Skip to main content

తీపి గురుతు - ఎమ్మార్వీ సత్యనారాయణ మూర్తి



       తూరుపు తెలతెలవారుతోంది.

  ఉదయారుణ కాంతులతో అఖండ గోదావరి మిలమిలా మెరుస్తోంది.

   చంద్రశేఖర శాస్త్రి గోదావరిలో మూడుసార్లు మునిగి సూర్య భగవానుడికి అర్ఘ్యమిచ్చి పుష్కరట్ మెట్లు ఎక్కి పైకి వచ్చాడు. శాస్త్రి భార్య సర్వమంగళాదేవి భర్తకి బట్టలు యిచ్చి తానూ స్నానం చేయడానికి వెళ్తున్నానని చెప్పింది.

   శాస్త్రి పంచె, లాల్చీ వేసుకొని భార్య రాకకోసం చూస్తున్నాడు.

   రైలు కం రోడ్ బ్రిడ్జి మీద నుండి ఎక్స్ప్రెస్ రైలు పెద్దగా శబ్దం చేస్తూ వెళ్తుంది. ఒక్కసారి అటుకేసి చూసిన శాస్త్రి వెంటనే కుడి పక్కకు తిరిగి పాత రైలు వంతెనకేసి తిరిగాడు. 

   సుదీర్ఘ సేవలు చేసి విశ్రాంతి తీసుకుంటున్న నిజాయితీపరుడైన ప్రభుత్వోద్యోగిలా మౌనంగా చూస్తోంది పాత రైలు వంతెన.

   ఎన్నో పుష్కరాలు చూసిన అనుభవం, ఎంతో మంది ముఖ్యమంత్రులు, గవర్నర్ల డాబూ, దర్పాలూ చూసిన జ్ఞాపకాలు వంతెన గుండెల్లో గూడు కట్టుకొని వుంటాయని భావించాడు.

   సర్వమంగళాదేవి గోదావరి స్నానం పూర్తి చేసి, ఒడ్డునే వున్న షెల్టరులోకి వెళ్ళి పొడిబట్టలు కట్టుకొని శాస్త్రి వద్దకు వచ్చింది.

   "ఏమిటి? మళ్ళీ ఊహాలోకంలోకి వెళ్ళిపోయారా?" అంటూ చిరునవ్వుతో అడిగింది.

   చిన్న నిట్టూర్పు విడిచి భార్యకేసి తిరిగాడు.

   "కొత్త బ్రిడ్జి కట్టాక పాత రైలు వంతెన తొలగించాలని రైల్వే శాఖ నిర్ణయించినపుడు స్థానికులు ఆందోళన చేసి దానిని అలాగే వుంచేటట్లు చేసారు. లేకపోతే నాలాంటి వాళ్ళు ఆ పాత వంతెన మీద నుండి వెళ్తూ గోదావరిలో చిల్లర వేసి నమస్కరించుకున్న మధురమైన జ్ఞాపకాల్ని గుర్తుకు చేసుకునే అదృష్టం కోల్పోయేవాళ్ళం. కొత్తదనానికి స్వాగతం పలకడంలో తప్పులేదు. కానీ పాతదానిని సమూలంగా తొలగించాలనుకోవడం కొన్ని సందర్భాలలో ఉచితంకాదు. ఏమంటావు?"

 "ఏమంటాను స్వామీ, పెందరాళే తెమిలితే మార్కండేయ స్వామిని దర్శించుకొందామంటాను” అదే చిరునవ్వుతో బదులు పలికింది సర్వమంగళాదేవి.

   ఇద్దరూ మెట్లెక్కి మార్కండేయస్వామి గుడిలోకి వెళ్ళి స్వామిని, అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చేసరికి కారు సిద్ధంగా వుంది. ఇద్దరూ కారెక్కి కోటిపల్లి బస్టాండు సెంటరుకి వచ్చి హోటల్లో టిఫిన్ చేసి బయటకు వచ్చి మరలా కారెక్కారు.

