడు. 

          ద్రుపదుని అనుమతితో తల్లి కుంతి, భార్య ద్రౌపది, తమ్ముళ్లతో సహా హస్తినాపురానికి  బయల్దేరాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడు దృష్టద్యుమ్నుడు అంతులేని సైన్యంతో వారి వెంట వచ్చారు. అందరూ హస్తినాపురం చేరుకున్నారు. దుర్యోధనుని సోదరులు వికర్ణుడు, చిత్రసేనుడు గురువు ద్రోణుడు కృపాచార్యుడు పాండవులకు ఎదురేగి స్వాగతం పలికారు.

      ఒకరోజు ధృతరాష్ట్రుడు భీష్మద్రోణ విదుర దుర్యోధనాదులు సమక్షములో, శ్రీకృష్ణుని ఎదుట పాండవులతో " ధర్మరాజా! ఇందరి పెద్దల ఎదుట, శ్రీకృష్ణుని సాక్షిగా మీకు అర్ధరాజ్యం ఇస్తున్నాను. నా తమ్ముడు పాండురాజు ఐశ్వర్యమంతా స్వీకరించండి" అని పలికి ధర్మరాజును అర్ధ రాజ్యానికి అభిషిక్తుడిని చేశాడు. ఖాండవ ప్రస్థానాన్ని రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని జనరంజకంగా పాలించుకోమని అన్నాడు. దానికి భీష్మాదులు కూడా అంగీకరించారు. అందరి అనుమతితో ధర్మరాజు తమ్ములతో భార్యతో తల్లితో ఖాండవ ప్రస్థానికి ప్రయాణమయ్యాడు.

      శ్రీకృష్ణుడు ఇంద్రుని పిలిచి, పాండవులకు రాజధాని నగరం నిర్మించి ఇవ్వమని అడిగాడు‌‌. ఇంద్రుడు మయుడు అనే దేవశిల్పికి ఆ పని అప్పగించాడు. మయుడు ఇంద్రప్రస్థం అనే  విలాసవంతమైన ఒక మహా నగరం నిర్మించాడు.

      ఒక శుభముహూర్తాన ధర్మరాజు సోదరులు ద్రౌపదీ సమేతంగా నగర ప్రవేశం చేశాడు. తనకు లభించిన అర్థ రాజ్యాన్ని జనరంజకంగా పాలిస్తున్నాడు. ఒకరోజు నారదుడు ధర్మరాజు దగ్గరకు వచ్చాడు. పాండవులను ఏకాంతంగా పిలిచి "మీరు అన్ని ధర్మాలు తెలిసిన వారు. మీకు తెలియని ధర్మం లేదు. కానీ మీకు ఐదుగురికి ద్రౌపది ఒకటే భార్య. ఈ పద్ధతి లోక విరుద్ధం. శాస్త్ర విరుద్ధం.  ఇదివరకు ఒక స్త్రీ వలన సుందోపనందనులు అనే రాక్షసులు కొట్టుకుని మృతిచెందారు. అలా మీ మధ్య విరోధం రాకూడదు"అని సుందో పసుందుల కథ చెప్పాడు. 

      నారదుని మాటల్లోని అంతరార్థం గ్రహించారు పాండవులు. వారిలో వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ద్రౌపది ఒక్కొక్కరి ఇంటిలో ఒక సంవత్సరం పాటు ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నారు. ద్రౌపది ఎవరి ఇంట్లో ఉంటే ఆ ఇంటి వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడకూడదు. అలా చూస్తే, చూసినవారు సంవత్సరంపాటు తీర్థయాత్రలు చేయాలి. ఈ విధంగా ఒప్పందం చేసుకుని నారదుని ఎదుట ప్రతిజ్ఞ చేసి, ఒప్పందం ప్రకారం నడుచుకుంటున్నారు.

       ఒకరోజు ఒక బ్రాహ్మణుడి ఆవును దొంగలు అపహరించారు. ఆ బ్రాహ్మణుడు అర్జునుడితో ఆ విషయం చెప్పి, తన ఆవుని తెచ్చివ్వమని అడిగాడు. ధనుస్సు ఆయుధాగారంలో ఉంది సమయంలో ధర్మరాజు, ద్రౌపది అధికారంలో ఉన్నారు.  ఏంచేయాలో అర్థం కాలేదు.  బ్రాహ్మణుని బాధ తీర్చడం ముఖ్యం. తప్పదనుకుని వెంటనే అర్జునుడు ఆయుధాగారంలోకి  వెళ్ళి, తన ధనుస్సును తీసుకుని ఆ దొంగలను చంపి , ఆవును బ్రాహ్మణుడికి అప్పగించాడు. 

