మాండవ్యుడు అనే మహర్షి ఊరి వెలుపల ఒక ఆశ్రమం కట్టుకొని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు కొందరు దొంగలు రాజు గారి ధనాన్ని దోచుకొని, సైనికులు వెంటపడుతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి మాండవ్యుని ఆశ్రమంలో దాక్కున్నారు. అటుగా వచ్చిన సైనికులు మాండవ్యునితో 'ఎవరైనా దొంగలు ఇటు వచ్చారా?' అని అడిగారు. మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు జవాబు ఇవ్వలేదు. సైనికులు ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ ఉన్న దొంగలను పట్టుకున్నారు మాండవ్య మహామునికి కూడా దొంగలతో సంబంధం ఉందని అనుమానించి దొంగల తోపాటు మాండవ్యుని కూడా బంధించి రాజు గారి సమక్షంలో ప్రవేశపెట్టారు. రాజుగారు ఆ దొంగలకు మరణ శిక్ష విధించారు. దొంగలకు సహాయం చేసినట్లు అనుమానిస్తున్న మాండవ్యునికి ఇనుప శూలం మీద కూర్చోబెట్టాలని శిక్ష విధించారు. కానీ మాండవ్యుడు ఆ శిక్షకు భయపడక తపస్సు చేసుకుంటున్నాడు ఒక రోజు రాత్రి కొంతమంది మహర్షులు పక్షుల రూపంలో వచ్చి మాండవ్యుని చూచి 'మహానుభావుడైన నీకు ఈ శిక్ష వేసిన వారు ఎవరు' అని అడిగారు. అందుకు మాండవ్యుడు నవ్వి తన పూర్వ జన్మ పాపఫలాన్ని అనుభవిస్తున్నానని, దీనికి ఎవరినీ నిందించాల్సిన పనిలేదని అన్నాడు. ఈ విషయం అక్కడ కాపలా ఉన్న సైనికులు ఈ విషయం రాజుకు చెప్పారు. రాజు వెంటనే అక్కడకు వచ్చి మహర్షిని కిందికి ఆజ్ఞాపించారు. కానీ శూలం మహర్షి శరీరం నుంచి బయటికి రాలేదు. శూలం బయట భాగాన్ని నరికించారు. శూలంలో కొంత భాగం మాండవ్యుని శరీరంలోనే ఉండి పోయింది.
తరువాత మాండవ్యుడు యమ లోకానికి వెళ్ళాడు. తనకు, రాజు శూలంపై కూర్చుని పెట్టేంత శిక్ష వేయడానికి అంత తప్పు ఏమి చేశానని యమధర్మరాజుని అడిగాడు. అప్పుడు ధర్మరాజు ''చిన్నతనంలో నువ్వు తూనీగలు పట్టుకొని చిన్న చిన్న మేకులకు గుచ్చి ఆనందించావు. ఆ ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నావు'' అని అంటాడు. అందుకు మాండవ్యుడు, "పిల్లలు 14 ఏళ్ళు వచ్చేవరకు బాలురని పిలవబడతారు. ఆ వయసులో ఏదీ తెలిసి చేయరు. కాబట్టి ఈ రోజు మొదలు 14 ఏళ్లలోపు పిల్లలు ఏం చేసినా అది తప్పుకాదు. పెద్దగా పాపం కాదు. కానీ పద్నాలుగేళ్ల పిల్లలకు ఎవరైనా అపకారం చేస్తే అది పెద్ద తప్పు అవుతుంది" అని నిర్ణయం చేశాడు.( అది ఇప్పటికీ మన కోర్టుల్లో అమలవుతుంది.)
" కానీ నేను బాల్యంలో చేసిన చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించారు. కాబట్టి నువ్వు శూద్ర స్త్రీకి జన్మిస్తావు" అని శాపం పెట్టాడు. ఆ శాపం మూలంగా యమధర్మరాజు వ్యాసుని ద్వారా శూద్ర స్త్రీ అయిన దాసికి విదురునిగా జన్మించాడు.
Comments
Post a Comment