      కారు రావులపాలెం వైపు ప్రయాణించసాగింది. 

 చంద్రశేఖర శాస్త్రి ఆలోచనలు గతంలోకి తొంగిచూసాయి.


                      ***

    ఉండి అగ్రహారంలో తర్కశాస్త్రి పండితుడిగా ప్రఖ్యాతి చెందిన సదాశివశాస్త్రి మూడవ కుమారుడు చంద్రశేఖరశాస్త్రి. భీమవరంలో కళాశాల చదువు పూర్తిచేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ ఫిజిక్స్ చేసాడు చంద్రశేఖర శాస్త్రి.

    తూర్పు గోదావరి జిల్లా, పలివెల గ్రామంలో ప్రముఖ జ్యోతిష పండితుడు నారాయణ శాస్త్రి మూడవ కుమార్తె సర్వమంగళాదేవితో చంద్రశేఖర శాస్త్రికి వివాహం నిశ్చయం చేసారు.

   అప్పటికి ఉభయగోదావరుల మధ్య రాకపోకలు పడవల ద్వారానే జరిగేవి. సిద్ధాంతం వద్ద వంతెన నిర్మాణానికి పనులు ప్రారంభించారు.

   ఉండి అగ్రహారం నుండి సిద్ధాంతం వరకూ బస్సు మీద వచ్చి వశిష్ట గోదావరిని దాటి పల్లిపాలెం వద్దకు చేరుకోగానే నారాయణ శాస్త్రి బావమరిది రుక్మిణీనాధ శాస్త్రి మగ పెళ్ళి వారికి స్వాగతం పలికి సగౌరవంగా పలివెల తీసుకు వెళ్ళారు.

  పెళ్ళి కుమారుడికి, తోడ పెళ్ళి కుమారుడికి, ఆడపడుచుకి మున్సబుగారి గుర్రబ్బండి, సదాశివశాస్త్రి దంపతులకు గ్రామ ప్రెసిడెంటుగారి గుర్రబ్బండి ఏర్పాటు చేసారు. మిగతా పెళ్ళివారందరినీ రెండెడ్ల బళ్ళలో పలివెల తీసుకువెళ్ళారు.

   స్నాతకం గోదావరికి అవతల చేసుకోకూడదన్న నియమం ఉండటంతో మగపెళ్ళివారు పలివెలకు ఉదయమే చేరుకొని స్నాతకం చేసుకున్నారు. రాత్రి పదిగంటలా పదిహేను నిముషాలకు సుముహూర్తం.

   పలివెలలో నారాయణ శాస్త్రిది తాతలకాలం నాటి పెద్ద మండువా లోగిలి. ఇంటి ముందరే తాటి ఆకుల పందిరి వేసి పెళ్ళి వైభవంగా చేసారు.

   కపిలేశ్వరపురం, ముంగండ అగ్రహారం, పొడగట్లపల్లి గ్రామాలనుండి వేదపండితులు వచ్చి "సదస్యం" ఘనంగా నిర్వహించారు.

  సర్వమంగళాదేవి ఉండి అగ్రహారంలో అడుగుపెట్టిన వేళావిశేషం చంద్రశేఖర శాస్త్రికి హైద్రాబాద్లో ఉద్యోగం రావడంతో, కొత్త దంపతులు సీతాఫల్మండీలో కొత్తకాపురం ప్రారంభించారు.

   ఉద్యోగంలో చేరి ఏడాది గడిచాకా చంద్రశేఖర శాస్త్రి పి.హెచ్.డికి దరఖాస్తు చేయడం సీటు రావడం వేగంగా జరిగిపోయాయి. డాక్టరేట్ చేతికి రాగానే శాస్త్రికి న్యూఢిల్లీలో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం రావడంతో మకాం న్యూఢిల్లీకి మారింది. భార్యనీ, ఇద్దరు మగపిల్లల్నీ తీసుకొని న్యూఢిల్లీ వచ్చిన శాస్త్రి సంసార బాధ్యతని పూర్తిగా సర్వమంగళాదేవికి అప్పగించి కంపెనీ పనులమీద ఎక్కువ శ్రద్ధ చూపించాడు.

   జర్మనీ, జపాన్, లండన్ లో జరిగిన అంతర్జాతీయ సమావేశాలలో శాస్త్రి సమర్పించిన పరిశోధనా పత్రాలకు విశేష ప్రశంసలు లభించాయి.

   కాలచక్రంలో పదిహేనేళ్ళు గిర్రున తిరిగాయి. ఈ మధ్యకాలంలో రెండుసార్లు మాత్రమే శాస్త్రి ఉండి అగ్రహారం, పలివెల గ్రామాలకు రావడం జరిగింది. 

  నిరంతరం పరిశోధన. జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో కీలక ఉపన్యాసాలతో శాస్త్రి పూర్తిగా బిజీ అయిపోయాడు. పిల్లల చదువు, వారి బాగోగులు సర్వమంగళాదేవే

   "నీమీదే పూర్తి భారం వేస్తున్నాను సర్వమంగళా” అని అప్పుడప్పుడు శాస్త్రి అనేవాడు. ఆమె చిరునవ్వు నవ్వి ఊరుకునేది.

 పెద్దబ్బాయి సదాశివ, చిన్నబ్బాయి సాయినారాయణలు. చదువులో ఎప్పుడూ మొదటి ర్యాంకులోనే వుండేవారు. ఇద్దరికీ మంచి ఉద్యోగాలొచ్చాయి. పెద్దబ్బాయి అమెరికాలో, చిన్నబ్బాయి లండన్లో వుంటున్నారు.

   శాస్త్రికి ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇటీవలే రామన్ మెగస్సెసే అవార్డు కూడా వచ్చింది. అప్పటికి శాస్త్రి వయసు అరవై సంవత్సరాలు.

   శాస్త్రి షష్టిపూర్తికి కొడుకులూ కోడళ్ళూ న్యూఢిల్లీ వచ్చారు. శాస్త్రి పనిచేసిన కంపెనీ ఒక "ఇండిపెండెంట్ హౌస్"ని శాస్త్రికి షష్టిపూర్తి గిఫ్ట్ గా యిచ్చింది.

   కేంద్ర ప్రభుత్వం కూడా శాస్త్రిని శాస్త్రసాంకేతిక రంగ కౌన్సిల్ సభ్యుడిగా నియమించి అతని సేవల్ని వినియోగించుకొంటోంది.

   ప్రతి సంవత్సరం అమెరికా ఒకసారి, లండన్ ఒకసారి వెళ్ళి కొడుకుల్ని, కోడళ్ళని చూసి మనవల ముద్దూ ముచ్చట్లతో ఆనందంగా జీవిస్తున్నారు శాస్త్రి, సర్వమంగళాదేవి.

   కారు కొత్తపేట వంతెన దాటి కుడివైపు తిరిగి పలివెల పొలిమేరలలోకి రాగానే భార్య భుజంమీద తట్టడంతో గతంలోంచి వాస్తవంలోకి వచ్చాడు శాస్త్రి. 

   కారుని తిన్నగా కొప్పేశ్వరస్వామి దేవాలయం వద్దకు పోనిమ్మని చెప్పాడు డ్రైవర్, శాస్త్రి దంపతులు దేవాలయం దగ్గరకు చేరుకునే సరికి గ్రామ సర్పంచ్, ఆలయ ఇ.వో. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

   దేవాలయంలో పూజలు ముగించుకొని బయటకు వచ్చాకా శాస్త్రి సర్పంచిని అడిగాడు.

  "సుబ్రహ్మణ్య శర్మగారి కుటుంబీకులు ఎవరైనా వున్నారా" అని. 

   “శర్మగారు కాలం చేసాకా వారి పిల్లలు హైద్రాబాద్ వెళ్ళిపోయారు. ప్రస్తుతం వారి కుమార్తె, మనవడు వుంటున్నారు." చెప్పాడు సర్పంచ్.

  “సరే! వారిని చూసి వద్దాం." అని శాస్త్రి కారువద్దకు వచ్చి చిన్న సూట్కేస్ చేతిలోకి తీసుకున్నాడు. సర్పంచ్ "సూట్కేస్ నాకివ్వండి” అన్నా సున్నితంగా తిరస్కరించి భార్యతో కలిసి నడుచుకుంటూ శర్మగారింటికి వచ్చాడు శాస్త్రి,

 శర్మగారి అమ్మాయి బాలాత్రిపుర సుందరి, సర్వమంగళని గుర్తుపట్టి పలకరించింది.

  శాస్త్రి సూట్కేస్ తెరచి పట్టుచీర, పంచె, కండువా బయటకు తీసాడు.

  బాలాత్రిపురసుందరికి బొట్టు పెట్టి పట్టుచీర యిచ్చింది సర్వమంగళ, శాస్త్రి శర్మగారి అల్లుడు గిరిధరశర్మకు పంచె, కండువా యిచ్చి నమస్కరించాడు. 

   శాస్త్రి అందించిన వంద రూపాయల కట్ట బాల చేతిలో పెట్టి శాస్త్రి, సర్వమంగళ బాల పాదాలకు నమస్కరించారు. 

   "అయ్యయ్యో! ఇదేమిటండీ, పెద్దవారు మీరు నాకు నమస్కరించడం ఏమిటి?" అంటూ నొచ్చుకుంది బాల.

   "అమ్మా! మీ నాన్నగారి అమృత హస్తాలతో మా పెళ్ళి చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. కేవలం పురోహితుడిగా కాక మంచి మనసుతో వారు జరిపించిన కళ్యాణం మమ్మల్ని ఏభయ్యవ పెళ్ళిరోజు వరకూ సుఖ, సంతోషాలతో నడిపించింది. మీ కుటుంబం చేసిన మేలు ఎన్నటికీ మేం మరువలేం" వినయంగా అన్నాడు శాస్త్రి.

   వారినుండి శలవు తీసుకొని బయటకు వచ్చారు శాస్త్రి, భార్య.

  "సర్పంచ్ గారూ! మా పెళ్ళికి డోలూ, సన్నాయి వాయించిన వారి ఇంటికి కూడా ఒకసారి వెళదామా?" అడిగాడు సర్పంచి శాస్త్రి.

    ఆయన అలాగేనని తలూపాడు.

   సన్నాయి వాయించే సూరాసాహెబ్ చనిపోయాడని వాళ్ళబ్బాయి నాగూర్ టైలర్ గా వుంటున్నాడని, డోలు వాయించే కృష్ణమూర్తి మరణించాకా వాళ్ళబ్బాయి వాసు ఇంటి దగ్గరే చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని జీవిస్తున్నాడని సర్పంచ్ శాస్త్రికి వివరించాడు.

   సర్పంచ్, ఆయన వెనుక ఎవరో పెద్దాయన, చాలా మంది తన ఇంటికేసి రావడంతో ఆశ్చర్యపోయాడు నాగూర్.

 నాగూర్ కి కొత్త బట్టలు పెట్టి ఐదువేల రూపాయలిచ్చాడు శాస్త్రి. అదే విధంగా వాసుకి కూడా కొత్తబట్టలు యిచ్చి ఐదువేల రూపాయలు అందచేసాడు.

   ఎప్పుడో ఏభై సంవత్సరాల క్రితం తమ తండ్రులు వారి పెళ్ళికి మంగళ వాయిద్యాలు వాయిస్తే గుర్తుపెట్టుకొని న్యూఢిల్లీ నుండి తమ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి తమని సత్కరించడం చూసి కళ్ళమ్మట ఆనందభాష్పాలు రాలుస్తూ నిలబడిపోయారు నాగూర్, వాసు.

  పెళ్ళిళ్ళకు బాజాలు వాయిస్తే కిరాయిల కోసం కాళ్ళరిగిపోయేటట్లు తిరిగిన అనుభవాలు ఎక్కువవడంతో ఆ వృత్తి మానుకొని వేరే వృత్తులలోకి మారిపోయారు వారిద్దరూ. ఇప్పుడు ఇలాంటి అరుదైన గౌరవం తాము విడిచిపెట్టేసిన వృత్తివలనే లభించడం వారిని సిగ్గుపడేటట్లు చేసింది.

    అప్పటికి సమయం పదకొండు గంటలయ్యింది.

  సర్పంచ్ గ్రామ ప్రముఖులు తోడు రాగా హైస్కూలుకి వెళ్ళారు.

 ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ స్వాగతం పలికి స్కూలు అంతా దగ్గరుండి చూపించాడు.

  మధ్యాహ్నం స్కూలు పిల్లలందరితో కలిసి భోంచేసారు శాస్త్రి, సర్వమంగళాదేవి. అమలాపురం నుండి ప్రత్యేకంగా వంట వారిని పిలిపించి వంటలు చేయించి పిల్లలందరికీ పెట్టారు శాస్త్రి దంపతులు. మామిడికాయ పప్పు, ఆవపెట్టిన పనసపొట్టు కూర, దోస ఆవకాయ, బూర్లు, పులిహోర, సాంబారు పదార్థాలను ఎంతో యిష్టంగా తిన్నారు పిల్లలు.

                ***

  సాయంత్రం నాలుగు గంటలకు స్కూలులో బహిరంగ సభ ఏర్పాటు చేసాడు సర్పంచ్. 

 ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ పెద్దలందర్నీ వేదికపైకి ఆహ్వానించాడు.

  సర్పంచ్ బసవయ్య ప్రారంభోపన్యాసం చేస్తూ "ఈరోజు మన గ్రామ చరిత్రలోనే ఒక మహత్తరమైన రోజు. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం జరిగిన వివాహ ప్రదేశాన్ని గుర్తుంచుకొని శాస్త్రిగారు, మన ఊరి ఆడపడుచు సర్వమంగళ గారు మన గ్రామానికి రావడం ఎంతో ఆనందదాయకం.

  నాకు ఎంతో ఆశ్చర్యం, ఆనందం కలిగించిన విషయం ఏమిటంటే 50 సంవత్సరాల క్రితం ఎక్కడైతే తమ వివాహం జరిగిందో అదే ప్రదేశంలో దంపతులిద్దరూ ఒకరి మెడలో మరొకరు పుష్పమాలలు వేసుకొని ఆనందించడం. నారాయణ శాస్త్రిగారి ఇంటి స్థానంలో ప్రస్తుతం బ్యాంకు వుంది. అదే ఆవరణలో షామియానా కింద ఈ దంపతులిద్దరూ తమ మధురమైన అనుభూతుల్ని తలచుకొని మురిసిపోవడం నన్ను బాగా ఆకట్టుకొంది. నిరంతరం మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న నేటితరం ఒక్కసారైనా తమ మూలాల్ని మరచిపోకుండా. పల్లెలకొచ్చి వారికి కావాల్సిన ఉత్సాహాన్ని, సంతోషాన్ని గుండెల నిండా నింపుకొని “రీఛార్జ్" కావాల్సిన అవసరం ఎంతైనా వుంది.

 మరొక విషయమేమిటంటే నాగూర్ ఇంటికి వెళ్ళినప్పుడు షాజిదా "బాబుగారికి టీ యివ్వచ్చా? మా ఇంట్లో తాగుతారా" అని ఎంతో బిడియంగా అడిగింది. దానికి శాస్త్రిగారు,

  సర్వమంగళగారు మీ ఇంట్లో టీ త్రాగే స్కూలుకి వెళ్తాం అని ఆ ఇంటి అరుగుమీదే కూర్చున్నారు. 

   ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో సన్మానాలు పొందిన    గొప్ప వ్యక్తి శాస్త్రిగారు. సదాచారుల యింట పుట్టి ఆచారాలకు ఆనవాలుగా వుండే మహిళ సర్వమంగళగారు. ఎంత ఎదిగినా ఒదిగి వుండాలన్న దానికి నిజమైన నిర్వచనం, ఉదాహరణ ఈ దంపతులే. అందుకు వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ శాస్త్రిగారిని మాట్లాడవలసినదిగా కోరుతున్నాను." అంటూ ముగించాడు.

  శాస్త్రిగారు హుందాగా లేచి వినయంగా సభ నాలుగు వైపులకీ చేతులు జోడించి నమస్కరించారు.

 "సర్పంచ్ గారు నా గురించి ఎక్కువగా చెప్పారేమోననిపిస్తోంది. నేనూ మీలాంటి సామాన్య వ్యక్తినే. అయితే జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో విభజించుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకొని నడవడం వలన కొన్ని విజయాల్ని సాధించగలిగాను. దీనితోపాటు చేసే పనిలో, వృత్తిలో దైవాన్ని చూడాలి. నూటికి నూరుపాళ్ళు అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని నెరవేర్చాలి. కేవలం ధనం కోసమే వృత్తి చేస్తున్నామన్న భావనతో కాకుండా నా వృత్తి వలన పదిమందికి  మేలు జరగాలి, సమాజం మరింతగా అభివృద్ధి చెందాలన్న పవిత్ర ఆశయంతో మనం ప్రవర్తించిన నాడు మనదేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. 

  మీకు మరొక ప్రధాన విషయం నేను వినయంగా మనవి చేసుకుంటాను. నా విజయాలన్నింటికీ కారణం నా ధర్మపత్ని సర్వమంగళాదేవి. మీ ఊరి ఆడపడుచు.' అని . ఒక్కసారిగా ఆగారు శాస్త్రిగారు. సభంతా చప్పట్లతో మారు మ్రోగింది.

 "మా పిల్లల పెంపకం, చదువు అన్నీ తనే చూసుకునేది. తెలుగు తప్ప మరొకటి తెలియని సర్వమంగళ హిందీ, పంజాబీ, మరాఠీ భాషలు నేర్చుకుంది. ఎన్నో తెలుగు కథల్ని హిందీలోకి అనువదించడమే కాకుండా తాను స్వయంగా ఎన్నో కావ్యాలు హిందీలో రాసింది. హిందీ సాహిత్యంలో ఆమె పుస్తకాలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. కానీ దురదృష్టమేమంటే ఆవిడ ఫంక్షన్లకు హాజరయ్యే సమయంలోనే నాకు ఇంటర్నేషనల్ సదస్సులు జరిగేవి. కానీ ఏనాడూ తన ఫంక్షన్లకు నేను రాలేదన్న భావనను వ్యక్త పరచలేదు. ఇందుకు సభాముఖంగా నా క్షమార్పణలు సర్వమంగళకు తెలియజేస్తున్నాను.

 ఇంత సౌజన్యవతి, ఉత్తమ సంస్కారవతిని అందించిన మా మావగారు, అత్తగారు కాలంచేసి చాలా రోజులయ్యింది. మీ ఊరి ఆడపడుచుగా మీరు కూడా ఆమె ఉన్నతికి కారణభూతులని నా భావన.