       తాను నియమాన్ని అతిక్రమించాడు కాబట్టి అనుకున్న ప్రకారం 12 నెలల పాటు తీర్థయాత్రలు చేయడానికి అర్జునుడు బ్రాహ్మణులతోనూ, పౌరాణికతోనూ బయలుదేరాడు.  

   ఒకరోజు ఉలూచి అనే నాగకన్య అర్జునుడి ని చూసి మోహించింది. తన కోరిక తీర్చమని బలవంతం చేసింది. అర్జునుడు ఉలూచితో నాగలోకం వెళ్ళాడు. ఆ రాత్రి ఉలూచితో గడిపాడు. ఫలితంగా ఉలూచి గర్భవతి అయ్యింది ‌ ఇరావంతుడు అనే కుమారుడు జన్మించాడు.

       తర్వాత అర్జునుడు గయ, గంగా సాగర సంగమం మొదలైన క్షేత్రాలను దర్శిస్తూ మణిపూరము అనే నగరానికి వెళ్ళాడు. ఆ దేశపు రాజు చిత్రాంగదుడు. అతని ఆతిథ్యాన్ని స్వీకరించాడు. అతని కూతురు చిత్రాంగదను ప్రేమించాడు. 

      చిత్రాంగదుడు తన కూతురుని అర్జునుడికి ఇచ్చి వివాహం చేయడానికి ఒక నియమం పెట్టాడు. ఆ కన్యక పుట్టబోయే మగ సంతతి తన వంశకరుడు కావాలి. దానికి ఒప్పుకుంటే అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. దానికి అర్జునుడు అంగీకరించాడు. చిత్రాంగదను పెళ్లి చేసుకున్నాడు. బబ్రువాహనుడు అనే కుమారుడు కలిగాడు. 

       శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్ర చాలా అందగత్తె అని విని ఉన్నాడు. అక్కడకు వెళితే సుభద్రను చూడవచ్చును. శ్రీ కృష్ణుని దయ ఉంటే ఉంటే పెళ్లి కూడా చేసుకోవచ్చు అని మనసులో అనుకుని అర్జునుడు మణిపూరం నుంచి ద్వారకా నగరానికి బయల్దేరాడు.  

   యాదవులకు సన్యాసులు అంటే ఎంతో భక్తి, గౌరవం. అందువల్ల అర్జునుడు సన్యాసి వేషంలో ద్వారకానగరం పరిసర ప్రాంతానికి చేరుకున్నాడు. శ్రీకృష్ణుని భక్తితో మనస్సులో తలచుకోగానే శ్రీకృష్ణుడు అర్జునుడి ముందు ప్రత్యక్షమయ్యాడు.

బలరాముడు కూడా అక్కడకు వచ్చి సన్యాసి రూపంలో ఉన్న అర్జునునికి  నమస్కరించి, సన్యాసి చాతుర్మాస ప్రధానికి వ్రతాన్ని చేయాలంటే అందుకు " స్వామి తమరు ఇక్కడే ఉండి తమరి చాతుర్మాస్య వ్రతాన్ని  కొనసాగించండి" అని అర్థించాడు దానికి అర్జున్ సంతోషంగా ఒప్పుకున్నాడు. 

  బలరాముడు తన చెల్లెలు సుభద్రను అర్జునుడికి సేవలు చేయడానికి పంపించాడు.

        ఒక రోజు అర్జునుని "స్వామీ! తమరు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు కదా.. మీకు ఎక్కడైనా మా బావ అర్జునుడు కనిపించాడా?" అని అమాయకంగా అడిగింది సుభద్ర. 

       అర్జునుడు ఇక విషయం దాచి ప్రయోజనం లేదనుకుని తన యువతి రూపం తీసి యదార్థ రూపంలో కనిపించాడు. సుభద్ర ఆనందంతో, సిగ్గుతో పులకించిపోయింది. 

     శ్రీకృష్ణుడికి అర్జునుడు, సుభద్రల మనసులు కలిసిన విషయం తెలిసింది. శివ పూజలు చేయాలని బలరాముడిని ఇతర యాదవులను అంతర ద్వీపానికి  పంపాడు. కూడా వారితో వెళ్ళినట్లు వెళ్లి మరల ద్వారకకు తిరిగి వచ్చాడు. అర్జునుడికి సుభద్రకు వివాహం జరిపించాడు. అర్జునుని సుభద్రని రథం మీద ఇంద్రప్రస్థం పంపించాడు. తర్వాత ఏమీ ఎరగనట్టు బలరాముడు శివ పూజ చేస్తున్న అంతర ద్వీపానికి చేరుకున్నాడు. 

