Skip to main content

కథా మాలిక - ఏడిద (శానాపతి) ప్రసన్న లక్ష్మి

  

                 


                      ముందుమాట

      

  రచయిత(త్రు)లు, తమ తొలి కథలను కొన్ని సంవత్సరాల తరువాత చూస్తే, రాసేవారికి ఎవరికైనా తమ కథలు మరీ అపురూపంగా ఏమీ కనిపించవు. కాలంలో వచ్చిన మార్పులు అప్పుడు తాను రగిలిపోయి బుర్ర పగులగొట్టుకునేలా ఆలోచించి,అక్షరీకరించిన రాసిన కథలు....

    ఆ విషయాలను దాటి సమాజం ఎంతో ముందుకు వెళ్ళిపోయి ఉండటం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఈ రచయిత్రి తన ప్రారంభ దశలో రాసిన కథలను మన ముందుకు ఎందుకు పెట్టారంటే... ఇవి కథల మాస్టారుగా ఖ్యాతి గడించిన కీ.శే. శ్రీ కాళీపట్నం రామారావు మాస్టారు గారిచే ఎన్నిక చేయబడ్డ కథలు కనుక.

   కా.రా మాస్టారు పై అలవిమాలిన అభిమానంతో ఈ కథలను రచయిత్రి ఇక్కడ ఒక మాలికగా రూపొందించే ప్రయత్నం చేస్తూ...ఆ కథల బ్రహ్మకు నివాళిగా అర్పిస్తున్నారేమో అనిపిస్తుంది. 

     80 వ దశకంలో రచనలు ప్రారంభించిన వారికి... ఒక గొప్ప ఆలంబనగా కా.రా మాస్టారు తను నిర్వహించే "నేటికథ" అనే శీర్షిక ద్వారా రోజుకొక కథను, ఆంధ్రభూమి దిన పత్రికలో ప్రచురిస్తూ ఉండేవారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎందరో కొత్త రచయితల రచనలకు ఆయన ప్రాణం పోసేవారు.

      కొత్తగా కథలు రాసేవారికీ....., రాస్తున్నా విషయ వ్యక్తీకరణ సరిగా చేయలేని వారికీ, సరైన విషయాలు ఎప్పటికీ ఎంచుకోలేక పోతూ అవస్థలు పడుతున్న వారికీ, ఒక స్పృష్టమైన నిర్ధేశనం, ఆయన ఎంపిక చేసిన కథల్లో గ్రహించేటట్టుగా చేసేవారు. 

  పాఠకులకు చాలా సాదాసీదాగా కనిపించినా రచయితలకు మాత్రం భవిష్యత్తులో తమ ఎదుగుదలకు ఉపకరించే ఉపకరణాలు గానే ఆ కథలు ఉపయోగపడ్డాయి. అలా కథకులుగా ఎదిగిన వారు ఎందరో ఇప్పటికీ చాలామంది ఉన్నారు.    

  ఇక శానాపతి (ఏడిద) ప్రసన్న లక్ష్మీ గారి కథల విషయానికి రావాలంటే... మళ్లీ కా.రా మాస్టారు కొత్త రచయితలకు ఆయన ఉద్బోదించి చెప్పే విషయాలకు కాస్తా దగ్గరగా ఉన్న ఆమె రచనలను పరిశీలించాలి.   

  కా.రా మాస్టారు చెప్పిన విషయాల్లో..."ప్రధానంగా రచయితలు వ్యవ స్థలో జరిగే వర్తమాన విషయాలను తమ రచనల్లో ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి. అవి కూడా కథలుగా రాయాలి. ఎంత గొప్ప విషయం కథకు ఎంచుకున్నా ...ముగింపు ఆశావహంగా ఉండాలి..     

  రచయిత రాసే కథ ద్వారా.., ఒకరిద్దరైనా మారగలిగి.. తమ బ్రతుకులను సరిదిద్దుకోగల ఆలోచన చదువరులకు కలగాలి....."అనే ఆయన ఆలోచనలకు చిన్నప్పుడే కాస్త దగ్గరగా వెళ్లారు కనుక ప్రసన్నలక్ష్మి గారి కథలకు మాస్టారు ప్రసన్నమై ఉంటారు.      

   ఇదంతా దాదాపు 30 సంవత్సరాల వెనుక జరిగిన విషయాలు కనుక... అప్పుడు మాష్టారి దగ్గరచేరిన కథకులంతా అప్పటికి యవ్వనప్రాయంలో కథలు రాయాలన్న ఉత్సహంతో ఉన్నవారే.. సమాజ...... అసమానతలపై ఉద్రేక స్వభావంతో ఉన్నవారే.... అయినా., మాస్టారు తన సరళ స్వభావంతో కథలను సౌమ్యంగా తీర్చిదిద్దడం కనిపిస్తుంది. ఆ సౌమ్యతను ప్రతిభింబించేలా రాసిన ప్రసన్నలక్ష్మిగారి కథలను ఒకసారి క్లుప్తంగా చెప్పుకుందాం.  

వధువు కావలెను - ఆసక్తికరమైన ప్రకటనలు.. అమ్మాయిల జీవితాల్లో ఆశలను రేకెత్తించి ఎలా అగాధం లోకి తోసేస్తాయో చెప్పి, జాగ్రత్త పడమని చెప్పటం ఈ చిన్ని కథలో చూస్తాం.

మళ్లీ మొదటికే - అల్లరిమూకలు ఆడపిల్లలను వేధించడం.... ఎప్పుడూ అవిచ్చిన్నంగా కొన సాగుతున్న ఈ విధానం, ఈ ఆధునిక కాలంలో కూడా ఇంకా కొన సాగడం వెనుక అమ్ముడుపోతున్న పబ్లిక్.. ప్రైవేట్ వ్యవస్థలు ఎలా కారణం అవుతున్నాయో చెప్పిన వైనం కన బడుతుంది. 

 (అభి) మానిని - ఫాల్స్ ప్రేస్టేజీ అంటాం కదా... ప్రతీ వారికి అదో దశ.. అలాంటి దశలను పట్టు వీడకుండా ఆదశలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఎవరికీ ఎలాంటి శాంతి లభించక బ్రతుకులు ఎంత దుర్భరం అవుతాయో చెప్పిన కథ.. కాస్తా పెద్దల వైపు పిల్లలూ..., పిల్లల ఆశలను పెద్దలూ గౌరవించాలి అనిచెప్పే కథ..

 పాఠం - ఏ కాలంలోనైనా తల్లిదండ్రులు ఆడపిల్లను ఓ అయ్య చేతిలో పెట్టి బరువు తీర్చుకోవాలనే ఘర్షణ.. ఒక వైపు ఉంటే.. స్త్రీ కూడా ఒక వ్యక్తిగా తనను తాను నిరూపించుకోవాలని చూసే సంఘర్షణ ఒక వైపు ఉంటుంది.. ఆమె నిర్ణయాన్ని హర్షించలేని, తిరష్కరించలేని ఆ పెద్దలకు ఆమె చెప్పిన పాఠం... మనం తెలుసుకోవాల్సిన అంశం. 

నిర్ణయం - తల్లీదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్థులైతే పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఆ ఆలూమగల్లో... భర్తకు ఎదురైన సంఘటనతో వారి నిర్ణయం ఎటు వైపు మళ్లిందో.. చదివి తెలుసుకోవాలి.

క్రికెట్ - కాలగమనంలో ఏదైనా ఒక ప్రభావానికి జనాలు లోనై.. ఆ వెల్లువలో కొట్టుకుపోతూ.. ఆచరణీయాలు వదిలేస్తూ... ఉండటం మనం చూస్తూ ఉన్నా.... (కథా) ప్రయోజనం కోసం మనమేం చేశాం అన్నది కూడా ముఖ్యమే. అది చెప్పడమే కుక్కకు ఆకలి తీర్చడం.. రచయితలు గమనించదగ్గ విషయం.

మెరుపుదెబ్బ -   మధ్య తరగతి కుటుంబీకులు చిన్న,చిన్న అవసరాలకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందో చక్కగా చెప్పిన కథ.. అయితే కా.రా.మాస్టారు చెప్పిన విషయానికి అనుగుణంగా..... ఇంకెవరో పరిచయం లేని వ్యక్తి ఆదుకోవడం ఆశావాహం.... ఇదీ రచయితలు గమనించాల్సిన అంశమే.

యువకుల ఇబ్బందులు -  ఎన్నో ఆశలతో కొడుకుల్ని ప్రయోజకుణ్ణి చేయాలనుకునే తల్లిదండ్రుల గురించి..ఈనాటి యువకులు ఎంత ఇబ్బందులు పడిపోతున్నారో అంటూ రచయిత్రి గారు వంగ్యతతో రాసిన కథ..

నీళ్ల గోల -  'జీవధార' అంటూ కా.రా. మాస్టారు నీటి గురించి రాసిన కథలో ఈ దేశంలో సామాన్యుల నీటి వెతలు ఎప్పటికీ తప్పవు అంటారు..ఆయన అన్నట్టే ఇప్పుడు కూడా..ప్రభుత్వ పరీశీలన సరిగా లేక సామాన్యుల నీటివెతలు ఎలా కొనసాగుతున్నాయో చిన్న వయసులోనే ప్రసన్నలక్ష్మి గారు చెప్పుకొచ్చారు.

ఆతిథ్యం ఖరీదు - ఆతిథ్యం అనేది పైకి అందంగా, ఆనందంగా కనిపించే వ్యవహారమే అయినా ఒక్కోసారి లోపలికి తరచి చూస్తే ఎంత నిస్సహాయత ను దిగమింగాల్సి వస్తుందో...ప్రభాకర్ పాత్ర ద్వారా దర్శింపచేస్తారు రచయిత్రి.

బలి పశువు - వ్యవస్థలో విచ్చలివిడి తనానికి సామాన్యుడు ఎలా బలిపశువు ఆవుతాడో చెప్పిన కథ.. 

నేరం -   వ్యక్తి, తనకు కావాల్సినది.. అవసరమైనది, తనకు తప్పనిసరైన వాటిని గుర్తెరుగ కుండా.... జీవితాన్ని.. జీవితాంతం ఛిద్రం చేసుకోవడం దిద్దుకోలేని నేరం అనే ఈ కథను చదవాల్సిందే.

నిరుద్యోగి - తొందరపాటు నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో... ఎలా దారితీశాయో... ఆనాటి (30 సంవత్సరాల వెనుక) కాలానుగుణంగా చెప్పిన కథ. అలాంటి సంఘటనలు అప్పట్లో సర్వసాధారణం.. మూడు దశాబ్దాల క్రితం కోరలు చాచిన నిరుద్యోగ జీవితాన్ని హృధ్యంగా ఆ చిన్న కథలో చెప్పడం విశేషమే.

 పాపం గుడ్డిది. - ఎందుకోసమైనా, అసత్యంతో కొనసాగే బ్రతుకు... ఎప్పటికైనా అమానుషమైన చేదునే మిగులుస్తుందని చూపిన కథ.

 అభిమానులు -     ప్రచారాలు... వాటి ప్రభావాలతో సామాన్యుడు ఎలా మోస పోతున్నాడో.. వంగ్యంగా రాయవలసిన కథనే సీరియస్ గా చెప్పిన కథ.. అభిమానులు.

తల్లి హృదయం. - తల్లి హృదయం ను ఎప్పటిలా ఆవిష్కరించిన కథ..చెప్పడం ఎందుకు? చదవాల్సిందే.

రాజకీయం - వ్యవస్థను ప్రభావితం చేస్తారనుకునే రాజకీయ నాయకులు..., ఎప్పుడు ఎలా ఉంటారో... మేధావులు కూడా అర్ధం చేసుకోలేరంటూ చెప్పిన కథ. కథ అర్ధమైనాక పెదాలపై చిరునవ్వు వచ్చి, నేటి రాజకీయ నాయకులు గుర్తుకు వస్తారు..

         ఇవీ ఏడిద ప్రసన్నలక్ష్మి రచయిత్రిగా మొదలై.. శానాపతి ప్రసన్నలక్షిగా తన సాహిత్య ప్రయాణం ఇప్పటికీ కొనసాగిస్తున్న... శానాపతి (ఏడిద) ప్రసన్నలక్ష్మి గారి తొలి కథలు.. శ్రీ దాసరి చంద్రయ్య గారి చొరవతో ప్రసన్నలక్ష్మి గారు మనకు అందిస్తున్న.... ఈ తొలినాళ్ళ కథలకు... 

