భృగుమహర్షి భార్య పులోమ గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు భృగువు అగ్నిహోత్రునితో తన భార్యను చూస్తూ ఉండమని చెప్పి స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడికి పులోముడు అనే రాక్షసుడు వచ్చాడు. పులోమను చూసి మోహించాడు.
ఈమె ఎవరిని అగ్నిహోత్రుని అడిగాడు. అగ్ని సంకటంలో పడ్డాడు. ఎందుకంటే ఈ పులోమను మొదట ఈ రాక్షసుడు వివాహం చేసుకోవాలనున్నాడు. కానీ పులోమ తండ్రి అందుకు అంగీకరించక, భృగువుతో వివాహం జరిపించాడు. అయినా నిజం చెప్పడానికే నిర్ణయించుకున్నాడు.
"ఈమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్పాడు అగ్నిదేవుడు. పులోముడు ఆమెను గుర్తుపట్టాడు వెంటనే వరాహ రూపం ధరించి ఆమెను భుజం మీద వేసుకొని పారిపోయాడు. అలా వెళుతున్నప్పుడు ఆమెకు ప్రసవం అయ్యింది. బిడ్డ కింద పడ్డాడు. అలా తల్లి గర్భమునుండి జారిపడి వాడు కాబట్టి అతనికి చ్యవనుడు అని పేరు వచ్చింది. తల్లి గర్భమునుండి జారిపడిన చ్యవనుడు కళ్ళు తెరవగానే ఆ తీక్షణమైన చూపులకు తట్టుకోలేక పులోముడు భస్మమయ్యాడు. పులోమ బిడ్డనెత్తుకుని భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చింది.
ఈలోగా భృగువు స్నానం ముగించుకుని ఆశ్రమానికి వచ్చాడు. రాగానే అప్పుడే ఉదయించినట్లున్న తన కుమారుని చూశాడు. జరిగిన విషయం తెలుసుకున్నాడు. అసలు ఆమె పులోమని ఎలా తెలిసింది? ఎవరు చెప్పారని అడిగాడు. అగ్ని దేవుడు చెప్పాడని పులోమ చెప్పింది.
భృగువుకు కోపం వచ్చింది. తన భార్యకు అపకారం చేస్తాడని తెలిసి కూడా ఆ రాక్షసుడికి తన భార్య గురించి చెప్పిన అగ్నిదేవుని సర్వభక్షకుడు అవుతావని శపించాడు.
అగ్నిదేవుడు అలిగి తన జ్వాలలను ఉపసంహరించుకున్నాడు. త్రేతాగ్నులు అయిన ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం జ్వలించడం మానుకున్నాయి. దేవక్రతువులు, యజ్ఞయాగాలు నిలిచిపోయాయి. అగ్నిహోత్రం లేకపోవడంతో ఉదయం సాయంత్రం చేసే కార్యాలు ఆగిపోయాయి. చివరికి బ్రహ్మదేవుడు కల్పించుకోవడంతో అగ్ని తన విధులను యధావిధిగా నిర్వర్తించాడు.
భృగు కుమారుడైన చ్యవనుడు సుకన్య ను వివాహం చేసుకున్నాడు. వారికి. ప్రమతి పుట్టాడు. ప్రమతి క్షీరసాగర మథన సమయంలో జన్మించిన ఘృతాచి అనే అప్సరసను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి రురుడు జన్మించాడు.
రురుడు విశ్వావసుడు అనే గంధర్వ రోజుకు, మేనక అనే అప్సరసకు జన్మించిన ప్రమద్వరను ప్రేమించాడు.
ఒకరోజు ప్రమద్వరను ఒక పాము కాటు వేసింది. ప్రమద్వర మరణించింది. ఈ వార్త విన్న రురుడు గుండెలవిసేలా విలపిస్తున్నాడు. అతని మొర విని ఒక దేవదూత ఆకాశం నుండి "కాలవశమున ఆమెను పాము కాటు వేసింది. దానిని ఆపడం ఎవరి తరము కాదు. కానీ బతకడానికి మాత్రం ఒక ఉపాయం ఉంది. ఎవరైనా తమ ఆయువులో సగం ఇస్తే ఆమె విషం నుండి విముక్తి పొందుతుంది" అని చెప్పాడు.
రురుడు సంతోషంగా తన ఆయువులో సగ భాగం ప్రమద్వర ఇచ్చాడు. ప్రమద్వర విషం నుండి విముక్తి పొందింది. రురుడు ప్రమద్వరను వివాహం చేసుకున్నాడు. కానీ తన ప్రేయసి అపకారం చేసిన పాముల మీద కోపం పోలేదు. ఒక కర్ర తీసుకొని కనిపించిన ప్రతి పామునీ చంపుతున్నాడు. ఇలా చంపుతూ శాపవశమున పాము రూపంలో ఉన్న సహస్రపాదుడు అనే మునీశ్వరుడి వల్ల తన తప్పు తెలుసుకుని పాములను చంపడం మానుకున్నాడు.
Comments
Post a Comment