  అర్జునుడు రథం మీద సుభద్రను తీసుకు వెళుతుంటే ద్వారపాలకులు చూశారు. వారికి సుభద్ర అర్జునుల వివాహ విషయం తెలియదు. ఎవరో వీరుడు సుభద్రను తీసుకుపోతున్నాడనుకొని అర్జునుని అడ్డగించారు. అర్జునుడు యాదవ వీరులతో యుద్ధం చేసి వారిని ఓడించాడు. యాదవ వీరులు ఈ విషయాన్ని వెంటనే బలరాముడికి తెలిపారు. 

      బలరాముడు ఆవేశంతో ఊగిపోతూ "కృష్ణా! నీకు తెలియకుండా అర్జునుడు సుభద్రను తీసుకుని వెళ్ళాడా!" అని అడిగాడు. 

    కృష్ణుడు శాంతంగా "అన్నయ్యా! అర్జునుడు తన మేన మరదలిని వివాహమాడి తీసుకొని వెళ్ళాడు. అది తప్పెలా అవుతుంది? ద్రోణాచార్యుని శిష్యుడు అర్జునుడు జీవించడం అంత సులభమా అతని పరాక్రమం తమరు స్వయంవరంలో చూశారు కదా" అని  అన్నాడు. బలరాముడు మౌనం వహించాడు.

       తరువాత వసుదేవుడు బలరామ కృష్ణుడు అర్జునుడికి అంతులేని కానుకలు తీసుకువచ్చారు.

   సుభద్ర గర్భం ధరించి లోకోత్తర పరాక్రమవంతుడైన అభిమన్యునికి జన్మనిచ్చింది. అభిమన్యుడు ధౌమ్యుని వద్ద వేదవేదాంగాలు అభ్యసించాడు. తండ్రి వద్ద అస్త్ర శస్త్ర విద్యలను అభ్యసించాడు.

  ద్రౌపదికి ధర్మరాజు వల్ల ప్రతివింధ్యుడు,  భీముని వల్ల శ్రుతసోముడు, అర్జునుని వల్ల శ్రుతకర్ముడు, నకులుని వల్ల శతానీకుడు, సహదేవుని వల్ల శ్రుతసేనుడు అను ఉపపాండవులకు జన్మనిచ్చింది. 

            ***

   ఒక నాడు కృష్ణార్జునులు వనవిహారం చేసి ఒకచోట విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో అగ్నిహోత్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి తన ఆకలికి ఆహారంగా ఖాండవ వనాన్ని భక్షించే అవకాశం కలిగించండి. ఈ ఖాండవ వనంలో తక్షకుడు ఉన్నాడు. అతనిని కాపాడడానికి దేవేంద్రుడు ఈ వనాన్ని భక్షించనీయకుండా అడ్డుపడుతున్నాడు"అని చెప్పాడు. 

     అప్పుడు అర్జునుడు అగ్నిదేవునితో " మీకు ఈ ఖాండవ వనాన్ని దహించి చేయాలని హిందూ కోరిక కలిగింది "అని అడిగాడు. దానికి అగ్నిదేవుడు శ్వేతకి అనే రాజర్షి సత్రయాగాన్ని చేయడానికి సంకల్పించాడు. అది వంద సంవత్సరాలు జరిగే యజ్ఞం. దానికి  ఋత్విక్కు ఒప్పుకోలేదు. అప్పుడు శ్వేతకి ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. తాను చేయ సంకల్పించిన యజ్ఞానికి ఋత్విక్కుగా ఈశ్వరుని ఉండమని కోరాడు శ్వేతకి. అందుకు ఈశ్వరుడు యజ్ఞాలు చేయించే పని బ్రాహ్మణులదని, అందుకని నీకు దూర్వాసుని నియమిస్తున్నానని, వంద సంవత్సరాలు ఎడతెగని నేతి ధారతో యజ్ఞము చేసి అగ్నిదేవుని సంతృప్తిపరచిమని చెప్పాడు. ఆ ప్రకారం స్వేత కి సత్రయాగం చేశాడు అప్పుడు తాగిన నేతితో నాకు జీర్ణశక్తి తగ్గి మహా వ్యాధిగా మారింది. అందుకోసం ఖాండవవనాన్ని లభించాలని కోరికగా ఉంది" అన్నాడు అగ్నిదేవుడు.

