చేది దేశానికి రాజు వసువు. అతను నివసిస్తున్న నగరానికి పక్కనే శుక్తిమతి అనే నది ప్రవహిస్తూ వున్నది. ఆ నది పక్కనే కోలాహలము అనే పర్వతమూ ఉంది. ఈ కోలాహలం పర్వతం శుక్తిమతి మీద మోజు పడి ఒక రోజు తన ప్రవాహానికి అడ్డుపడుతాడు. అప్పుడే అటుగా వస్తున్న వసువు ఇది చూచి తన బలంతో ఆ పర్వతాన్ని పైకి లేపాడు. అప్పటి దాకా శుక్తిమతి నదికి, కోలాహల పర్వతానికి సంపర్కం జరగడం వల్ల వారికి గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మించారు. ఆ ఇద్దరి బిడ్డలని శుక్తిమతి వసువుకు కానుకగా ఇచ్చింది. వసువు సంతోషించి గిరికను వివాహమాడి, వసుపడుడిని తన రాజ్యానికి సేనాపతిగా నియమించాడు.
ఒకరోజు వసువు వేటకు వెళ్ళినప్పుడు తన భార్య గిరిక గుర్తుకు వచ్చి అతనికి వీర్య స్కలనమయ్యింది. వెంటనే ఆ వీర్యాన్ని ఒక ఆకు దొప్పలో సేకరించి ఒక డేగ మెడకు కట్టి తన భార్య గిరికు ఇమన్నాడు. ఆ డేగ ఆ దొప్పను తీసుకుని ఆకాశంలో ఎగురుతూ ఉన్నప్పుడు, మరొక డేగ చూసి, అది ఏదో తినే ఆహారం అనుకొని దాన్ని తీసుకోవడానికి ఆ డేగతో పోట్లాటకు దిగుతుంది .ఆ సమయంలో ఆ వీర్యం ఉన్న ఆకు దొప్ప యమునా నదిలో పడిపోతుంది.. అదే సమయంలో బ్రహ్మ దేవుడి శాపం వల్ల ఆ నదిలో చేప రూపంలో ఉన్న అద్రిక అనే అప్సరస నోట్లో ఆ వీర్యం పడటంతో గర్భం దాలుస్తుంది.
ఒకరోజు అద్రిక జాలర్ల వలకు చిక్కుతుంది . జాలరులు ఆ చేపను కోసినప్పుడు ఆ చేప కడుపులో ఒక ఆడ బిడ్డ, మగ బిడ్డ ఉంటారు. శాపం తీరి అద్రిక అప్సరసగా మారి దేవలోకం వెళ్ళిపోతుంది.
అప్పుడు జాలర్లు ఆడబిడ్డ, మగబిడ్డను తమ రాజు అయిన దాశరాజుకు ఇస్తారు. ఆ మగ బిడ్డ మత్స్య దేశానికి రాజవుతాడు. ఆడపిల్ల మత్స్యగంధి అనే పేరుతో దాశరాజు ఇంట పెరుగుతూ ఉంటుంది. దాశరాజు లేనప్పుడు యమునా నదిలో పడవ నడుపుతూ ఉంటుంది.
ఒకరోజు వశిష్ట మహాముని మనవడు అయిన పరాశరుడు యమునా నదిని దాటడానికి వచ్చాడు. పడవలో ఉన్న మత్స్యగంధిని చూశాడు. ఆమెను మోహించాడు తనతో సంపర్కం జరపవలసినదిగా ఆమెను కోరుతాడు . అందుకు ఆమె "మహాత్మా.. నేను కన్యను, జాలరి పుత్రికను. పైగా ఒళ్ళంతా చేపల వాసన. నా కన్యత్వం పోగొట్టుకొని నా తండ్రి ముఖం ఎలా చూడగలను?" అని అడుగుతుంది.
అప్పుడు పరాశరుడు "బాలా.. నీవు జాలరి పుత్రిక కావు . వసురాజు వీర్యమును జన్మించిన దానవు. నీ కన్యాత్వం చెడకుండా నీతో సంగమిస్తాను" అని తన మహిమతో ఆమె ఒళ్ళంతా ఒక యోజన దూరము సుగంధాలను వెదజల్లేటట్టు చేస్తాడు. అప్పటినుండి మత్స్యగంధి యోజనగంధి అయ్యింది.
అప్పటికీ ఆమె పరాశరుని నుంచి తప్పించుకోవడానికి "మహాత్మా! ఇది పట్టపగలు.. అందరూ చూస్తారు" అని మరో సాకు చెప్పింది. కానీ పరాశరుడు తన శక్తితో ఆకాశంలో మేఘాలు సృష్టించి లోకమంతా చీకటి చేశాడు. ఇక ఆమె చేసేదేమీ లేక పరాశరునితో సంపర్కానికి ఒప్పుకుంది. దీని ఫలితంగా మత్స్యగంధికి ఒక పుత్రుడు జన్మించాడు. ఆ బిడ్డ పుట్టిన వెంటనే తల్లికి నమస్కరించి తల్లితో ''అమ్మా..నీకు అవసరం వచ్చినప్పుడు నన్ను తలుచుకుంటే నేను వస్తాను" అని చెప్పి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అతడే వ్యాసుడు. వేదాలను, మహాభారతాన్ని రాసిన వ్యాసుడు.
మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి
Comments
Post a Comment