పూర్వం మంద పాలుడు అనే మహాముని బ్రహ్మచర్యం పాటించి ఎంతో నిష్ఠగా తపస్సు చేశాడు. కానీ సంతానం లేనందువల్ల పుణ్యలోకాలు పొందలేకపోయాడు. త్వరగా సంతానం పొందడానికి పక్షిగా పుట్టాడు. జరిత అనే ఆడపక్షితో కలిసి నలుగురు కొడుకులను కన్నాడు. వారంతా ఖాండవ వనంలోనే ఉన్నారు. అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించే ముందు తన కుమారులను రక్షించమని ప్రార్థించాడు. మందపాలుడు. అగ్నిదేవుడు సరేనన్నాడు. ఇంతలో మంటలు దగ్గరికి వస్తున్నాయి. మంద పాలుడు కొడుకులను భూమిలో ఉన్న కలుగు లోకి వెళ్ళమన్నాడు. అప్పుడు మందపాలుని కొడుకులు "తండ్రీ! కలుగులో దాక్కుంటే ఎలుకలు తినేస్తాయి. ఇక్కడ ఉంటే పవిత్రుడైన అగ్నికి ఆహుతి అవుతాం. ఇదే మంచిది కదా? అని అన్నాయి. మంద పాలుడు, జరిత ఏమీ చేయలేక విలపిస్తూ పైకి ఎగిరి పోయారు.
మందపాలుని నలుగురు కుమారులు వేద పఠనం చేస్తూ మాకు అభయం ఇమ్మని ప్రార్థించారు. అగ్నిదేవుడు ఇది విన్నాడు. మీరు మందపాలుని కుమారులని గుర్తుపట్టాడు. మందపాలునికి ఇచ్చిన మాట ప్రకారం ఆ చెట్టును వదిలి పక్క నుండి వెళ్ళిపోయాడు.
అలా మందపాలుని కుమారులు బతికారు. మందపాలుడు కూడా తన కుమారులు బతికే ఉన్నారని తెలుసుకుని సంతోషంగా పుణ్యలోకాలకు వెళ్ళాడు.
Comments
Post a Comment