      అప్పుడు అర్జునుడు అగ్నిదేవునితో "మావద్ద అస్త్రాలు, శస్త్రాలు  ఉన్నాయి. కానీ వాటిని ప్రయోగించడానికి తగిన ధనుస్సు, రథము ప్రస్తుతం మా వద్ద లేవు అందుకని ఆలోచిస్తున్నాం" అన్నారు.

   వెంటనే అగ్నిదేవుడు వరుణ దేవుని ధ్యానించాడు. వరుణదేవుడు ప్రత్యక్షమయ్యి, అర్జునుడికి గాండీవము అనే ధనస్సుని, అక్షయ తూణీరాన్ని,  కపిధ్వజముతో  కూడిన రథాన్ని ఇచ్చాడు. కృష్ణునునికి సుదర్శన చక్రం, కౌమోదకి అనే గదను ఇచ్చాడు.

    కృష్ణార్జునులు అభయమిచ్చారు. ఖాండవ వనానికి ఇరువైపులా కృష్ణార్జునలు నిలబడ్డారు.రెట్టించిన ఉత్సాహంతో అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహిస్తున్నాడు. ఖాండవ వనంలో ఉన్న జంతువులు, పక్షులు, పాములు  అగ్నిజ్వాలలో పడి మరణించిన సాగాయి.

    ఇది చూసి దేవతలంతా దేవుని వద్దకు వెళ్లారు ఖాండవ వన దహనం గురించి చెప్పారు. దేవేంద్రుడు వెంటనే తన మిత్రుడు తక్షకుని కాపాడాలని నిశ్చయించుకుని ఉరుములతో మెరుపులతో కుంభవృష్టి కురవాలని మేఘాలను ఆజ్ఞాపించాడు.

      ఇంద్రుడు కురిపించే కుంభవృష్టి ఖాండవ వనం మీద పడకుండా అర్జునుడు తన బాణాలతో ఒక కప్పు నిర్మించాడు. అగ్ని దేవుని జ్వాలల నుండి రక్షించుకోవడానికి తక్షకుని కుమారుడైన అశ్వసేనుడు  తన తల్లి తోక పట్టుకుని ఆకాశంలో పరిగెడుతున్నాడు. అర్జునుడు అశ్వసేనుని తన బాణాలతో కొట్టాడు.

      మహేంద్రుడు అర్జునుడి మీద మోహిని మాయను ప్రయోగించి, అశ్వసేనుని అతని తల్లిని కాపాడాడు. ఇంతలో ఆకాశవాణి "దేవేంద్రా! వీరు భూమి మీద అవతరించిన నరనారాయణులు. వీరిని జయించడం నీకు సాధ్యం కాదు. పైగా తక్షకుడు ఎప్పుడో తప్పించుకొని పోయాడు" అని పలికేసరికి దేవేంద్రుడు తన సేనలతో తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయాడు.

    ఆ ఖాండవ వనములో నముచి అనే రాక్షసుని తమ్ముడు మయుడు ఆ మంటల్లో చిక్కుకుని బయటకు రాలేక అర్జునుని శరణుజొచ్చాడు. అలా మయుడు, అశ్వసేనుడు, ముందపాలుని కుమారులు నలుగురు ఆ మంటల నుంచి తప్పించుకున్నారు. 

    అగ్నిదేవుడు నిర్విఘ్నంగా ఖాండవ వన దహనం పూర్తి చేసి తన రోగం పోగొట్టుకున్నాడు. తనకు సహాయం చేసిన కృష్ణార్జునులను దీవించాడు. మహేంద్రుడు కూడా తన కుమారుని శౌర్య పరాక్రమాలకు సంతోషించి అర్జునుడికి ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, వాయవ్యాస్త్రం ఇచ్చాడు. కృష్ణార్జునులు ఖాండవ వనంలో పరిచయమైన మయుని వెంటబెట్టుకుని వెళ్లారు. జరిగినదంతా చెప్పి మయుని ధర్మరాజుకు పరిచయం చేశారు.

                                                            ***





 

  

 




  




    

  

 

  

  
  

Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

తెలుగు సంధులు

                    తెలుగు   సంధులు సంధి వివరణ:                  మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది.    'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని  సంధి  అంటారు.                   ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది.  వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను  సంధి  అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును  సంధికార్యము   అని అంటారు.   సంధిలో రెండు పదాలు ఉంటాయి. వీటిల...

సంస్కృత సంధులు

                                           సంస్కృత సంధులు సంధి వివరణ:                    మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి   మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది.    'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని  సంధి  అంటారు.                   ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది.  వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను  సంధి  అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే...