సూర్యుని కూతురు, సావిత్రికి చెల్లెలు అయిన తపతి అనే కన్య మహా సౌందర్యవతి. గుణవతి అజామీఢుని కొడుకు పేరు సంవరణుడు. అతను సూర్యుని గూర్చి తపస్సు చేస్తున్నాడు. సూర్యుడు సంవరణుడే తన కూతురుకి తగిన భర్తనుకొన్నాడు. ఒకరోజు సంవరణుడు అడవికి వేటకు వెళ్లి అలసిపోయి తిరుగుతూ, తపతిని చూశాడు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఆమెను మోహించాడు. ఆమెను "బాలా.. ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు" అని అడిగాడు. కానీ ఆమె బదులు చెప్పకుండా వెళ్ళిపోయింది. సంవరణుడు మోహంతో పిచ్చోడిలా గా ఆమె కోసం వెతుకుతున్నాడు.
తపతి కూడా సంవరణుని మోహించింది. ఒకరోజు తపతి సంవరుణుడికి కనిపించింది. సంవరణుడు తపతిని గాంధర్వ వివాహం చేసుకుంటానన్నాడు. అందుకు ఆమె" నేను సూర్యుని కుమార్తెను, సావిత్రికి చెల్లిని, నాకు స్వాతంత్ర్యం లేదు. నీకు నాపై ప్రేమ ఉంటే నా తండ్రిని అడుగు. మన పెళ్లి జరుగుతుందని చెప్పి వెళ్లి పోయింది. అప్పటినుండి సంవరణుడు అక్కడే ఉండి పట్టుదలతో సూర్యుని ఆరాధిస్తున్నాడు.
ఒకరోజు వశిష్టుడు సంవరణుని దగ్గరకు వచ్చాడు. అతని బాధను తెలుసుకున్నాడు. వెంటనే సూర్యుని వద్దకు వెళ్ళి "పురు వంశజుడు, ధర్మపరుడు, సద్గుణ సంపన్నుడు అయిన సంవరణుడు నీకు కుమార్తె తపతిని చూసి మోహించాడు. నువ్వు నీ కుమార్తెను అతనికిచ్చి వివాహం చేయాలి" అని చెప్పాడు. సూర్యుడు కూడా తన కోరిక తీరబోతున్నందుకు సంతోషించాడు. తపతిని వశిష్టునితో సంవరణం దగ్గరకు పంపించాడు. వశిష్ఠుడు తపతికి, సంవరణునికి వివాహం జరిపించాడు వారికి కురు వంశీయుల పుట్టారు అని వివరించాడు అంగారపర్ణుడు.
Comments
Post a Comment