కథలమౌని కా.రా మాష్టారు ఎంపిక చేసిన ఈ కథలపై.., నా ఈ వ్యాఖ్యానం మీకు సంతృప్తి కలిగిస్తే ధన్యుణ్ణి.. లేదంటే క్షంతవ్యుణ్ణి.

కథల గురువు గారైన కీ.శే. శ్రీ కా.రా. మాష్టారు గారిని ఇలా స్మరించుకునే అవకాశాన్ని నాకు కలిగించిన ప్రసన్నలక్ష్మి గారికి ధన్యవాదాలు.. ఆమెకు నా అభినందనలు.. 

                   


                          .... శ్రీచరణ్ మిత్ర 

                                                   (రచయిత)

                                                   విశాఖపట్నం.


                                     నా గురించి- నేను

                    

     నా పేరు ప్రసన్నలక్ష్మి. పుట్టి పెరిగింది కాకినాడ. ప్రస్తుత నివాసం విశాఖపట్నం. నా భర్త శానాపతి రంగధామ్ రిటైర్డ్ Bsnl ఉద్యోగి. మాకిద్దరు అబ్బాయిలు. గృహిణిగా వుంటూ అప్పుడప్పుడు కథలు రాస్తూ వుంటాను. ఇప్పటివరకూ 300 పైగానే రచనలు చేసాను. కొన్నివాటికి మాత్రమే బహుమతులు అందుకున్నాను. సంకలనంగా ఈ నేటికథలు తెలుగుసొగసులో రూపుదిద్దుకుంటున్నందుకు ఆనందంగా ఉంది.

         

   నేనంటూ మర్చిపోలేని వ్యక్తి... నాకు గురువుగా తారసపడ్డ ప్రముఖ రచయిత కీ.శే.శ్రీ.కాళీపట్నం రామారావు గారు. ఈయన గురించి తెలియనివారుండరు. ఇటీవలే దైవసన్నిధికి చేరుకున్న మహనీయులు.


     నాకు 1986 వరకూ ఈయనెవరో తెలియదు. వారి రచనలేమీ అప్పట్లో చదవలేదు. అలాంటి కారా గారు రాసిన ఓ కార్డు ముక్క పోస్టులో వచ్చి మా గుమ్మంలో వాలింది. అందులో రాసిందేమిటో చెప్పాలంటే...నాగురించి కొంచెం చెప్పాలి మరి.

     అప్పట్లో 'ఆంధ్రభూమి దినపత్రిక 'లో 'నేటికథ' శీర్షికన ప్రతిరోజూ ఒక కథ వేసేవారు. సరదాగా ప్రయత్నం చేద్దామని మా అన్నయ్య నాకు చిన్న థీమ్ చెప్పి కథ రాయమన్నాడు. అనుకున్నదే తడవు రాసేసి పోస్ట్ చేసేసాను. అదే నేను రాసిన మొదటి కథ...వధువు కావలెను. ఈ కథ పంపిన వారం రోజులకే 6 జూలై 1986 న పత్రికలో రావడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. మొదటి కథ ఓ ప్రముఖపత్రికలో వచ్చిందంటే ఆ సంతోషానికి కొలమానమే ఉండదు కదా.

    ఇంతకీ ఆ కార్డు ముక్కలో ఏంటి రాసుందంటారా...?

నేను పంపిన మరోకథలో అమ్మాయి తండ్రి పేరు 'పరంధామయ్య' అనీ... అతనొక బడి పంతులనీ రాసాను. ఆకథలోని ఆ వాక్యానికి రామారావు గారు స్పందిస్తూ.. చక్కటి విమర్శ చేశారు. కథ బావుంది, స్వీకరిస్తున్నామని చెప్తూ... ఛలోక్తిగా చిన్న మాటన్నారు. అమ్మా! కథల్లో అమ్మాయి తండ్రులందరూ ఎక్కువ పరంధామయ్యలూ, బడిపంతుళ్లే ఎందుకవుతారని...? అలా ఎందుకన్నారో నా మట్టిబుర్రకు అర్థం కాలేదు. చానాళ్లకు ఆయన ఓ బడి పంతులని తెలిసాక... అందుకే ఆరోజు ఆమాటన్నారని అర్థమయ్యింది. అప్పట్లో పేద అమ్మాయి తండ్రుల పేర్లు పరంధామయ్యా, రామారావు అని రాస్తూ వారి వృత్తి బడిపంతుళ్ళుగా నడిపిన కథలే ఎక్కువుగా ఉండేవి. కొత్తగా రాస్తున్న నేను కూడా అదేవిధంగా రాసేసరికి , ఆకథను కొద్దిగా సవరించి, పరంధామయ్య గారి పేరుని తొలగించేసారు. కథకు నేను పెట్టిన శీర్షిక కాకుండా 'పాఠం' అనే కథగా ప్రచురించారు. ఈ విధంగా చిన్న చిన్న సవరణలు చేస్తూ కొత్తగా కలం పట్టిన నాకు గురువు స్థానంలో నిలిచినందుకు చాలా గర్వంగా ఉంటుంది.

     ఆంధ్రభూమికి రాసిన ప్రతికథా నేటికథ శీర్షికలో ప్రచురించబడ్డాయి. కొన్నాళ్ళకు ఆ శీర్షిక ఆపేయడంతో....17 కథల వరకూ మాత్రమే అందులో చోటుచేసుకున్నా ఆ కథలంటే నాకెంతో ప్రీతి. ఈకథలన్నీ ఏడిద ప్రసన్నలక్మి,, ఎస్. ప్రసన్నలక్ష్మి పేరు మీదుగా కనిపించినా ఇప్పుడు మాత్రం శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి పేరు మీదే రాస్తున్నాను. నేను రాసే ప్రతీకథకూ చక్కటి థీమ్స్ చెప్పి రాయించే మా అన్నయ్య ఏడిద గోపాలకృష్ణ మూర్తి ప్రోత్సాహమే!

      అప్పటి నేటి కథలు ఈ విధంగా మరోసారి... దాసరి చంద్రయ్య గారి నిర్వహణలో సాగుతున్న 'తెలుగుసొగసు' లో సంకలనంగా రావడం నా అదృష్టమనే చెప్పుకోవాలి. దీనికి ముందుమాట వ్రాయమని శ్రీచరణ్ మిత్ర గారిని కోరాను. అడిగీ అడగడంతోనే కాదనకుండా, ఎంతో ఓపిగ్గా గౌరవనీయులైన కీ.శే.శ్రీ. కారా మాస్టారు గారిని తలచుకుంటూ ప్రతీ కథనూ సమీక్షించి అందించినందుకు శ్రీచరణ్ మిత్రగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈకథలపై మీ అందరి అభిప్రాయం కోరుకుంటున్నాను.

                        -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

                            9492339499.


అడ్రసు:-

ఎస్. ప్రసన్నలక్ష్మి

ఎం.ఐ.జి- 49, సెక్టార్-1'

ఎం.వి.పి.కోలనీ,

విశాఖపట్నం- 530017

E. mail. plsenapathi@gmail.com 

               కథా మాలిక క్రమం

1.వధువు కావలెను

2. మళ్లీ మొదటికే

3.(అభి) మానిని

4.పాఠం

5.నిర్ణయం

6.క్రికెట్

7.మెరుపుదెబ్బ

8.యువకుల ఇబ్బందులు.

9.నీళ్ల గోల

10.ఆతిథ్యం ఖరీదు

11.బలి పశువు

12.నేరం

13.నిరుద్యోగం

14.పాపం గుడ్డిది

15.అభిమానులు

16.తల్లి హృదయం

17. రాజకీయం 


               

                    

       ఎం.బీ.ఏ ప్రయివేటుగా చదువుతూ... బొంబాయి నగరంలో బిజినెస్ చేస్తూ కనీసం నెలకు ఐదువేలు ఆదాయం పొందుతూ కట్నకానుకలు, కులప్రసక్తి లేని ఆదర్శభావాలున్న వరునికి అందమైన వధువు కావలెను. ఫోటో వివరాలతో... పోస్ట్ బాక్స్ నెంబర్ 603, జనప్రియ దినపత్రిక పంపండి.

      జనప్రియ పత్రిక తిరిగేస్తున్న ఓ అందాల ఆరతిని వివాహబంధం శీర్షికలో ఆప్రకటన ఆకట్టుకుంది. తన పేదతనానికి ఇంతకంటే అవకాశం రాదని నిర్ణయించుకుని...కాగితం కలానికై వెదికాయి కళ్ళు.

                000

   ఆరతి గారికి, 

    జనప్రియ ద్వారా... మీ బయోడేటా, ఫోటో అందాయి. ఫొటోలో మీరు నచ్చారు. త్వరలో ఈ విషయమై హైదరాబాద్ వచ్చి కలుస్తాను. 

                                        మీరు కోరుకునే,                                                        అభినయ్      

 ఉత్తరం చదివిన ఆరతి సంతోషంతో తబ్బిబ్బయ్యింది. ఉత్తరం కేసి తేరిపారా చూసింది. ఆచూపులో వసంతాలు వెల్లివిరిసాయి. తన కష్టాలు కడతేరతాయనే సంభ్రమంతో ఆరతి మనసు అనేక విధాలా పరుగులు తీసింది. బొంబాయి నగరంలో తన సంసార జీవితం గురించి ఊహిస్తూ... ఆకాశవీధుల్లో విహరించింది.

                      000   

      టాక్సీ రివ్వున దూసుకుపోతుంది. రోడ్డుకిరువైపులా పెద్ద కట్టడాలతో బిల్డింగులు. ఆరతి వింతగానూ, ఆశ్చర్యంగానూ బొంబాయి నగర సౌందర్యాన్ని ముగ్దురాలై వినోదిస్తుంది. మనసులో కోటిరాగాలు ఎదమీటగా... భర్తవైపు చూసింది. ఆమె అమాయకపు చూపులో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఆదరణ ఇలాంటి భావాలే తొంగిచూసాయి.

       టాక్సీ ఓ భవంతి ముందు కీచుమంటూ ఆగిన శబ్దానికి ఈలోకంలోకి వచ్చింది. ఆ భవనాన్ని చూడగానే ఆరతి కళ్ళు అచ్చెరువొందాయి. సిగ్గుదొంతర్ల మధ్య నూతన వధువై ఆఇంటి గుమ్మాన్ని కుడికాలు మోపి గృహప్రవేశం చేసింది.

                     000

       ఆరతి మంచంపై బోర్లా పడుకుని వెక్కివెక్కి ఏడుస్తుంది.

కలలు కననేర్చిన ఆకళ్లకు లోకంలో వుండగలిగిన కిరాతకత్వమంతా ఒక్కసారిగా కనిపించింది. ఆ షాక్ కి ఆమె గుండెలు బద్ధలవుతున్నాయి. 

     అభినయ్ ఎంత అందమైన పేరు. ఎంత అర్థవంతమైందా పేరు...? పదికాలాల పాటూ అతనితో అన్యోన్యంగా గడుపుదామనుకున్న ఓ ఆడపిల్లను పదివేల రూపాయలకు రెడ్ లైట్స్ ఏరియాలో అమ్మగలిగిందా పేరు.

     ఆరతి ఏడుస్తూనే ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది...!!

     ( 1986 జులై 6వ తేదీ  ఆంధ్రభూమి దినపత్రిక)

                       

Telugusogasu

           

      దివ్యా..!

       ఆ గొంతు దివ్యకి పరిచితమే. వెనుతిరగలేదు. తడబడకుండా అడుగులు ముందుకు వేస్తుంది.

       దివ్యా! ఐ లవ్ యూ! ఆపై అల్లరిమూక నవ్వులు.

       దివ్య అడుగులు తడబడ్డాయి. ధైర్యం సన్నగిల్లింది. కూడబలుక్కుని అడుగులు వేస్తోంది. ప్రతిరోజూ ఆ కాలేజీ ఆవరణలో జరిగే తతంగమే అది. ఆమె ప్రతి చర్యనూ గమనిస్తూ ఆమెనెందుకు ఏడిపిస్తున్నారు? అందం ఆమె శాపమా? 

                         000       

      ఫోటో స్టూడియో నుంచి బయటపడ్డ దివ్య ఇంటివైపు వడివడిగా అడుగులు వేస్తోంది. మనసంతా కలగా ఉంది. రోజు ఆమెను అల్లరి పెడుతున్న ఆ మూక ఆమెను విడవడం లేదు. ముఖ్యంగా ఆ మదన్....

       ఛీ ఛీ ...ఎప్పుడు చూసినా ఏవో వెతుకుతున్నట్టే ఉంటాయి వాడి చూపులు. కసి, కోపం మిళితమైన ఆమె ముఖం రోషంతో ఎర్రబారింది. 

     "దివ్యా...!"

      మళ్లీ అదే పిలుపు, అదే గొంతు, అవే నవ్వులు. 

      ”ఏ రోడ్డు అంత గడ్డ వీళ్లే.. ఇడియట్స్.“ వారిని అసహ్యించుకుంటూ పళ్ళు పటపటా కొరికింది. 

   ఒంటరిగా నడుస్తున్న ఆమె భుజంపై పడింది ఓ హస్తం. కామంతో చూస్తున్న మదన్.

    దివ్య ముఖం వెలవెలపోయింది. ఉడుకు రక్తం సలసల మరిగి... కళ్ళు చింత నిప్పులా మారాయి.  

 "యూ... బ్రూట్!" అంటూనే చెంప చెళ్లుమనిపించింది. 

    మదన్ అహం దెబ్బతింది. పగబట్టిన త్రాచులా బచ్చన లేచాడు. అప్పటికే కనుమరుగయింది తన శత్రువు. ఆ సుకుమార్ హస్తంలో రక్తం గడ్డకట్టు పోయేటంతటి బలం ఉందనుకోలేదు. కళ్ళల్లో క్రోధంతో పాటూ, శరీరంలోని ప్రతి అణువు పగతో మండిపోతుంది. పళ్ళు పటపటలాడించాడు. ఏదో నిర్ణయం తీసుకుని వెనుతిరిగాడు. 

                        000         

      “ప్లీజ్..." మదన్ కళ్ళు అర్థిస్తున్నాయి.   

    "సారీ సర్..! మీరెంత బ్రతిమాలినా ఆ ఫోటో ఇవ్వడం జరగదు. అందులోనూ ఓ లేడీ ఫోటో.

      నిరాశతో వెనుతిరిగిన మదన్ కి ఫ్లాష్లా ఓ మెరుపు మెరిసింది. పర్స్ తీసి వంద నోటు అందించాడు. 

      ఎథిక్స్ గాలికి ఎగిరిపోయాయి.

  నోటు ఒకరి చేతిలోకి, ఫోటో ఒకరి చేతిలోకి మారిపోయాయి. వెనుతిరగబోయిన మదన్ మరో వంద కూడా తీసి అతని చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు.

 అతను ఆ నోట్ అందుకున్నాడు. పైకి ముఖం ముడుచుకున్నా లోలోపల సంతోషం నింపుకొని ముఖంలోని చిరునవ్వుని కనబడనీయలేదు.

                         000  

   "సర్...

      నా చావుకు కారణం.. ఈ ఉత్తరానికి జతచేసిన ఫోటోలో అనే మదన్ అనే కాముకుడు. నన్ను తన రూమ్ కి రమ్మన్నాడు. అలా రానిపక్షంలో ఈ ఫోటో అందరికీ చూపించి యాగీ చేస్తానన్నాడు. శతవిధాల బ్రతిమిలాడాను. లాభం లేకపోయింది. అతను మూర్ఖత్వమే నన్నీ పని చేయించింది. నిజానికి పై ఫోటో అతనితో కలసి ఏనాడూ తీయించుకోలేదు. ఆ ఫోటో అతను ఎలా సృష్టించాడో...?"

    ప్లీజ్... అతన్ని అరెస్ట్ చేయండి. నాలాంటి కన్నెల జీవితాన్ని కాపాడండి.

                                          - దివ్య

     పోలీస్ స్టేషన్ కి వచ్చిన లేఖ అది...

                       000    

   కటకటాల నుంచి విడుదలైన మదన్ ప్రవర్తనలో మార్పు లేదు. మళ్లీ అదే గొంతు, అవే నవ్వులు, కాకపోతే పిలుపులు వేరు. కథ మళ్లీ మొదటికే...!!

                               

      (ఆంధ్రభూమి దినపత్రిక 13 జూలై 1986)

                

Telugusogasu

           

    "మే ఐ కమిన్ సర్"... తీయగా మెత్తగా పలికిందా స్వరం.

     మోహన్ కళ్ళెత్తి చూసాడు. ఎదురుగా ఓ అందాల బొమ్మ.

  మోహన్ అనుమతితో హంసలా నడిచి లోనికొచ్చింది.

   ఆమె పేరు స్వరూప. వీడియో గేమ్స్ పార్లర్లో అమ్మాయి కావాలన్న ప్రకటన చూసి వచ్చింది.     

      "ఆ ఉద్యోగానికి నేను"...ఆమె చెప్పబోతుండగా...

   "తప్పకుండా ఈ ఉద్యోగం మీకే. జీతం వెయ్యి రూపాయలు" అన్నాడు.  

       ఆమె ఆనందం నిండిన కళ్ళతో థాంక్స్ చెప్పింది.

                      000   

      వీడియో గేమ్స్ పార్లర్ అంతా జనంతో గుమిగూడి ఉంది. ఆటల మీద ఉత్సాహం కంటే ఆఅమ్మాయి అందమే ఆకర్షిస్తోంది అందర్నీ. రోజురోజుకీ జనం పెరుగుతున్నారు... 

   మోహన్ ఓ నెంబర్ కి డయల్ చేసాడు. కాల్ చేసింది ఆ పార్లర్ రావు గారికి.  

   "హలో నమస్తే సర్..! మీ ఐడియా సెంట్ పర్సెంట్ సక్సెస్ సర్. పెళ్లి కాని అందమైన అమ్మాయి మన పార్లర్లో ఉంటే లాభాలు పుంజుకొస్తాయన్న విషయం నిజమయ్యింది. మీరు చెప్పినట్టుగానే కలెక్షన్స్ పుంజుకోవడం టాప్ సర్. అమ్మాయి చక్కటి బ్యూటీ సర్ . వర్ణనలకు అందదు సర్. ఇప్పుడు మీరొస్తారా సర్..? సరే సర్"..! బాస్ తో ఎంతో వినయంగా మాట్లాడాడు.

                       000

   కార్ లోంచి దిగిన రావు గారిలో ఆ అమ్మాయిని చూడాలని పట్టరాని ఆత్రుత. ఆ అమ్మాయిని మగాళ్లంతా గుంపులు గుంపులుగా కమ్మేసి వున్నారు.

    జనాన్ని నెట్టుకుంటూ పార్లర్లోకి దూరారు. ఆ అమ్మాయి ఎవరో చూడాలని ప్రయత్నించగా...ఎవరో తల మీద నుంచి చూసి బుర్రతిరిగినట్టయ్యింది. 

    ఆమెను చూడగానే ... బరువెక్కిన గుండెతో లోపలి గదిలోకి వెళ్లిపోయారు.  

    ఆమె ఎవరో కాదు. రెండేళ్ల క్రితం రావుగారి ఇష్టానికి వ్యతిరేకంగా తాను ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోయిన రావుగారి కూతురే.   

    "మీ ఆస్తీ అంతస్తూ మాకక్కర్లేదు. మా కాళ్ళమీద మేము నిలబడగలం" అని ధాటిగా చెప్పి ధీమాగా వెళ్లిపోయిన కూతురామె. కసి కొద్దీ వారికెక్కడా ఉద్యోగం రానీయకుండా చేసాడు రావు. వాళ్ళు ఊరోదిలెళ్లిపోయారు. నాటి నుంచి మళ్లీ ఇప్పుడే కూతురిని చూడగలిగాడు. పెద్దగా మార్పులేకపోయినా... ఆ గుంపులో నవ్వుతూ తుళ్ళుతున్న కూతురులో ఏదో వెలితి కనిపిస్తుంది.     

 నెమ్మదిగా పార్లర్ కాళీ అయ్యింది. స్వరూప లేచినిలబడింది. ఎదురుగా తండ్రి. ఆమె కళ్ళలో ఆనందం కాదు... చెప్పరాని నిర్లక్ష్యం.   

   తనను తప్పించుకు పోతున్న కూతురి మెడ వైపు చూసాడు. మెడలో పొట్టిగా ఉన్న చిన్న చైన్. పెళ్ళైన వారికుండాల్సిన ఆ మాంగల్యం లేదు.  

   "స్వరూపా" అంటూ పిలిచాడు గద్గద స్వరంతో.

    ఆమె ఆగలేదు. 

    "ఒకనిమిషం ఆగమ్మా" అర్థించాడు.

  స్వరూప వెనుతిరిగింది. తండ్రి చూపులు తన మెడపైనే ఉన్నాయని గ్రహించింది. బ్యాగ్ లోంచి మంగళసూత్రాల గొలుసు వేసుకుని... మాట్లాడకుండా అక్కడ నుంచి రుసరుసా వెళ్ళిపోయింది.

                         000      

 "నాకు తెలియదు సర్...ఆమెకు పెళ్ళైనట్టు". క్షమించమన్నట్టు చెప్పాడు మోహన్.    

 "ఇట్స్ ఆల్ రైట్" అన్నాడు... తానూ బయలుదేరుతూ.     

    "రేపామె జాబ్ కొస్తే తీసుకోమంటారా"...?     

  "వస్తే వచ్చినప్పటిమాట. వస్తే తీసుకో". అన్నాడు రావు కారుకేసి నడుస్తూ.   

  స్వరూప ఎవరో మోహన్ కి ఇంతవరకూ తెలీదు. రావుగారికి ఇంతప్పటినుంచి తెలుసు....!!*

                            000

( ఆంధ్రభూమి దినపత్రిక 12 సెప్టెంబర్ 1986)

                     ‌     Telugusogasu



      1985 వ సంవత్సరం...!

      చిదిమి దీపం పెట్టుకోవచ్చు అంటారే అంత అందమైనది ఆ అమ్మాయి. పెద్ద సంబంధాలకు పోయే తాహతు వారికెలాగూ గనుక... కనీసం ఓ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే గుమస్థాకైనా ఇచ్చి పెళ్లిచేయాలని ఆమె తల్లిదండ్రుల ఆశ. చివారికలాంటి సంబంధం దొరికింది.

    "మాకు అమ్మాయి నచ్చిందండీ. ఇక వరకట్నంగా ఏమివ్వదల్చుకున్నారో చెప్తే..." అంటూ పళ్లికిలించాడు పిల్లవాడి తండ్రి.

    "అమ్మాయి పేరున యాభైవేలున్నాయి బ్యాంకులో. కాదూ కూడదంటే ఇంకో ఐదు వేలు వరకూ సర్దగలను" అన్నాడు పిల్ల తండ్రి.

    "లాభం లేదు. లక్షకు ఒక పైసా కూడా తగ్గం" అంటూ లేచి తమవాళ్ళందర్నీ లేపి తీసుకెళ్లిపోయాడు పిల్లాడి తండ్రి.

    1986 వ సంవత్సరం...!

    ఓ ఆఫీసులో రికార్డు అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు వరుడు. అతనికైనా లక్ష రూపాయలే కావాలట. ఆ సంబంధమూ తప్పిపోయింది.

    1987 వచ్చింది...!

    నిరాశతో ఇంటికొచ్చిన భర్త ముఖం చూసి కాయా పండా అనైనా అడగలేకపోయింది పిల్ల తండ్రి.

    భార్య ముఖంలోని ఆతృతని గమనించి..."ఈ ప్యూన్ గా చేసే ఈ ఉద్యోగస్థుడికి కూడా లక్ష రూపాయలే కావాలటే. లోగడ చూసిన గుమస్థాకి ఇంకా పెళ్లికాలేదని తెలిసి...అటునుంచి అటే వెళ్ళాను. ఏ పాట్లో పడి ఆ లక్షా ఇచ్చుకుంటానని చెప్పాను. వాళ్ళకిప్పుడు లక్షన్నర కావాలట. వస్తువుల ధరలు పెరిగాయనో...రూపాయి విలువ తరిగిందనో అన్నారు" అంటూ చెప్తూనే అలసటగా కుర్చీలో కూలబడ్డారు ఆతండ్రి.

    ఆ సంభాషణంతా పక్కగదిలోంచి వింది అమ్మాయి. 

   నాకు కావాలనుకున్న సంబంధం ఎలాగూ చేయలేరు. అలాంటప్పుడు నాకు ఏ సంబంధమైనా ఒక్కటే. కానీ...రెండేళ్ల క్రితం గుమస్థాకి బదులు రికార్డు అసిస్టెంట్ నే చూసినా ఈ తెగువ అప్పుడే చూపి...ఆ గుమస్తా సంబంధం ఖాయపర్చినా ఇప్పుడు ఈ ప్యూన్ చేతకూడా కాదనిపించుకునే ఖర్మ నాకు పట్టేది కాదు..అనుకుంది అమ్మాయి. 

    అలా అనుకున్న నాలుగో నాడు తల్లితండ్రులతో తాననుకున్న విషయం చెప్పేయాలనుకుంది.

  "చూడండి నాన్నా...నన్ను జీవితాంతం పోషించేవాడు కోసం మీరు కాళ్లు నొప్పులోచ్చేలా తిరగాల్సినపని మానేయండి. చిన్నదో పెద్దదో ఉద్యోగం వెతుక్కుంటాను. లేదంటే అప్పడాలో ఆవ పచ్చళ్ళో పెట్టుకుని నా పొట్ట నేను పోషించుకకోగలను. నాకు తగినవాడు దొరికినప్పుడే పెళ్లాడతాను. లేదంటే ఇలాగే ఉండిపోతాను" అంటూ కూతురు చెప్పిన మాటల్ని ఆమె తల్లీతండ్రీ వీస్తుపోయివిన్నారే గానీ...ఆమె మాటల్ని తిరస్కరించనూ లేదు...అలాగని హర్షించనూ లేదు. ఆలోచిస్తూ ఉండిపోయారు...!!

                            000 

                   

Telugusogasu

        

        “ఏమేవ్ ఆఫీస్ కి టైం అయింది. ఇంకా చిన్నిని తయారుచేసినట్టు లేవు. తొందరగా కానీయ్..." అంటూ కంగారు పెడుతున్నాడు భార్యను భాస్కర్.

     "ఆ.... అయిపోయిందండి. వచ్చేస్తున్నా...! అంటూ టిఫిన్ బాక్స్ లో గుప్పెడు మెతుకులు ని హడావిడిగా నొక్కుతూ బదులిచ్చింది హేమ. 

     నానా హైరానా పడుతూ మొన్ననే సంవత్సరం నిండిన చిన్నీని భుజాన వేసుకుని... భర్త వెనక స్కూటర్ మీద కూర్చుంది హేమ. ఆ స్కూటర్ సరాసరి చిల్డ్రన్స్ కేర్ ముందు ఆగింది.అల్లిబిల్లి మాటలతో బుజ్జగిస్తూ... బిస్కెట్స్ చాక్లెట్ ఇస్తామని ఊరిస్తున్నా గుక్క పెట్టి ఏడుస్తున్న ఆ పసికందుని నిర్ధాక్షణ్యంగా వదిలేసి వారి వారి వృత్తుల కోసం ఆఫీస్ వైపు దూసుకుపోయారు.

      ఇలా ఒక రోజు వ్యవహారం కాదు. రోజూ ఇదే పరిస్థితి.     

       ఒకరోజు...

      "నువ్వు ఉద్యోగం మానేయ్" అన్నాడు భార్యతో భాస్కర్.  

      అది విని అదిరిపడింది హేమ. అయోమయంగా చూసింది భర్తను.

      "అవును! మనకేం తక్కువ అయిందని..? మన ముగ్గురి పోషణకి నా ఒక్కడి సంపాదన చాలు. ఖర్చులు పోను ఇంకా నాలుగు రాళ్లు మిగిల్చుకోవచ్చును కూడా. ఏదో నువ్వు డిగ్రీ చదివావు... పిల్లా పాపా పెరిగితే అక్కరకొస్తుంది కదాని ఉద్యోగం చేస్తానంటే సరే అన్నాను. కానీ మన స్వార్థానికి చిన్ని జీవితం బలై పోతుందని నాకు ఈ రోజే తెలిసింది" అన్నాడు భాస్కర్.

     ఏమైంది అన్నట్లు చూసింది హేమ.

  "ప్రొద్దుట మా కొలీగ్ తో ఓ అనాధ ఆశ్రమానికి వెళ్లాను. అక్కడ ఆ పిల్లల్ని చూస్తే నాకు చిన్నీ జ్ఞాపకం వచ్చింది. సరైన పోషణ లేక బిక్కుబిక్కుమంటున్న చూపులు... ఆ చూపుల వెనక ప్రేమ ఆప్యాయత చూపించే వాళ్ళు మాకు ఎవరూ లేరనే ధీనత్వం. ఎందుకో నాకు ఆ క్షణం మన చిన్నీ కళ్ళముందు కదిలింది. తల్లి తండ్రీ లేక వాళ్లు ప్రేమ ఆప్యాయత లకు దూరమైన అనాధలైతే...తల్లీ తండ్రి ఉండి కూడా... ప్రొద్దున పోయి సాయంత్రానికి వస్తూ మన ప్రేమాభిమానాలను చిన్నీకి పంచివ్వలేక పోతున్నా మనిపించింది. ఆ పిల్లలు కళ్ళు చూసి, మన చిన్నీ కళ్ళు చూస్తే నాకు తేడాలేదనిపించింది...." అన్నాడు భాస్కర్.

       హేమ మాట్లాడలేదు...!

  "ఉద్యోగం నువ్వు మానేస్తావో, నన్నే మానేయ మంటావో ఆలోచించుకో. ఇద్దరిలో ఎవరో ఒకరు మానక తప్పదు" అన్నాడు దృఢంగా భాస్కర్. 

     ఏమంటుంది హేమ...? అలాంటి నిర్ణయాన్ని ఏ తల్లి హర్షించదూ...? ఆనందం నిండిన గుండెతో వెళ్లి నిద్రపోతున్న చిన్ని నుదుటిపై ముద్దు పెట్టుకుంది హేమ..! 


    ( ఆంధ్రభూమి దినపత్రిక 15 డిసెంబర్ 1987)

     

         

                 

Telugusogasu

     పగలు పదకొండు గంటలు...! 

     రిక్షా దిగుతూ... రోడ్డుని ఇంటినీ ఓసారి పరికించి చూసాను. నేను ఊళ్లో లేని ఈ వారం రోజులకే అంతా బోసిగా చిన్నబోయినట్టయ్యింది.

      నా రాకను చూసి... వీధి లోని భోగనవిలియా సంతోషంగా తలూపి... స్వాగతం పలికింది . పెంపుడు కుక్క నిక్కీ పరుగున వచ్చి నా కాళ్లను చుట్టేసాను. నేనంటే దానికుండే విశ్వాసానికి పొంగిపోయాను.

      నేనొచ్చినట్టు నిక్కీ అంత హడావుడి చేసినా... ఇంట్లోని కోడలు బయటకు రాకపోవడం నాకు ఆశ్చర్యమేసింది.

      రిక్షా లోని సామాన్ని తీసి వీధి అరుగు పై పెట్టి జోళ్ళ స్టాండ్ లో చెప్పులు వదులుతుంటే అక్కడున్న రెండు చెప్పుల జతలను చూసి...అవి ఆ సమయములో అక్కడెందుకున్నాయా అర్థం కాలేదు . 

      హాలులోకి అడుగుపెట్టిన నేను విషయాన్ని పూర్తిగా గ్రహించాను . వాళ్లకిదేం క్రికెట్ పిచ్చో గానీ... నేను వచ్చాననే ధ్యాసే లేకుండా ... కొడుకు కోడలు, మనుమడు టీవీ లోని క్రికెట్ చూడ్డంలో మునిగిపోయారు. 

     వాళ్లు ఈస్థితిలో లేరని తెలుసుకున్న నేను...ప్రయాణిక బడలికచే ఆకలి దహించేస్తుంటే ... వాళ్ళ ఏకాగ్రతను భంగం చేస్తూ..."అమ్మా కమలా" అంటూ కోడలిని పిలిచాను.

      నా పిలుపుకామె ఒక్కసారిగా తత్తరపడింది. "ఆ...వచ్చారా మావయ్యా..! నేనసలు గమనించలేదు. మీరు వస్తారని తెలియక ఇంకా వంట చేయలేదు. ఈఒక్క పూటకి హోటలకెళ్లి భోజనం చేసి రండి" అంటూ బ్రతిమాలింపుగా నా వైపు ఓ క్షణం చూసి...మళ్లీ టీవీలో పడిపోయింది.

       అక్కడ నుంచి కదిలి వెళ్తున్న నన్ను పిలిచి.. "నాన్నా... ఆ చేత్తోనే మాక్కూడా క్యారియర్ తీసుకొచ్చేయండి" అంటూ పురమాయించాడు నా కొడుకు.

      ఆకలి దహించేస్తుంటే మరి చేసేదేముంది...? మౌనంగా క్యారియర్ పట్టుకుని బయటకు నడిచాను.

        భోజనంతో ఇంటికి తిరిగొచ్చిన నాకు...కొడుకు, కోడలు, మనుమడు.. అందరూ కలిసి తిట్టుకుంటున్న సణుగుడు వినిపించింది. తిట్టిన తిట్లు తిట్టకుండా శాపనార్థాలు పెడుతున్నారు.

       "అసలు వాళ్లకు బుద్దిలేదు. డ్యూటీకి సరిగా నిర్వర్తించడం లేదు" అంటూ నానామాటలంటున్నారు ఎలెక్ట్రిసిటీ బోర్డు వాళ్ళను.

      ఆట మంచి జోరుగా సాగుతున్న సమయంలో కరెంటు పోయిందని వాళ్ళ బాధ. ఆ సమయంలో వాళ్లని చూస్తే చెప్పలేని ఆవేదన కలిగింది. క్రికెట్ చూడడం కోసం కొడుకు ఆఫీస్ కి లీవ్ పెట్టడం, మనుమడు స్కూలు మానేయడం, కోడలు వంటపని ఎక్కొట్టేయడం...ఇవన్నీ బానే ఉన్నాయి....

  కరెంటు వాళ్లు ఏక్కడో లైను బాగుచేస్తూ ఉండుంటారు. అందుకని లైను ఆపితే...కరెంటు వాళ్ళని బాధ్యతారహితులని అంటున్నారు. దీనికేమైనా అర్థముందా...? అనుకుంటూనే డైనింగ్ హాల్ వైపు నడిచాను.

   అక్కడ అన్నం కోసం నాలుక చాపుకుని... క్యారియర్ వైపు ఆశగా చూస్తున్న నిక్కీని ప్రేమగా చూస్తూ క్యారియర్ విప్పాను. 

      అది తోక ఊపుమంటూ అన్నం తింటుంటే...నాలో చెప్పలేని అవ్యక్తానుభూతి కలిగింది మనసంతా...!!*

                          000

           ( ఆంధ్రభూమి దినపత్రికలో 24జనవరి 1988)

                     

                   


      సదానందం వర్క్ ఎక్కువుగా వుండటంతో ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి లేటయ్యింది. స్కూటర్ ని పార్టీకోలో పార్క్ చేస్తూ... గుమ్మంలోనే దిగాలుగా కూర్చున్న భార్యవైపు ఏమైందన్నట్టు చూసాడు.

      తనకొచ్చిన మెసేజ్ ని చూపించి కళ్లనీళ్లు గక్కింది పార్వతి. మావగారికి సీరియస్ గా ఉందని తెలిసి భార్యను ఓదార్చారు. "మరేం పర్లేదు... భయపడకు. నువ్విప్పుడే మీ ఊరు బయలుదేరు" అంటూ లోపలికి తీసుకెళ్ళాడు.

     "మరి మీరు రారా..."? సందిగ్ధంగా అడిగింది.

  "సారీ...పార్వతి. ఇప్పుడు నేను రావడానికి కుదరదు. రేప్రొద్దుట మా ఎం.డీ వస్తున్నారు. ఆ మీటింగ్ కి తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఆయన కోసమే వారం రోజులుగా ఈ ఫైల్స్ పనితో మునిగిపోతున్నా. నువ్వు చూస్తూనే ఉన్నావుగా. రేపొద్దుట ఆ మీటింగ్ అయిపోగానే లీవ్ తీసుకుని వెంటనే బయలుదేరి అక్కడకు వస్తాను". భార్యకు నచ్చచెప్పాడు సదానందం.

  భార్య తయారయ్యేలోగా తాను వడ్డించుకు తిన్నాడు.

      నెలాఖరు కావడంతో భార్యకు డబ్బులిద్దామంటే తనదగ్గరంతగా లేదు. పర్సు కాళీ అయిపోయింది. ఉన్నదాంట్లోనే కొంచెం మినహాయించి కొంచెం భార్య కందించాడు. 

    భార్యను బస్ స్టాండులో బస్సెక్కించి ...డ్యూటీకి స్కూటర్ మీద ఆఫీసుకు దూసుకుపోయాడు.

   పరిగెడుతున్న స్కూటర్ ఒక్కసారిగా ఆగిపోయేసరికి సదానందం గుండెల్లో రాయి పడ్డట్టు అయ్యింది. ఆ స్కూటర్ మళ్లీ పరుగుపెట్టాలంటే పర్సులో మిగిలాయనుకున్న డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిందే అనుకున్నాడు భారంగా. 

  చేసేదిలేక దగ్గర్లోని పెట్రోలు బంకు దగ్గరకు లాక్కెళ్లాడు బండిని. లీటరు పెట్టోలు పోయించుకుని దానికయ్యే డబ్బునందించాడు.

  ఆడబ్బునందుకుని..."ఈరోజు నుంచి లీటరుకు రూపాయి పెరిగిందండీ. ఇంకో రూపాయి వస్తాది" అన్నాడు పెట్రోలు పోసేవాడు.

     సదానందానికి ఏంచేయడానికీ తోచలేదు. కిళ్లీ కొట్టతనా రేపిస్తాననడానికి...? రూపాయికి తికాణా లేనివాడికి స్కూటరెందుకనుకుంటాడేమోనని సిగ్గేసింది. ఇలా నోటీసులు లేకుండా ప్రభుత్వం రాత్రికి రాత్రే ధరలు పెంచడాన్ని బట్టి... ప్రజల్ని ఎంతగా దోచుకుతింటున్నారో కదాని చికాకుపడుతుంటే.... సదానందం పరిస్తితి అర్థం చేసుకున్న పక్కతను "సర్లెండి... నాదగ్గర తీసుకోండి... మీకు మొహమాటమైతే ఈసారి ఎక్కడైనా కనిపించినప్పుడు ఇద్దురు గాని అంటూనే పెట్రోలు పొసే వాడి చేతిలో రూపాయి నాణాన్ని వదిలాడు.

    సమయానికి ఆదుకున్న ఆ అపరిచితుని వైపు కృతజ్ఞతగా చూసి...థాంక్స్ చెప్పి స్కూటర్ స్టార్ట్ చేసాడు సదానందం...!!

                    000


            ( ఆంధ్రభూమి దినపత్రికల 1 ఫిబ్రవరి 1988)

       

            

        ఉదయం 9:00 గంటలు!

       రాధ పుస్తకాలను గుండెలకు అదుముకొని నడిచి వెళ్తుంటే సైకిల్ ను నెమ్మదిగా తొక్కుతూ ఆమెను ఫాలో అవుతున్నాడు గోపాల్.

       ”హలో ...!" అంటూ ఆమెను పలకరించాడు.

       ఆమె అతని వైపు చూడలేదు... మాట్లాడలేదు.

       ఈసారి అతను ఏదో అన్నాడు...

       ఆమె ఫక్కున నవ్వి క్రీగంట చూసింది అతన్ని.

      అంతే... నెమ్మదిగా తొక్కుతున్న సైకిల్ దిగిపోయి ఆమెతో పాటు నడుస్తూ ఏవేవో మాట్లాడుతూ... నవ్విస్తూ ...కవ్విస్తున్నాడు గోపాల్.

    మధ్యాహ్నం 2.00 గంటలు!

     సత్యను ప్రేమ పేరుతో కాలేజీ ఎగ్గొట్టించి... సినిమాకు తీసుకెళ్లాడు కృష్ణ !

    హాల్లోని ఆ చీకటి మాటున ఒకరి పక్కన ఒకళ్ళు అతుక్కుపోయి కూర్చున్నారు. ఆమె చెవిలో ఏదో సన్నగా గుసగుసలాడాడు. 

        అతనేదో చేస్తుంటే.. ఆమె కిల కిలా నవ్వుతుంది. వారిద్దరూ సినిమాకి వచ్చామన్న ధ్యాసే పూర్తిగా మరచిపోయారు.

     సాయంత్రం 6:00 గంటలు!

     సముద్రపు ఒడ్డున ఉన్న బీచ్ పార్క్ లోని రెస్టారెంట్లో ఒక టేబుల్ దగ్గర రుక్మిణి. ఆమెకి ఎదురుగా కూర్చుని ఉన్నాడు- మూర్తి.

     కూల్ డ్రింక్స్ సేవిస్తూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్నారు. వారి చూపుల్లో ఎన్నో భావనలు, ఏవో భాషణలు.   

      ఆమె చేతులను చేతుల్లోకి తీసుకుని మెత్తగా నొక్కుతున్నాడు. 

     ఆ స్పర్శలో ఏవో తీయని అనుభూతులు వాళ్ళ కళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి...

      రాత్రి 10:00 గంటలు!

       ప్రియమైన నాన్నగారికి,

      నేను క్షేమము. మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీరు నా కోసం దిగులు పెట్టుకోకండి నేను బాగానే చదువు కుంటున్నాను ఫస్ట్ తారీఖున మీరు పంపించిన డబ్బు పది రోజులు కూడా కాకుండానే అవసరమైన పుస్తకాలు కొనడంతో అయిపోయింది డబ్బు కోసం చాలా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి మరో మూడు వందలు పంపించగలరని కోరుతూ....

                                         మీ

                              గోపాల కృష్ణ మూర్తి.

     మర్నాడు...

    కొడుకు ఉత్తరం అందుకున్న శ్రీహరి నాయుడు గారిలో చెప్పలేని ఆందోళన. కొడుకు డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నాడనే ఆవేదన. ఎక్కడో తల తాకట్టు పెట్టి మరో మూడు వందలు సంపాదించి గోపాల- కృష్ణ- మూర్తికి పంపారు!!

        (ఆంధ్రభూమి దినపత్రిక 26 ఫిబ్రవరి 1988)

   

                                          

                    


         నీళ్ళూ... నీళ్ళూ... నీళ్ళూ...!

         ఆ ఊరంతా నీళ్ల ఎద్దడే.

         రెండు రోజులుగా రాని నీళ్ళకారొచ్చింది. దాన్ని చూడగానే ఆ కోలనీ వాసులు బిలబిల మంటూ బయటకొచ్చి మైలున్నర దూరం క్యూ కట్టారు.         

      బిందెలు, బక్కెట్లు పట్టుకుని తమవంతు నీళ్లకోసం ఎదురు చూస్తున్నారు. కొందరైతే క్యూలో నుంచోకుండా పక్కదోవ నుంచి అన్యాయంగా నీళ్లు పట్టేసుకుంటున్నారు. అది ఓర్వలేని కొందరు వారిని ఎదిరిస్తున్నారు. దానితో కుమ్ములాట, గుద్దులాట, తిట్లతో...మహాజోరుగా సాగుతుంది నీళ్ల పంపకం.

    ఆ నీళ్ళ బందలో ఓ బామ్మ కాలు జారి పడబోయి... నిస్సత్తువుగా కూలబడిపోయింది.

    "ఇంకెంతమ్మా...ఓ పది బిందెలు నిండితే మీ వంతు వచ్చేస్తుంది. ఇంతసేపూ ఎలాగూ నుంచున్నారు.ఎలాగోలా ఓపిక తెచ్చుకోండి" ఆమెకు ధైర్యం చెప్పాడు ఓ దయాశీలి.

   "లేదు నాయనా ! ఇక ఈ నీళ్ల బాధ నేను పడలేను గానీ...ఈ ప్రాణమేదో గుటుక్కున పోతే నానోట్లో పోసే తులసి నీళ్లతో తృప్తిపడిపోతాను" ఆయాసపడుతూ చెప్పారు బామ్మగారు.

     "అయ్యో అవేం మాటలండీ...మనమెన్ని బాధలు పడినా ఈరోజొక్కరోజే కదా. రేపటి నుంచి నీళ్లకోసం ఈ పడిగాపులు పడక్కర్లేదు. మున్సిపల్ చైర్మన్ గారొచ్చి ఓవర్ హెడ్ ట్యాంక్ ను ప్రారంభోత్సవం చేస్తారు. రేపే ఎవరి వీధి కుళాయిల్లో వాళ్ళకే కావల్సినన్ని నీళ్లు." 

    ఆమాటతో ఊరాట కలిగిన బామ్మగారి కళ్ళలో తళుక్కున మెరుపు. ప్రాణం పోతే బాగుండుననుకున్న ఆవిడకే నిండు నూరేళ్లూ బ్రతకాలన్న ఆశ క్షణంలో ఉవ్వెత్తున లేచింది.

    ఆ దయాశీలి చేయి ఆసరాతో మళ్లీ తనవంతు నీళ్లకోసం నిలబడ్డారు బామ్మ. నీళ్లు దొరికాయి ఎలాగైతే బామ్మగారికి.

    మర్నాడు ఉదయం...

    అందరూ తమ వీధి కుళాయిల వద్ద బిందెలను పెట్టి అమృతం కోసం చూస్తున్నట్టుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. నీళ్లు వస్తాయనుకున్న సమయం దాటి గంటలు గంటలు దాటిపోతున్నా...ఒక చుక్క కూడా నీరు పడ్డం లేదు. అందరిలోనూ ఆందోళన.

 దారిన పోయే ఒకతను తీసుకొచ్చిన వార్తతో... ఉన్నట్టుండి ఆ వీధిలోవారంతా గుంపులు గుంపులుగా పోగయ్యారు.

     ఎవరి నోట విన్నా అదే చర్చ...!

    చైర్మన్ గారు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభోత్సవం చేసిన వెంటనే ట్యాంక్ అడుగు భాగం కూలిపోయిందంట.

    ఆ జనంలో ఎవరో గొణుక్కుంటున్నారు....

    "ఆ కాంట్రాక్టర్ డబ్బుకు కక్కుర్తి పడేవాడు. మరి. డబ్బులు నొక్కేయడానికి నాసిరకం సిమ్మెంటు వాడితే ఇలాగే ఉంటుంది." అంటూ వినిపించాయి.

  మళ్లీ నీళ్ల టాంకర్...దానిచుట్టూ ఆ రభస మామూలే....!!

                         000


     (ఆంధ్రభూమి దినపత్రిక, 25 మార్చి1988 ) 

         

         

                     

   

    హైదరాబాద్ సిటీ...!

   నాకంతా కొత్తప్రదేశం...

   ఆ ఇంటి నెంబర్ అవునో కాదో మరోసారి చూసాకా ...ఆటోవాడికి డబ్బులిచ్చి పంపేసి... పెట్టే బెడ్డింగుతో ఆఇంటి తలుపు తట్టాం.

  ప్రభాకర్ ఇంట్లోనే ఉన్నట్టున్నాడు. వాడే వచ్చి తలుపుతీసాడు. వాడి వెనుగ్గా వాడి భార్య. ఎప్పుడో ఒకప్పుడు వస్తామని ఇదివరకు చెప్పాను గానీ...మేమింత హఠాత్తుగా వస్తామని వారు ఊహించలేదనుకుంటాను. ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని..తెరుకుంటూ...మమ్మల్ని సాదరంగా లోనికి ఆహ్వానించారు.

      మారాక వలన వారిలో కలిగిన భావం నేను గ్రహించకపోలేదు. గుమ్మం పక్కగా చెప్పులు విడుస్తూ... "మరేం లేదురా...! నిన్ను చూడాలనిపించి అనుకోకుండా ప్రయాణమై వచ్చేసాము" అంటూ చెప్తుంటే...వాడు పైకి నవ్వుతున్నా...వాడి కళ్ళలో నాకు ఆందోళన కనిపిస్తూనే ఉంది. వాడి ప్రేమాప్యాతలు ఎలాంటివో నాకు తెలుసు కాబట్టి....అవేమీ నేనంతగా పట్టించుకోలేదు.

    మామర్యాదల కోసం వాడి భార్య లోపల సతమతమతున్నట్టుంది...

    ఆతర్వాత అందరం కలిసి బాగా కాలక్షేపం చేసాము. చూస్తుండగానే రెండు రోజులు గడిచిపోయాయి.

    నాభార్య అయితే ఇంకా వుందామంది. ప్రభాకర్ వాడి భార్యా కూడా ఇంకో రెండురోజులు ఉండమని పట్టుబట్టారు. 

    అయినా నేను ససేమిరా అన్నాను.

 వారిద్దరి పిల్లల చేతుల్లో చెరొక ఐదొందలూ పెడుతుంటే... నేచేస్తున్న పనికి అడ్డుకున్నారు ఆదంపతులిద్దరూ. ఎలాగో వారిచేతుల్లో కుక్కి శెలవు తీసుకుని బయటపడ్డాం.

  వద్దంటున్నా... ప్రభాకర్ స్టేషన్ వరకూ వచ్చి సాగనంపాడు.

    ట్రైన్ కదిలించి...

 "ఎలా ఉంది ఈహైద్రాబాదు సిటీ"? అడిగాను భార్యను.

    "నాకైతే ఇంకా వుందామనిపించింది. అయినా వారెంతగా ఉండమని చెప్పినా మీరెందుకు బయలుదేరతమని చెప్పారో నాకర్థం కాలేదు" అంది.

    నా భార్యమాటకు కోపమొచ్చినా అర్థమయ్యేలా మందలించాను. "చూడు...ఇలాంటి సిటీలో ఇంటికి చుట్టాలొచ్చి ఒకరోజు ఉన్నారంటే...చాలీ చాలని జీతగాళ్లకు ఒక యుగం గడిచినట్టే. ప్రభాకర్ కూడా ఆకోవకు చెందిన వాడే. నాకంటే కూడా సంపాదనలో చిన్నవాడే". 

    "వాడింట్లో వున్నప్పుడు...నేనే డబ్బులు ఖర్చు చేద్దామన్నా వాడసలు ఊరుకోడు. మనిద్దరికీ ఈరెండు రోజులూ ఏలోటూ రాకుండా తిండి పెట్టాడంటే...వాడు అంతో ఇంతో అప్పుచేసి ఉంటాడని నాకు తెలుసు. అందుకే వాడి పిల్లలిద్దరి చేతుల్లో డబ్బులు పెట్టాను".     

   "పిల్లలకిలా డబ్బులిచ్చి... ఇంటికొచ్చిన ప్రతిఒక్కరూ వెళ్లిపోయేటప్పుడు తమకు డబ్బులిస్తారని ఎదురుచూసేలా పిల్లల్ని పాడుచేయకు" అంటూ ప్రభాకర్ కోప్పడ్డాడు.

    "నిజానికి పిల్లల్ని పాడుచేయాలన్నది నా ఉద్దేశ్యం కాదు. ఈరెండు రోజులూ వాడు మనకిచ్చిన ఆతిధ్యానికి ఖరీదు కట్టడం తప్పే అయినా...నాకంతకన్నా ఏం చేయాలో తోచలేదు". నాభార్యతో చెప్పేసి...బరువు దించేసుకున్నాను..!

                         000


     (ఆంధ్రభూమి దినపత్రిక 13 జూలై 1988)

                         

                     



      జనరల్ వార్డులో స్పృహ వచ్చిన సుందరానికి ఒళ్ళంతా పచ్చిపుండులా వున్నా...ఆ బుర్రమీసాల పోలీసోడే పదేపదే గుర్తుకొస్తున్నాడు.

    ఓరోజు సుందరం కిరాణా షాపుకొచ్చాడు ఆ పోలీసోడు. అడుగున్నర పొడుగున్న లిస్టు చదివి....సరకులన్నీ కట్టించాడు. అన్నీ సంచుల్లో సర్దుకుని "వస్తాను బ్రదర్" అంటూ లేచి వెళ్లబోయాడు.

  బిల్లు కట్టకుండా వెళ్తున్న ఆపోలీసోడిని అడ్డుకున్నాడు సుందరం. "మర్యాదగా డబ్బులిచ్చి వెళ్ళు" అంటూ గదమాయించాడు. 

     "ఏయ్... ఇవన్నీ ఎవరికనుకుంటున్నావు? ఎస్సై గారికి" అంటూ దూకుడుగా ముందుకెళ్తున్న పోలీసోడిని వదలలేదు సుందరం.

    కష్టార్జితాన్ని దౌర్జన్యంగా తీసుకెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాడు. సరుకులైనా వదిలేయమన్నాడు లేదా డబ్భైనా కట్టి వెళ్ళమన్నాడు. ఇద్దరి మధ్యా పెద్ద రభసే జరిగింది.

 చివరికేమనుకున్నాడో... సుందరం ముఖంపై డబ్బులిసిరేసి పోయాడు పోలీసోడు. 

    ఇది జరిగి వారం రోజులవుతుంది....

     ఇంతలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుని హత్య. ఊరంతా అల్లర్లు...దహనకాండలు...లూఠీలు. ఎక్కడ చూసినా భయనక అలజడులే. 

     శాంతి భద్రతల పర్యవేక్షణ పేరుతో...

   మర్నాడు సంఘవిద్రోహుల ఏరివేతంటూ పోలీసులు రంగంలోకి దిగారు. అటువంటి వాళ్ళతో పాటూ అమాయకుల్ని కూడా బంధించారు

     అవకాశం దొరికిందనుకుంటూ...సుందరాన్ని కూడా నెట్టేశాడు బుర్రమీసాల పోలీసోడు. నాకేమీ తెలియదంటూ నెత్తీ నోరూ మొత్తుకుంటూ ఏడ్చినా పోలీసోళ్లు చితక బాదేశారు. 

     తన స్వార్ధం కోసం, డబ్బులు ఖర్చుబెట్టకుండా ఎదుట వారి పొట్ట కొట్టి... తనవాళ్లకు కూడు గుడ్డ కోసం, తాను పన్నిన పన్నాగం ఫలించనందుకు పోలీసోడి కసి ఈవిధంగా తీర్చుకున్నాడు

     కటకటాల వెనుక నిర్జీవమైన స్థితిలో పడివున్నాడు సుందరం. పోలీసోళ్ల లాఠీ దెబ్బలకు చర్మం చీలి, ఎముకలు విరిగి...అటూ ఇటూగా అతని ప్రాణం ఊగిసలాడుతుంటే... హాస్పిటల్లో జాయిన్ చేశారన్న సంగతి తెరలుతెరలుగా గుర్తుకొస్తుందిప్పుడు...!!

                ‌‌          000

                   

     (ఆంధ్రభూమి దినపత్రిక 10 జూన్ 1989) 


                       

           


           

   మాధవ్ లో సరసమైన ఆలోచనలు సాగుతున్నాయి...!

      గత రాత్రి ఊర్వసి హోటల్ లో తన ప్రేయసి మధుర తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ మంచంపై అటు ఇటు దొర్లుతున్నాడు మాధవ్.

      నిజంగా... మధురతో ఆ అనుభవం మధురమే..

     మెచ్చుకోలుగా తలచుకున్నాడు.

      అలా ఆ అనుభూతిలో ఉండగా...."ఒరేయ్ ఇంకా నిద్ర రావడం లేదా ..?" అంటూ కొడుకు మంచం పైకి వచ్చి కూర్చుంది అతని తల్లి.

      ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ...." మన వనజ పెళ్లిచేసే ఉద్దేశం నీకు ఇంకా లేదా ఏమిటి..?" అంటూ తల్లి నిలదీసేసరికి మాధవ్ లో అప్పటివరకు ఉన్న ఆనందం కాస్త ఎగిరిపోయింది.

     "రాఘవయ్య మావయ్య కాకినాడ సంబంధం తీసుకొచ్చాడు. లక్ష రూపాయలు క్యాష్, రెండెకరాల భూమి ఇస్తామంటున్నారు. నువ్వు ఈ సంబంధాన్ని ఊ.. అంటే మనం కూడా వనజ పెళ్లి చేసేయొచ్చు. బాగా ఆలోచించి ఏ సంగతీ తెల్లారేసరికి చెప్పు" అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది అతని తల్లి.

     మాధవ్ లో సందిగ్ధత చోటు చేసుకుంది.

అటు ప్రేయసి మధుర...ఇటు చెల్లెలు వనజ... దీనాతి ధీనంగా కళ్ళముందు కదలాడే సరికి, చేసేదిలేక రక్తసంబంధమైన చెల్లెలు సమస్యపైనే బలవంతంగా మనసును తిప్పగలిగాడు.

                   000                 

   మాధవ్ కుమిలిపోతున్నాడు... మనసులోనే మౌనంగా!

     మాలినితో తన పెళ్లయిన రోజే మధుర ఆత్మహత్య చేసుకుందన్న పిడుగులాంటి వార్త వినడంతో షాక్ తగిలినట్లయి.... తొలిరాత్రి నాడు భార్య మాలిని దగ్గరకు తీసుకోలేక పోయాడు

   ఆ రాత్రే కాదు. ఇక అన్ని రాత్రులు భార్యకు ఎడంగానే ఉన్నాడు.

     భర్త ప్రవర్తన అర్థం కాక... ఆ విషయం గురించి పైకి ఎవరితోనో చెప్పుకోలేక మాలిని కూడా మనశ్శాంతికి దూరమైందని చెప్పాలి.


     నాడు చెల్లెలు పసుపు తాడు కోసం ప్రేయసి మధురను చేతులారా దూరం చేసి చంపు కొన్నాడు. ఇప్పుడు భార్య మాలినిని కూడా మానసికంగా బాధిస్తూ నేరం చేస్తున్నాడు.

     మాధవ్ కు ఇప్పుడు దీని గురించే మదన. తనను తాను క్షోభ పెట్టుకుంటున్నాడు. అదే నేరం...!!

                     000

      ( ఆంధ్రభూమి దినపత్రికలో 24 జూన్ 1989) 


         


             

     కమల్ నిరుద్యోగి...!

 పదమూడేళ్ళుగా ఉద్యోగం కోసం పడిగాపులు పడుతూ ఎదురుచూస్తూనే వున్నాడు. కనీసం ఒకాఫీసు నుంచి కూడా ఇంటర్వ్యూ రాకపోవడం అతని దురదృష్టమో...ప్రభుత్వ అసమర్థతో తెలీదు.

     ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలో తన పేరు నమోదు చేయించుకున్నది ఇరవైఏళ్ల వయసప్పుడు. అంటే అతను బిఏ పాసైనప్పుడు. 

   ఉద్యోగ అర్హతకు మరో ఆరునెలలు మాత్రం గడువుంది. పదమూడేళ్ళుగా ఎదురుచూస్తూ వస్తుందేమో అనుకుంటున్న ఉద్యోగం ఇక వస్తుందని అతనిలో ఏ కోసాన్నా నమ్మకం లేదు. ఉన్న కాలం కాస్తా గతంలాగే గడిచిపోతే తన చదువుకు సార్థకత లేదని తెలిసి కమల్ మనసు విరిగిపోయింది. తన సమస్యకు పరిష్కారాన్ని బాగా ఆలోచించి టేబుల్ పైనున్న కాగితం కలాన్ని అందుకున్నాడు.

                  000

  రాఘవాచార్యులు ఇల్లు అర్చకుల మంత్రాలతో హోరెత్తిపోతుంది. 

     ఆ తంతు అలా జరుగుతుండగా పోస్ట్ అంటూ ఓ లెటర్ రావడంతో భారంగా నిట్టూర్చారు రాఘవాచార్యులు.

     కమల్ పేరున ఓ గవర్నమెంటు ఆఫీసు నుంచి వచ్చిన ఇంటర్వ్యూ లెటర్ చూడగానే...కొడుకు తొందరపాటుకు మరింతగా కుమిలిపోయారు

     కొడుకు రాసిన ఆ ఉత్తరంలో...

     జన్మనిచ్చిన తల్లిదండ్రులకు,

     ఇన్నాళ్లూ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూనే వున్నాను. ఇక నాకు ఉద్యోగం వస్తుందనే నమ్మకం పోయింది. పూర్తిగా మనోవేదనకు గురవుతున్నాను. ఇంకా ఎన్నాళ్ళని నాభారాన్ని మీపై వేస్తాను..? అలాగని ఏ కూలో నాలో చేసుకుని బ్రతకలేని డిగ్రీ హోల్డర్ని. వృద్దాప్యానికి చేరుకున్న మిమ్మల్ని నేను పోషించాల్సింది పోయి మీరు నన్ను పోషించడం నన్నెంతగానో బాధిస్తుంది. బ్రతికుండగా మీకు నేను ఓ ముద్ద పెట్టలేకపోయాను. నేను చచ్చి కూడా మీతోనే పిండం పెట్టించుకోవాల్సిన రోజు మీకు కల్పిస్తున్నందుకు చాలా సిగ్గుగా ఉంది. మీకు దూరమవుతున్నందుకు నన్ను క్షమించండి.

                                                  మీ

                                                 కమల్

    పదకొండు రోజుల క్రితం కొడుకు రాసిన ఆ అక్షరాలు నీలిమేఘాల్లా కళ్ళల్లో అలుముకునేసరికి ...  ఉబికిపెట్టుకున్న దుఃఖం పైకి పొంగుకొచ్చింది రాఘవాచార్యులకు.

  వాడు బ్రతుకుతెరువుకి భయపడి పిరికివాడై ప్రాణాలు తీసుకున్నాడు గానీ... నేను ఏం చదుకున్నానని అందర్నీ పోషిస్తూ సంసారభారాన్ని మోస్తున్నాను..? నేర్చుకున్న నాలుగుముక్కల వేదంతో నమ్ముకున్న నాలుగిళ్ళల్లో శుభకార్యాలకు పురోహితుడిలా కొనసాగుతున్నాను. పాడుబడ్డ దేవాలయాల్లో అర్చకుడిగా వెళ్తూ భక్తులు వేసే దక్షిణలను ఏరుకుంటున్నాను. పండక్కోపబ్బానికో అందరూ ఇచ్చే స్వయంపాకాలతో కూడా మీ అందరికీ పొట్ట నింపుతున్న బ్రతకనేర్చిన మనిషిని.    

      నాకు తెలిసిన విద్యలు నీకు తెలియవనే కష్టపడి వెనకేసిన కొంత డబ్బుని ఉద్యోగం కోసం తల్లడిల్లుతున్న నీకు ఉద్యోగం ఇప్పించమని ఓ అధికారి కాళ్ళా వెళ్ళా బ్రతిమాలి అతని చేతిలో దక్షిణ అర్పించుకున్నాను. ఆ సంగతి నాకు మాత్రమే తెలుసు. దాని ఫలితమే ఈరోజు నీకోసం వచ్చిన కాల్ లెటర్ ఇది. మనసులోనే చనిపోయిన కొడుక్కి చెప్పుకుంటూ... ఆ ఇంటర్వ్యూ లెటర్ని కూడా కొడుక్కి పెడుతున్న పిండాలతో పాటూ గోదాట్లోకి వదిలేసి.... కొడుకు ఆత్మశాంతికై దేవుడ్ని ప్రార్థిస్తున్నారు రాఘవాచార్యులు...!!

                      000

       ( ఆంధ్రభూమి దినపత్రిక 28 డిసెంబర్,1989) 

             

                      

     ఆ ముసలిజంట ముష్టోళ్ళు...!

 ప్రతిరోజూ ఆపేటలో అడుక్కోవడం వాళ్ళ జీవనాధారం.  

   ఆరోజు కూడా అలాగే ఎప్పటిలా...ముసిలిదాన్ని చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు ముసలాడు.  

    "అమ్మా ధర్మం.. అయ్యా ధర్మం... గుడ్డిదండయ్యా... రూపాయి దానం చేయండయ్యా" అంటూ ధీనాతిదీనంగా అరుస్తున్నాడు.  

   ముసిలిది కనురెప్పల్ని ఆడిస్తూ...గుడ్లను అటూ ఇటూ తిప్పుతూ...తడుముకుంటూ..తన ధీనావస్థతో ప్రజల్ని ఇట్టే జాలితో కరిగించేస్తుంది.     

      అందరూ దానం చేసే పైసలతో...వారి సత్తుగిన్నె నిండిపోయేది.   

       ఆ సంపాదనే...వాళ్ళకానందం. 

     ముసలాడి కళ్ళతో పాటూ... ముసిలిదాని కళ్ళు కూడా ఓ క్షణం వెలిగిపోతాయి.    

        చీకటి పడుతుండగా...    

    అలా సంపాదించిన పైసల్ని మూటగట్టుకుని.. విశ్రాంతి కోసం గూటికి చేరడానికి గుడ్డిదాని చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు... ముసలాడు.  

    కడుపాకలి తీర్చుకోడానికి వారి కాళ్ళు తొందరగా పరిగెడుతున్నాయి...   

      అప్పుడే అనుకోని ఘోరం జరిగిపోయింది.

      గుడ్డిదాని జీవననీడ ఎగిరిపోయింది.   

 ఎర్రటి కారొచ్చి.... ముసలాడిని గుద్దేసి వెళ్ళిపోయింది.

    ముసలాడు "అమ్మా"అంటూ అరిచిన అరుపు ధర్మం కోసం కాదు... ప్రాణాలు విడిచేస్తూ వేసిన ఆఖరి చావుకేక.

    ఆ హఠాత్మరణానికి...హతాసురాలై పోయింది ముసిలిది. తడుముకుంటూనే భర్తను ఒడిలోకి తీసుకుని బావురుమంది.

   మందు మత్తులో వున్నా... ఒక ప్రాణాన్ని బలితీసుకున్నానని తెలుసుకున్న కారువాలా... ఎవరూ చూడకపోవడంతో అక్కడ నుంచి క్షణంలో పరారైపోయాడు. కానీ గుడ్డిది తనను చూసిందని...ఆక్షణం తత్తరపడినా.. ఆమె గుడ్డిదే కదా అనే ధైర్యంతో స్పీడ్ గా ముందుకు పోనిచ్చాడు. 

     కళ్ళులేని గుడ్డిది హృదయవిదారకంగా ఏడుస్తుంటే చుట్టూ జనం పోగయ్యారు.

    "ఏ రంగు కారు ...? నెంబరెంత...?" అని ఆదుర్దాగా అడుగుతూనే... ఆమె గుడ్డిదని తెలిసి పెదిమ విరిచారు. 

     ఆ యాక్సిడెంట్ అయినప్పుడు చూసిన సాక్షులెవరూ అక్కడ లేకపోవడంతో అయ్యో పాపమని సానుభూతి కురిపిస్తూ తమకు తోచిన పైసలు గుడ్డిదాన్ని ముందు పడేసి ఒక్కొక్కరూ వెళ్ళిపోతుంటే... ఆ సాక్ష్యం నేనే అంటూ గొంతెత్తి అరవాలనిపించి... నిస్సహాయురాలై శిలా ప్రతిమలా నేల కూర్చుండిపోయింది ముసిలిది.

     గుడ్డిదాన్ని కళ్ళల్లో తన భర్తను గుద్దేసిపోయిన ఆ కారువాలా రూపమే కదలాడుతుంది .అతను ఎవరో కాదు రోజూ తమకు దానం చేసే షాపు యజమాని. పాపం గుడ్డిదాన్ని కనికరించి ధర్మం చేసే దయామయుడు.

     అందుకే అతన్నెలా మరచిపో గలదు...? అతన్ని సులువుగానే పోల్చుకోగలిగింది. ధర్మం చేసేవాడని అతిగా గౌరవించి అభిమానించే ఆ వ్యక్తే తన భర్తను పొట్టన పెట్టుకోవడం చూసి.. ఆమె గుండె మౌనంగా విలపించిందే గానీ... హంతకుడు అతనేనని గొంతెత్తి చాటాలంటే... లోకం దృష్టిలో గుడ్డిదై పోయింది. ఒకవేళ చెప్పినా... కళ్ళున్న గుడ్డిదాని ఆత్మఘోష ఆలకించే దెవరు...?

   బ్రతుకు తెరువు కోసం గుడ్డి దానిగా నటిస్తూ.. చలామణి అయిపోయిన ముసిలిదాని జీవన ప్రయాణం రేపటి నుంచి ఎలా సాగుతుందో..?

   ఆ ఆలోచనతోనే ముసిలిది చలనం కోల్పోయి కట్టెలా బిగుసుకుపోయింది....!!

                  000

     ( ఆంధ్రభూమి దినపత్రిక  4 ఫిబ్రవరి1990) 


                             

              

     జగదాంబ ఏసీ థియేటర్ లో మీ అభిమాన నటుడు నటించిన తాజా వర్ణ చిత్రం... రోజూ నాలుగాటలు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతుంది... తప్పక చూడండి... మీ విశాఖ జగదాంబ థియేటర్లో 'నిశ్శబ్ద ప్రతీకారం'....

    రేడియా లో పాటలు మధ్య ఆ అడ్వర్టైజ్మెంట్ కొత్తగా రిలీజ్ అయిన ఆ చిత్రం గురించి మూడు రోజులుగా వస్తూనే ఉంది...

    ఆఫీస్ కి తయారవుతున్న శ్రీనివాస్ అది విని ఆ సినిమా చూడాలనుకున్నాడు. ఆఫీస్ కి వెళ్తూ వెళ్తూ సాయంత్రం "నేను వచ్చేసరికి రెడీగా ఉండు.. సినిమాకెళదాం" అని భార్యతో చెప్పి బయటికెళ్ళి పోయాడు.

     అనుకున్నట్లుగానే సాయంత్రం ఎంతో ఆతృతగా సినిమాకు బయలుదేరారు.

    "హలో శ్రీనివాస్ ఎక్కడికి ప్రయాణం...?" దారి మధ్యలో ఎదురైన స్నేహితుడు నవ్వుతూ పలకరించాడు.

      ఫలానా సినిమాకని శ్రీనివాస్ చెప్పేసరికి... "అబ్బే.. ఆ సినిమా టికెట్స్ అయితే ఎప్పుడో అయిపోయివుంటాయి. నామాట నమ్మి మరో సినిమాకి వెళ్లండి" అని సలహా ఇచ్చాడు.

     దాంతో ఆ సినిమా మరోసారెప్పుడైనా చూడొచ్చులే అనుకుని... వేరే సినిమాకి వెళ్లిపోయారు.

    మళ్లీ వాళ్లు సినిమా ప్రోగ్రాం వేసుకునే సరికి నెల్లాళ్ళు దాటిపోయింది. 

      పోయినసారి మిస్సైన సినిమా కోసం థియేటర్ దగ్గరకు చేరేసరికి ఇంకా హౌస్ ఫుల్ బోర్డు కనిపించేసరికి... ఖంగు తిన్నారిద్దరూ. తీరా వెనక్కి వెళ్లిపోవడం ఇష్టం లేక... బ్లాక్ లో నైనా టిక్కెట్లు కొనడానికే సిద్ధపడ్డాడు శ్రీనివాస్

      ఎదురుచూస్తున్నట్లుగానే... "సార్ టికెట్ కావాలా" అంటూ వాళ్ల దగ్గరకొవచ్చాడు ఓ ఇరవయేళ్ళ కుర్రాడు. 

 ఆ టికెట్లు చూడగానే.. శ్రీనివాస్ ముఖం వెలిగిపోయింది. వాటిని అందుకుంటూ ..." ఎంత" అని అడిగాడు.

     అతను టికెట్ రేటు మాత్రమే చెప్పడంతో ... సంతోషంగా డబ్బు చెల్లించాడు తన అదృష్టానికి మురిసిపోతూ. సినిమా బిగినవ్వడానికి టైం అవడంతో హాల్లో అడుగుపెట్టిన శ్రీనివాస్ అక్కడ సీట్ నెంబర్ చూపించే అతను లేకపోయేసరికి నెంబర్ చూపించమని టికెట్స్ చింపే కీపర్ని అడిగాడు

    "పరవాలేదు సార్... మీక్కావాల్సిన చోటే కూర్చోండి. హాలంతా కాళీగానే ఉంటుంది" అని చెప్పాడతను .

     అతని అంతరార్థం బోధపడక మరి టికెట్ మీద నెంబరింగ్ ఉందంటూ అయోమయంగా చూపించాడు.

    "అవి అంతే లెండి. హౌస్ ఫుల్ కలెక్షన్స్ కోసం ఆ హీరో అభిమానులంతా కలిసి మిగిలిపోయిన టికెట్స్ అన్నీ కొనేస్తున్నారు." అంటూ చల్లగా చెప్పాడతను.

    అది విన్నాక శ్రీనివాస్ మొఖం మాడిపోయింది. అయితే ఈ సినిమా ఎంతో చెత్తగా ఉందన్నమాట. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతుందంటే... చాలా బాగుంటుందని మోసపోయి వచ్చామనుకుంటూ.. ఆ హీరోపై అతని అభిమానులకున్న అభిమానాన్ని మెచ్చుకోవాలో తిట్టుకోవాలో తెలీలేదాక్షణం శ్రీనువాస్ కి...!!

                     000

           ( ఆంధ్రభూమి దినపత్రిక 26 ఏప్రిల్ 1990)

 

                 

 


                         

  

      "పోస్ట్...!"

       ఓ ఉత్తరాన్ని అందుకుంది వర్ధనమ్మ.

    ఆ ఉత్తరం చదివిన వర్ధనమ్మకి ఆందోళనతో చెమటలు పోశాయి. పెద్ద కూతురింటి దగ్గర నుంచి వచ్చిందని ఎంతో ఆతృతగా విప్పితే అందులోని విషయాలు ఊహించని ఈ విధంగా ఉంటాయని అనుకోలేదు. మనసు కలవరపాటుతో విచారంగా కూర్చుని ఉంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఏమి చేయాలో పాలుపోలేదు.

     ఆ ఉత్తరంలోని సారాంశం చదవాలని మడత విప్పింది.

      గౌరవనీయులైన అత్తమ్మ గారికి.

     మీరంతా క్షేమమని తలుస్తాను. ఈమధ్య మీ అమ్మాయికి ఒంట్లో అసలేమీ బాగుండటం లేదు. హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసి... ఈ రోజే ఇంటికి తీసుకొచ్చాను. చాలా నీరసించి పోయింది. రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. పిల్లలిద్దరికీ స్కూల్ కి వెళ్లడం రావడంతోనే వాళ్లకు టైము సరిపోతుంది. కనుక మీ అమ్మాయిని చూసుకోవడానికి అందాకా ఓ పనిమనిషిని పెట్టాను కంగారు పడవలసిన విషయమేమి కాదు. ముఖ్యంగా ఈ ఉత్తరం వ్రాసింది మీకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే.

                                          మీ అల్లుడు

                                              రవీంద్ర.

 ఆ విషయాలకు వర్ధనమ్మలో చెమటలు పోశాయంటే... అది వయసు తెచ్చిన వృద్ధాప్యం కాబట్టే.

     కూతురు సుఖపడుతుంది కదాని... ఎక్కడో దూరంగా ఇంజనీరుగా చేసే అతనికి కట్టబెట్టింది. కానీ అక్కడ వాతావరణం కూతురు ప్రాణాలను తీసేలా ఉంది. అప్పుడే ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం మూడోసారి. ఇక్కడేమి కంగారు పడతామోనని అలా చెప్పి వుంటారుగానీ పూర్తిగా కోలుకుందో లేదో...? కూతురి అనారోగ్య విషయంలో ఇంకా అనుమానంగా ఉంది ఆ కన్నతల్లికి. కొడుకులిద్దరూ ఆఫీస్ నుంచి రాగానే ఎవరినో ఒకర్ని ఓసారి వెళ్లి చూసి రమ్మనాలి.. మనసులో ఊరాటగా అనుకుంది వర్ధనమ్మ.

 గుమ్మంలోనే కూర్చుని కొడుకుల కోసం ఎదురుచూస్తుంది వర్ధనమ్మ....

    కొడుకులు రాగానే... "మళ్లీ మీ చెల్లెలుకు ఒంట్లో బావుండలేదటరా" అంటూ ఉత్తరాన్ని అందించింది

    "అలాగా...?" అని ఆ ఉత్తరాన్ని చదివి పక్కన పెట్టేసాడు పెద్ద కొడుకు.

     "చెల్లి ఎలా ఉందో నువ్వు ఒక్కసారి వెళ్లి చూసి రాకూడదు...?" ఎంతో ఇదిగా అడిగింది.

     "ఎందుకమ్మా...! బావగారు బాగానే ఉందని రాసారు కదా. ఈ మూల నుంచి ఆ మూలకు వెళ్లకపోతే ఇప్పుడు ఏమైంది...? పైగా అక్కడ విపరీతమైన చలొకటి." నేను వెళ్ళ లేనట్టు చెప్పేసాడు.

    రెండో కొడుకుని అడిగితే... ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది. అదిగాక లీవ్ దొరకదని తప్పించుకున్నాడు.

  కొడుకుల సమాధానం వర్ధనమ్మ కు ఏమాత్రం నచ్చలేదు. తోడబుట్టిన చెల్లెలిపై వాళ్లకు మమకారం చచ్చిపోయిందని నిట్టూర్చింది.

     చిన్న కూతురుకు ఉత్తరం రాసి దానినైనా పంపాలనే ఆలోచన తట్టింది. అది వెళ్తే కొన్నాళ్లపాటు దానికి సహాయంగా ఉంటుందనిపించి ఉత్తరం రాసి పడేసింది వర్ధనమ్మ.

     ఆ కూతురు నుంచి వచ్చిన సమాధానం కూడా వర్ధనమ్మ మనసును విరిచేసింది. తాను బయలుదేరితే భర్తకు రోజు గడవడం కష్టమనీ, చంటోడి స్కూలుకి లీవు కూడా ఇవ్వరని ఏదేదో రాసింది.

     వర్ధనమ్మ భారంగా నిట్టూర్చింది.

    ఈ రోజుల్లో ఎవరి పనులు వాళ్లకే గానీ.. సొంత మనుషుల బాగోగుల గురించి కూడా పట్టించుకోని దుస్థితి ఏర్పడిందని బాధపడింది వర్ధనమ్మ.

    కూతుర్ని అంత దూరంగా చేసినందుకు వెళ్లడానికి ఎవరు తప్పించుకున్నా... ఈ కన్న హృదయానికి తప్పదు కదాని... ఆ ఊరి భాష తెలియకపోయినా ఓపిక తెచ్చుకుని పెట్టెలో బట్టలు సర్దుకుని... బయలుదేరింది వర్ధనమ్మ !!

                    000

     ( ఆంధ్రభూమి దినపత్రిక 12 ఆగస్టు1990)

         


                          

         డమ్.. డమ్ అంటూ డప్పుల మోత...!

   ఆ మోత పిలుపుకు... పెద్దలు పిల్లలు కాస్త వెనక ముందు అన్నట్టు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.

      డప్పుల మోత మోగుతూనే ఉంది...

      మన నలభై ఒకటో వార్డు అమ్మలకు, అయ్యలకు మా విన్నపం. ఈరోజు రాత్రి ఏడు గంటలకు వీధి సివార్న ఉన్న మర్రి చెట్టు కాడ రాబోయే ఎలచ్చన్ల గురించి మన సత్యం మాస్టారు, కొంతమంది పెద్దలు పెట్టే మీటింగ్ కు మీరంతా రావాలండోయ్..." అంటూ దండోరా వేస్తూ ముందుకు సాగాడు డప్పు సాయిగాడు.

     "ఇదేమి విడ్డూరం బాబూ! సత్యం మాస్టర్ ని మనం నామినేషన్ వేయమంటే వేయనన్నారు. ఆయనే మీటింగ్ పెట్టడం ఏంటి...?" ఒక కుర్రాడు అనుమానం వ్యక్తపరిచాడు ఓ పెద్దాయనతో.

     "అదేంటో ఈ రాత్రికి తెలుస్తుంది కదా. ఈ లోపు నీకు కంగారెందుకు రా" అంటూ భుజం తట్టారు ఆ పెద్దాయన.

     రాత్రి ఏడు గంటలు అయింది...!

    వీధి చివరన మర్రి చెట్టు కాడ సీరియల్ సీట్ల లైట్లతో ఆకర్షణీయంగా ఉంది. మైక్ లో పాటల మోత హోరెత్తి పోతుంది.

  ఆ ప్రదేశమంతా ఆ వార్డు ప్రజలు చోటు చేసుకున్నారు.

      ఇంతలో నలుగురు పెద్దలతో సత్యం మాస్టారు అక్కడకు వచ్చేసరికి ప్రశాంతంగా మారిపోయింది ఆ ఆవరణం.

      వాళ్లు స్టేజి మీద ఎక్కి కుర్చీల్లో ఆశీనులయ్యాకా... "ఇప్పుడు మన సత్యం మాస్టారు రాబోయే ఎలక్షన్ల గురించి ఎవరికి ఓటు వేస్తే బావుంటుందో ముందుగా చెబుతారు" అంటూ మైకులో అనౌన్స్ చేసాడు ఓ యువకుడు. సత్యం మాస్టారు లేచి నుంచుని గొంతు సవరించుకున్నారు.

   "ఈ వార్డు ప్రజలకు నా ధన్యవాదాలు...! ఎందుకంటే వార్డు కౌన్సిలర్ గా నన్ను పోటీ చేయమని కొంతమంది పెద్దలు ప్రోత్సహించారు. అయితే రాజకీయాలంటే బొత్తిగా కిట్టదు నాకు. అయినా ఆ విషయం మీ అందరికీ తెలియ చెప్పాలనే నా ఉద్దేశ్యం. మన ఓటు చాలా పవిత్రమైనదని మీకు కూడా తెలుసు. ఇది ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే మనం ఎన్నుకో బోయే నాయకుడు మనకందరకూ అందుబాటులో ఉండి మన కష్టనష్టాలు తెలుసుకోవాలి. వాటి పరిష్కారం కోసం నడుం బిగించి వార్డు అభివృద్ధికి కంకణం కట్టుకున్న వాడై ఉండాలని నా ఉద్దేశ్యం. అటువంటి వ్యక్తిని ఎన్నుకున్నప్పుడే మన ఓటు కు పవిత్రత చేకూరేది."

      "అందుకే ఇప్పుడు మనం గమనించాల్సింది ఈ ఎన్నికల రంగంలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు? వాళ్ల మంచిచెడ్డలు ఏమిటి? అని ఆలోచించాలి."

    "గతం ఎలక్షన్స్ లో లాగే ఈసారి కూడా పాత అభ్యర్థులే అయిన రాజారావు, సుబ్బారావులే నుంచున్నారన్న సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళను బట్టి ఈసారి ఏ అభ్యర్థిని ఎన్నుకుంటే బావుంటుందో... సులభంగా తెలుసుకోవచ్చు. వాళ్ళిద్దరూ మన వార్డు కోసం ఏమి చేశారో గమనిస్తే...

    " పోయినసారి రాజారావు సుబ్బారావు మీద అత్యధిక మెజారిటీతో గెలుపొంది ఈ వార్డు కౌన్సిలర్ అయ్యారు. అయితే తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చకుండా మనకందరకూ తీరని ద్రోహమే చేశారనడంలో సందేహం లేదు. వరదలొచ్చినా, తుపానులొచ్చినా, కష్టమొచ్చినా ప్రజల మొర ఆలోచించకుండా మనిషి జాడే లేకుండా పోయేవాడు. కానీ సుబ్బారావు అలా కాదే... ఎలక్షన్ లో ఓడిపోయిన నిరంతరం వార్డు అభివృద్ధి కోసం కృషి చేశాడు ఓ సామాన్య కార్యకర్తగా. అటువంటి వ్యక్తి చేతిలో మన ఓట్లను ధార పోసి కౌన్సిలర్ గా చేస్తే మన సమస్యలు గట్టెక్కుతాయి అనే నమ్మకం నాకుంది. కాబట్టి.. నేను మరికొందరు పెద్దలు కలసి పోటీలో ఓ అభ్యర్థి అయినా సుబ్బారావునే బలపరుస్తున్నాము. మీరు కూడా సరైన నిర్ణయం తీసుకుని మాతో ఏకీభవిస్తే సుబ్బారావు ఈ వార్డు కౌన్సిలర్ కావడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే సరైన నిర్ణయం చేసుకొని ఓటు చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను" అంటూ ఉపన్యాసం ముగించారు సత్యం మాస్టారు.

        ఆ తర్వాత...

       ప్రజా బలం తో అవార్డు కౌన్సిలర్ గా సుబ్బారావు అత్యధిక మెజార్టీతో గెలిచాడు ఎలక్షన్స్ లో.

  ఇప్పుడు ప్రజలకు కష్టనష్టాలు సంభవిస్తే సహకరించేది కౌన్సిలర్ సుబ్బారావు కాదు. ఎలక్షన్స్ లో ఓడిపోయిన మాజీ కౌన్సిలర్ రాజారావే

      ఇదీ నేటి రాజకీయం...!!

     ( ఆంధ్రభూమి దినపత్రిక 29 అక్టోబర్ 1990)



   



        

 





                                


Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

తెలుగు సంధులు

                    తెలుగు   సంధులు సంధి వివరణ:                  మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది.    'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని  సంధి  అంటారు.                   ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది.  వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను  సంధి  అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును  సంధికార్యము   అని అంటారు.   సంధిలో రెండు పదాలు ఉంటాయి. వీటిల...

సంస్కృత సంధులు

                                           సంస్కృత సంధులు సంధి వివరణ:                    మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి   మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది.    'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని  సంధి  అంటారు.                   ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది.  వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను  సంధి  అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే...