Skip to main content

      "తాతా, ఓ హాస్య పత్రికలో  మూర్ఖశిఖామణులు అంశం మీద ఓ హాస్య కథ రాయాలి. నీకు అలాంటి అనుభవం ఏదైనా ఉంటే చెప్పు" ఎనభై ఏళ్ల తాత మార్తాండరావుని, అడిగాడు అతని మనవడు మూర్తి.

     "అంటే నేను మూర్ఖుడునని నీ అనుమానమా?" అడిగాడు తాత.

     "అయ్యో, అది కాదు తాతా ! నేనన్నది అలాంటి వారి అనుభవాలు నీకేమైనా తెలుసా అనీ?"

    "అలా అన్నావు బావుంది. నేను చిన్నతనంలో విన్న ఓ రాజు కథ చెబుతాను. మధ్యలో మూర్ఖంగా అడ్డు రాక, చిన్న పిల్లాడిలా శ్రద్ధగా విను" అని చెప్పడం మొదలెట్టాడు మార్తాండరావు.

                               ***

      అవి మార్కాపురం రాజ్యాన్ని మార్కండేయ వర్మ పరిపాలిస్తున్న రోజులు. అతని మూర్ఖపు పనుల వలన ఆ రాజ్యంలో ప్రజలెవరూ సుఖంగా లేరు. ఎందుకంటే..

   గురుకులంలో చదువుకుంటున్న పండితుల పిల్లలను సైన్యంలో చేరమనీ, 

    అలాగే సైన్యంలో పనిచేస్తున్న వారిని గురుకులాలకి వెళ్లి చదువుకొమ్మనీ, 

    ఏ రైతుదైనా పంట పండక పాడైపోతే ఓదార్చడం పోయి ఆ రైతు నిర్లక్ష్యం వల్లనే పంట పోయిందని అతనికి రెండింతలు పన్ను విధించడం, 

    అలాగే ఎవరైనా ఈ మూర్ఖపు పాలనలో ఉండలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుని వారి కుటుంబ సభ్యులకు యావజ్జీవ కారాగారం విధించడం లాంటి మూర్ఖపు పనులతో విసుగెత్తిపోయిన జనం  ఆయనను మార్కండేయ వర్మ అని కాకుండా మూర్ఖాండ వర్మ అని చాటుగా పిలుచుకొనేవారు.

                             ***

    ఈ మార్కండేయ వర్మ మూర్ఖపు పనులు గురించి తెలిసిన ఓ విదేశీ యాత్రీకునికి ఆ రాజ్యం సందర్శించాలన్న కోరిక పుట్టి, ఓ రోజు మార్కాపురం సంస్థానానికి వచ్చాడు.

     ఓ నాలుగు రోజులు ఆ రాజ్యమంతా పర్యటించిన ఆ విదేశీయునికి,  అక్కడి జనం ఈ రాజు పిచ్చి చేష్టలు వలన చావలేక బతుకుతున్నారని అర్ధమయ్యింది.

     ఓ రోజు, విదేశీ యాత్రికుని కోరిక మేరకు, ముగ్గురు సిబ్బందితో కూడిన పడవమీద జల విహారానికి ఏర్పాటు చేసాడు మార్కండేయ వర్మ.   మాటల మధ్యలో.. 

   "మహారాజా ! మీ రాజ్యంలో ప్రజలు నిజంగా మనస్పూర్తిగానే మీ ఆజ్ఞలు పాటిస్తున్నారా?" అమాయకంగా అడిగాడు యాత్రికుడు.

       "ఏం, ఆ విషయంలో మీకు సందేహమా ? అయితే ఇప్పుడే చూడండి. ఎవరక్కడ ?" అంటూ గట్టిగా అరిచాడు రాజు.

    "చిత్తం ప్రభూ, తమరి ఆజ్ఞ" అంటూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు సేవకుడు.

    "వెంటనే నదిలోకి దూకేయ్. ఇది నా ఆజ్ఞ" అన్నాడు రాజు. వెంటనే నదిలోకి దూకేసాడు సేవకుడు. 

   ఆశ్చర్యపోతూ వెర్రి చూపులు చూస్తున్న  ఆ యాత్రికుని వైపు చూసి,

     "మిత్రులకు ఇంకా సందేహము పోయినట్టు లేదు. ఎవరక్కడ?" అంటూ మళ్ళీ చప్పట్లు చరిచాడు రాజు.

      "చిత్తం ప్రభూ, తమరి ఆజ్ఞ శెలవీయండి" అంటూ వచ్చాడు పడవ నడిపే సహాయకుడు.

    "మారు మాట్లాడకుండా నది లోకి దూకేయ్. ఇది నా ఆజ్ఞ" అన్నాడు రాజు.

      వెంటనే నదిలోకి దూకేసాడు సహాయకుడు.

     ఈ సంఘటనలు చూసి, ఆశ్చర్యపోతూ...

 "అద్భుతం మహారాజా ! నేను ఇది నిజంగా నమ్మలేకపొతున్నాను" అన్నాడు యాత్రికుడు సంభ్రమంగా చూస్తూ.

  "ఔనా ? ఇంకా నమ్మలేకపొతున్నారా ? అయితే చూడండి, ఎవరక్కడ ?" గట్టిగా అరిచాడు రాజు.

   "చిత్తం ప్రభూ, తమరి ఆజ్ఞ " అంటూ చేతులు కట్టుకు నిలబడ్డాడు పడవ నడిపే వ్యక్తి.

 "ఈ యాత్రికుడు ఇంకా  నా మాటలు నమ్మలేకపొతున్నాడుట. నువ్వు కూడా  నది లోకి దూకేయ్. ఇది నా ఆజ్ఞ" చెప్పాడు మూర్ఖ రాజు.

   "తమరి ఆజ్ఞ ప్రభూ" అంటూ ఆనందంగా  నదిలోకి దూకబోతున్న అతడిని పట్టుకుని ఆపిన యాత్రికుడు,

  "ఓరి మీ ప్రభుభక్తి తగలెయ్యా! నువ్వు కూడా దూకేస్తే ఈ పడవ ఎవరు నడుపుతార్రా? నా కోసం అయినా కొంచెం ప్రభుభక్తి తగ్గించుకోరా ?" అని ధీనంగా వేడుకున్నాడు.

  "ప్రభుభక్తా ? పాడా ? ఈ మూర్ఖుని రాజ్యంలో చావలేక బతుకుతున్నాం. అలాగని చద్దామా అనుకుంటే, చావనివ్వడు. మహానుభావుడు ఏ కళనున్నాడో కానీ, చావడానికి అనుమతి ఇచ్చాడు. నన్ను చావనీయండి. మీ చావు మీరు చావండి" అని నదిలోకి దూకేసాడు.

   ఆ తరువాత అష్టకష్టాలు పడి ఒడ్డుకు చేరుకున్నారు రాజు, యాత్రికుడు. అప్పుడు పూర్తిగా అర్ధమయ్యింది ఆ విదేశీ యాత్రీకునికి మార్కండేయ రాజు యొక్క మూర్ఖపు చేష్టలు ఏ స్థాయిలో ఉన్నాయన్నది. అవే గ్రంధస్తం చేయాలని నిశ్చయించుకుని తిరుగు ప్రయాణమయ్యేడు ఆ విదేశీయుడు. 

                                ***   

       ఇక రాజు గారి ఆస్థానంలో పండితుల పరిస్థితి మరీ ధారుణంగా ఉండేది. ప్రతీ రోజూ ఏదో ఒక పిచ్చి ప్రశ్న వేయడం, దానికి సమాధానం అడగడం లాంటివి. ఒకరోజు  

   "సూర్య చంద్రులు పైన ఎందుకుంటారు ? కింద ఎందుకుండరు ?" అడిగాడు మూర్ఖరాజు ఓ పండితుడిని.

    "వారు కింద ఉంటే మనం మాడి మసి అయిపోతాం మహారాజా " చెప్పాడు ఆ పండితుడు.

  ఆ సమాధానం నచ్చకపోవడంతో అతడిని రాజ్యబహిష్కారం చేసాడు రాజు. అదే ప్రశ్న ఇంకో పండితుడిని అడిగాడు రాజు.

   "ప్రభూ సూర్య చంద్రులు మన కింద ఉండాలంటే మనం పైకి పోవాలి, అంటే స్వర్గానికి పోవాలి" యుక్తిగా సమాధానం ఇచ్చాడు ఆ పండితుడు.

     ఆ సమాధానం కూడా రుచించకపోవడంతో అతనికి కూడా రాజ్యబహిష్కరణ శిక్ష వేసాడు రాజు.

                               ***

     ఇలా రోజుకొక అర్ధంపర్ధం లేని ప్రశ్న వేయడం, ఆ సమాధానాలు రుచించక రాజ్యబహిష్కరణ శిక్షలు విధించడం వలన, ఆస్థానంలో పండితుల సంఖ్య తగ్గిపోవడంతో  కలతచెందిన మహాపండితుడు మరియు  కులగురువు అయిన కుశాగ్రశర్మ, మహామంత్రి మణిమంతుడిని కలుసుకుని, పరిస్థితి వివరించాడు. 

        రాజుకి తమ మాట మీద నమ్మకం ఉండడం వలన వారిరువురు, మూర్ఖపు రాజుని మార్చడం కోసం  ఓ పథకం ఆలోచించి  సమయం కోసం ఎదురు చూడసాగారు. 

                              ***

        ఆ రోజు, నిండు‌‌ సభలో రాజుగారు యధాప్రకారం తన మూర్ఖపు ప్రశ్నలతో  పండితులను ప్రశ్నించడానికి సమాయత్తం అయ్యారు. ఈ లోగా మహామంత్రి లేచి,

    "ప్రభూ ఇప్పటికే కొన్ని వందల ప్రశ్నలు అడిగి  మీరు చరిత్రలో నిలిచిపోయారు. ఈ సారి కొంచెం వైవిధ్యంగా ప్రశ్న సంధించండి. అయితే ఒక షరతు ఎవరైనా సరైన సమాధానం చెబితే మటుకు  మీరు ఇక భవిష్యత్తులో ప్రశ్నలు వేయకూడదు" అని ఓ నియమం పెట్టాడు.

  "తప్పకుండా మహామంత్రీ, మీ మాట మాకు శిరోధార్యం. కానీ జవాబు చెప్పని వారికి మటుకు యధాప్రకారం రాజ్యబహిష్కారం తప్పనిసరి" అని చెప్పి,  ఆ రోజుకు కొలువు చాలించాడు.

                         ***


      మర్నాడు ఉదయం, సభ కొలువు తీరగానే..

  "పండితులారా ! మన మహామంత్రి గారు నన్ను ప్రశ్నలు వైవిధ్యంగా అడగమన్నారు కాబట్టి, నేను నోటితో ప్రశ్నలు అడగను. కానీ నేను నా చేతి వేళ్లతో కొన్ని సౌంజ్ఞలు ద్వారా ప్రశ్నలు వేస్తాను. మీరు కూడా సౌంజ్ఞలు ద్వారానే సమాధానాలు చెప్పాలి. నేను ఆశించిన సమాధానం వస్తే ఈ రోజునుంచీ  ఈ ప్రశ్నలు కార్యక్రమానికి స్వస్తి చెబుతాను. చెప్పకపోతే శిక్ష ఏమిటో మీకు తెలుసుకదా ?" అంటూ కార్యక్రమానికి స్వీకారం చుట్టాడు రాజు.

   మొదటగా, తన కుడి చేతిని తల చుట్టూ తిప్పి ఒక వేలు చూపించాడు రాజు.

  వెంటనే ఓ పండితుడు లేచి తన రెండు చేతులూ ఎత్తి నమస్కరించాడు.

    తల అడ్డంగా ఊపాడు రాజు.

  మరో పండితుడు లేచి,  వద్దు వద్దు అన్నట్టు రెండు చేతులూ ఆడించాడు.

    తల అడ్డంగా ఊపాడు రాజు.

  ఇంకో పండితుడు లేచి, ఏమిటీ ఖర్మ అన్నట్టు నుదుటి మీద కొట్టుకున్నాడు.

   తల అడ్డంగా ఊపాడు రాజు.

...ఇలా మూడు రోజులలో  సుమారు ఓ ముప్పై మంది పండితులు, సమాధానం చెప్పలేక రాజ్యబహిష్కరణకి గురయ్యారు.

                        ***


     నాలుగో రోజు ఉదయం, 

"తాము ఒకటి తలిస్తే.... జరిగింది ఏమిటి ? అసలు రాజు తన సౌంజ్ఞ ద్వారా ఏమి చెప్పదలచుకున్నాడు ? మహా పండితుడైన తనకే అర్థం కావడంలేదు. పాపం మిగతా పండితులకు ఏమి తెలుస్తుంది?" అనుకుంటూ  తన ఇంటి వద్ద దిగాలుగా కూర్చొని ఆలోచిస్తున్నాడు కుశాగ్రశర్మ. అదే సమయానికి అక్కడికి వచ్చిన, ఓ గొర్రెల కాపరి,

   "అయ్యోరూ , ఏటీ అలా దిగులుగా ఉండారు ?" అని అడిగాడు.

  మూడు రోజుల నుంచి సభలో జరిగిన వ్యవహారం అంతా చెప్పాడు కులగురువు.

 "అయ్యోరూ, మీరేమీ ఆలోచించబాకండి. మూగ గొర్రెల భాషే తెలిసినోడిని. ఆరి గోస నాకు తెలియదా ? రేపు పొద్దేల నన్ను సభకు తీసుకెళ్లండి. ఆరికి  సమాధానం నేను సెబుతా"

  "ఏమిటీ నువ్వా , తేడా వస్తే శిక్ష  ఏమిటో నీకు తెలుసు కదా ?"

 "పండితులోరూ, మీరు ఏమీ భయపడబాకండి. ఆ ఇసయం గురించి మరసిపోండి. రేపటేల నన్ను సభకు తీసుకుని ఎళ్తన్నారు అంతే..." అంటూ గొర్రెలు తోలుకుంటూ ముందుకు పోయాడు.

 మొదట ఆశ్చర్యపోయిన కుశాగ్రశర్మ, ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో ? ఆ  సరస్వతి మాత ఈ కాపరి రూపంలో వచ్చి తమను కాపాడుతుందేమో అని సమాధానపడ్డాడు.

                    ***

    మర్నాడు సభ ప్రారంభమైంది. ప్రశ్నల పరంపరలో భాగంగా..

   రాజుగారు తన కుడి చేతిని తల చుట్టూ తిప్పి ఒక వేలు చూపించాడు.

  దానికి సమాధానంగా ఆ గొర్రెల కాపరి రెండు వేళ్లు చూపించాడు.

   వెంటనే రాజు మూడు వేళ్ళు చూపించాడు.

  దానికి సమాధానంగా గొర్రెల కాపరి తన తల మీద వెంట్రుకలు చూపించాడు.

 వెంటనే రాజు ఆనందం పట్టలేక కిందకు దిగి,  ఆ గొర్రెల కాపరిని ఉచిత రీతిన సత్కరించి, రాజ లాంఛనాలతో ఇంటికి సాగనంపాడు.

                            ***

కాసేపటికి తేరుకున్న మహామంత్రి,

   "రాజా ! మీరు ఏమి అడిగారో, ఆ కాపరి ఏమి చెప్పాడో సభాసదులకు వివరించ ప్రార్ధన" అంటూ అడిగాడు వినమ్రంగా.

దానికి రాజు..

   "నేను ఈ సకల ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఆదిశక్తి ఒక్కతే అని నా కుడి చేతిని తల చుట్టూ తిప్పి ఒక వేలు చూపించాను. దానికి అతను , ఒక్కతే కాదు, ఆమెతో పాటు సృష్టికర్త బ్రహ్మ కూడా అని రెండు వేళ్ళు చూపించాడు.

    దానికి నేను,  ఆ లెక్కన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కలిపి నడిపిస్తున్నారు అన్నట్టు మూడు వేళ్ళు చూపించాను. దానికి అతను , అలా అయితే  ఈ  ప్రపంచాన్ని నడిపిస్తున్నది ముక్కోటి దేవతలు , అంటూ తన తల మీద వెంట్రుకలు చూపించాడు.

   ఒక గొర్రెల కాపరికి ఇంత విజ్ఞానం ఉందంటే నేను నిజంగా నమ్మలేకపొతున్నా !" అంటూ ఆనందంగా చెప్పాడు రాజు. 

    దీన్ని అవకాశంగా తీసుకున్న మహామంత్రి,

  "రాజా! చూసారా , ఒక పామరుడికే ఇంత విజ్ఞానం ఉందంటే మరి పండితులకి ఎంత ఉండాలి. ఇన్నాళ్లూ మీరు అడిగిన ప్రశ్నలకు వాళ్ల దగ్గర సమాధానం లేక కాదు. అంతే కాదు, మనం బహిష్కరించిన పండితులు ఇప్పుడు మన పొరుగు రాజ్యాలలో మంచి పేరు సంపాదించుకున్నారు కూడా!" చెప్పాడు మహామంత్రి.

  "మరి, వారు ఎందుకు అలా సమాధానాలు చెప్పకుండా బహిష్కరణకు గురయ్యారు?" అమాయకంగా అడిగాడు రాజు.

  "మన రాజ్యంలో ఉండడం ఇష్టంలేక" అంటూ ఓ చిన్న అబధ్ధం చెప్పి, రాజ్యంలో ఉన్న వాస్తవ పరిస్థితులు గురించి చెవిలో రహస్యంగా చెప్పాడు మహామంత్రి.

  "ఔనా ! సరే, నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు నుంచి ఇలాంటి మూర్ఖపు ప్రశ్నలు, మతిమాలిన పనులు చేయకూడదని నిశ్చయించుకున్నా. అంతే కాదు, బహిష్కరణకు గురైన పండితులు అందరినీ వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేస్తా." అంటూ చెప్పాడు ఆనందంగా.

   జై మూర్ఖాం...క్షమించాలి జై మార్కండేయ మహరాజ్ కీ జై  అన్న నినాదాలతో ఆ సభా ప్రాంగణం మార్మోగింది.    

                               ***

   "అదిరా మనవడా కథ . ఎలా ఉంది. హాయిగా రాసి పోస్ట్ చేసేయ్ " చెప్పాడు మార్తాండరావు తాత.

   "బాగానే వుంది తాతా ! నేను నువ్వు అనుకున్నంత మూర్ఖుడును కానులే కానీ,    అసలు ఆ గొర్రెల కాపరి  వెర్షన్ ఏమిటి ? అది చెప్పనేలేదు నువ్వు." అన్నాడు మనవడు.

  "ఔనురోయ్, అది మరచి పోయా ! సరే నడు మళ్లీ కథలోకి" అంటూ చెప్పడం మొదలెట్టాడు తాత. 

                                ***

    సభ నుంచి వచ్చిన ఆ సాయంత్రం, గొర్రెల కాపరిని కలసి,  

   "ఓరే నాయనా ! నాకు తెలియక అడుగుతున్నా. అసలు రాజు గారు సౌంజ్ఞలు ద్వారా ఏమి అడిగారు ? దానికి నువ్వు సౌంజ్ఞలు ద్వారా చెప్పిన సమాధానం ఏమిటి ?" అని అడిగారు కుశాగ్రశర్మ.

   "ఓస్, అదాండి బాబయ్యా ! ముందుగా రాజుగారు నన్ను..

  తన కుడి చేతిని తల చుట్టూ తిప్పి ఒక వేలు చూపిస్తూ.. నీ గొర్రెల మంద అంతా కలిపి ఒక వరహాకి ఇస్తావా అని అడిగారు.

  దానికి సమాధానంగా నేను రెండు ఎకరాలు ఇస్తే ఇస్తాను అన్నట్టు రెండు వేళ్లు చూపించాను.

   మళ్లీ ఆయన సిగ్గు లేకుండా,  మూడు వరహాలు ఇస్తాను ఇస్తావా ? అన్నట్టు మూడు వేళ్లు చూపించాడు.

   దానికి నాకు  కోపం వచ్చి నీ బోడి మూడు వరహాలకు నా వెంట్రుక కూడా రాదు, బయటికి పో.. అన్నట్టు నా తల మీద వెంట్రుక చూపించాను. 

 ఆ దెబ్బకి రాజుగారు నా నిజాయితీకి మెచ్చి సన్మానం చేసారు."అని చెప్పడం ముగించాడు గొర్రెల కాపరి, వెర్రి చూపులు చూస్తున్న కుశాగ్రశర్మ వైపు ఆశ్చర్యంగా చూస్తూ.

                            ***


   "అదిరా మూర్తీ కథ,.. "మూర్తీభవించిన మూర్ఖత్వం"  అని నీ పేరు కూడా కలసివచ్చేలా కథకు పేరు పెట్టి, ఆ పత్రికకు పంపేయ్" చెప్పాడు ఎనభై ఏళ్ల మార్తాండరావు తాత.

   "కానీ కథ చదివి నవ్వుతారంటావా తాతా?" సందేహించాడు ముప్పై ఏళ్ల మనవడు మూర్తి.

   "కథ బాగుంటే మామూలుగా నవ్వుతారు. బాగా లేకపోతే మూర్ఖత్వంగా ఈ కథ రాసిన నిన్ను తలచుకుని జాలిగా నవ్వుతారు."


"అంటే మొత్తం మీద నవ్వు మటుకు కామన్ అన్నమాట."


"అంతేగా..అంతేగా" అంటూ ఓ ఆరతులం ముక్కు పొడెం ముక్కులోకి దట్టించాడు మార్తాండరావు తాత.


     *****     *** శుభం ***     *****

Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

తెలుగు సంధులు

                    తెలుగు   సంధులు సంధి వివరణ:                  మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది.    'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని  సంధి  అంటారు.                   ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది.  వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను  సంధి  అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును  సంధికార్యము   అని అంటారు.   సంధిలో రెండు పదాలు ఉంటాయి. వీటిల...

సంస్కృత సంధులు

                                           సంస్కృత సంధులు సంధి వివరణ:                    మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి   మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది.    'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని  సంధి  అంటారు.                   ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది.  వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను  సంధి  అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే...