వరుణుడి కుమారుడైన వశిష్ఠుడు మేరు పర్వత గుహలో తపస్సు చేస్తున్నాడు. వశిష్టుని ఆశ్రమంలో నందిని అనే కామధేనువు ఉంది అది వశిష్టునికి కావలసిన అన్నింటిని అందిస్తూ సేవ చేస్తూ ఉంది.
వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చిన అష్ట వసువులు ఆ కామధేనువు మహిమ చూసి ఆశ్చర్యపోయారు. ఎనిమిదవ వసువు ప్రభాసుని భార్య ఆ కామధేనువును తన ప్రాణ స్నేహితురాలికి కానుకగా ఇవ్వాలని కోరికగా ఉందని అడిగేసరికి ప్రభాసుడు కామధేనువుని వశిష్టునికి తెలియకుండా తీసుకువెళతాడు.
వశిష్టుడు తన యోగ దృష్టితో చూసి ఈ పని వసువులదని గ్రహించి వారందరిని మానవులై పుట్టమని శపించాడు. అందరూ వశిష్ఠుని కాళ్ళ మీద పడి భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా అనుగ్రహించమని వేడుకున్నారు. అందుకు వశిష్టుడు అంగీకరించి అలాగే జరుగుతుంది. కానీ అసలు నేరం చేసిన వాడు ఈ ప్రభాసుడు. కాబట్టి వాడు మాత్రం చిరకాలం మానవ లోకంలో సంతాన హీనుడిగా బతుకుతాడని చెబుతాడు. ఈ ప్రభాసుడే భీష్ముడు.