  ఈరోజు మా యాభయ్యవ పెళ్ళిరోజు. మా పిల్లలు అమెరికాలో చాలా గ్రాండ్ గా అక్కడ తెలుగు అసోసియేషన్ సభ్యుల మధ్య మా పెళ్ళిరోజు చేస్తామన్నారు. నేనంగీకరించలేదు. సర్వమంగళ పుట్టి పెరిగిన ఊరులో, ఆమెను నేను పరిణయమాడిన ఊరిలోనే మా పెళ్ళిరోజు జరుపుకోవాలనుకున్నాం. సర్పంచ్ గారి సహాయం కోరాను. ఆయన పెద్దమనసుతో అంగీకరించినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

  పాఠశాల వసతి సరిపోవడం లేదని సర్పంచ్, ప్రధానోపాధ్యాయులు తెలిపారు. నా జీవన విజయాలకు స్ఫూర్తిదాత మీ ఆడపడుచుని నాకు అర్థాంగిగా యివ్వడంలో భాగస్వామ్యులైన మీ ఆదరాభిమానాలకు "తీపి గురుతు”గా పదిలక్షల రూపాయల్ని సర్పంచ్ గారికందజేస్తున్నాను. ఈ భవనం పూర్తయ్యాక పై అంతస్థు నిర్మాణానికి మరో పదిలక్షలు కూడా అందజేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను.

  పై అంతస్థులో నిర్మించే హాలుని గ్రంథాలయానికి కేటాయించమని నా మనవి. గ్రంథాలయానికి అవసరమైన బాల సాహిత్యాన్ని నేను స్వంత ఖర్చులతో సమకూరుస్తాను.

  బాల్యంలోనే దేశం పట్ల, సమాజం పట్ల పటిష్టమైన ఆత్మీయత భావనలు చోటుచేసుకోవాలి. ఈ అవకాశాన్ని నాకిచ్చిన సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలందరికీ నా కృతజ్ఞతా పూర్వక వందనాలు" శాస్త్రిగారి ఉపన్యాసం పూర్తికాగానే సభ మరోమారు కరతాళ ధ్వనులతో మారు మ్రోగింది.

  సర్వమంగళదేవి మాట్లాడుతూ “సంస్కారవంతులైన భర్త లభించడం తన అదృష్టమని, గ్రామంలో స్కూలు అభివృద్ధికి విరాళం అందజేసినందుకు శాస్త్రిగారికి పలివెల గ్రామ ఆడపడుచుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని” అంది.

  చివరగా పాఠశాల తరపున పదవ తరగతి విద్యార్థి సునీల్ మాట్లాడుతూ “యాభయ్యవ పెళ్ళిరోజు పలివెలలో జరుపుకొని 'తీపి గురుతు'గా మదిలో పదిలపరచుకోవాలని శాస్త్రిగారు తలవడం చాలా బాగుంది. అయితే ఒక గొప్ప శాస్త్రవేత్త, మాకు స్ఫూర్తిదాయకులైన శాస్త్రిగారు మాతో కలిసి భోంచేయడం మా విద్యార్థుల జ్ఞాపకాలు పెట్టెలో పదిలంగా దాచుకునే "తీపి గురుతు” కావడం మాకు సంతోషదాయకం. పెద్దలందరికీ కృతజ్ఞతలు” అనగానే ముచ్చటగా మూడవసారి సభాప్రాంగణం చప్పట్లతో పులకరించిపోయింది.

***   




Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

తెలుగు సంధులు

                    తెలుగు   సంధులు సంధి వివరణ:                  మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది.    'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని  సంధి  అంటారు.                   ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది.  వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను  సంధి  అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును  సంధికార్యము   అని అంటారు.   సంధిలో రెండు పదాలు ఉంటాయి. వీటిల...

సంస్కృత సంధులు

                                           సంస్కృత సంధులు సంధి వివరణ:                    మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి   మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది.    'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని  సంధి  అంటారు.                   ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది.  వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను  సంధి  అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే...