శకుంతల దుష్యంతుల కథ
ఇలీనుడి కొడుకు దుష్యంతుడు. దుష్యంతుడు చిన్నప్పటి నుండి అడవులలో తిరుగుతూ సింహాలను, పులులను వెంటాడి పట్టుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడు. దుష్యంతుని రాజ్యపాలనలో ప్రజలు ధర్మ మార్గం అవలంబిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నారు.
ఒక రోజు దుష్యంతుడు వేటకు వెళ్లాడు. అలా వేటాడుతూ దుష్యంతుడు ఒక తపోవనానికి చేరుకున్నాడు. అది కణ్వాశ్రమము. కణ్వ మహాఋషి తపస్సు చేసుకొనే ఆశ్రమము. ఆశ్రమము. ఆ ఆశ్రమములో బద్ధ శత్రువులైన సింహాలు ఏనుగులు, ఎలుకలు పిల్లులు, చెట్టపట్టాలు వేసుకొని సహజీవనం చేస్తుంటాయి.
దుష్యంతుడు తన మంత్రులతో "నేను ఒంటరిగా వెళ్లి కణ్వ మహామునిని దర్శించి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి" అని చెప్పి ఒంటరిగా పాదచారి అయి కణ్వాశ్ర మానికి వెళ్లాడు.
కణ్వా శ్రమ సమీపంలో ఒక అందమైన కన్య శకుంతలను దుష్యంతుడు చూచాడు. శకుంతల కూడా అతిలోక సుందరుడైన దుష్యంతుని చూచింది. అతనిని సాదరంగా ఆహ్వానించింది. ఉచిత రీతిన సత్కరించింది.
దుష్యంతుడు ఆ కన్యను చూచి "నా పేరు దుష్యంతుడు. ఈ దేశాన్ని ఏలే చక్రవర్తిని. వేట నిమిత్తము ఈ అడవికి వచ్చాను. కణ్వ మహాఋషిని దర్శించుకుందామని ఇక్కడకు వచ్చాను" అన్నాడు.
"వారు ఇప్పుడే పండ్లు తెచ్చుటకు వెళ్లారు. ఇప్పుడే వస్తారు" అని చెప్పింది శకుంతల.
"బాలా! నీ తలితండ్రులెవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?" అని అడి గాడు దుష్యంతుడు.
"ప్రభూ, నేను కణ్వ మహాఋషి కుమార్తెను" అని బదులు చెప్పింది.
దుష్యంతునికి అనుమానం వచ్చింది. "ఈమే ముని కన్యక ఐతే నా మనసు ఈమె మీదికి ఎందుకు లగ్నం అయింది. కణ్వముని ఆజన్మబ్రహ్మచారి. మరి ఆయనకు కూతురు ఎలా వచ్చింది." అని మనసులో అనుకొని శకుంతల పుట్టుక గురించి తెలుసుకోవాలనుకున్నాడు దుష్యంతుడు.
"శకుంతలా, సన్యాసాశ్రమాన్ని పాటిస్తున్న కణ్వ మహామునికి నీవు కూతురు ఎలా అయినావు" అని అడిగాడు.
మహారాజా, నాకూ తెలియదు. ఒక రోజు ఒక మునీశ్వరుడు నా తండ్రి గారైన కణ్వ మహామునిని నాపుట్టు పూర్వోత్తరాల గురించి అడిగాడు. నా తండ్రి మునీశ్వరునికి చెప్పినది నేను విన్నాను. అది మీకు చెపుతాను వినండి.
ఒక సారి రాజర్షి అయిన విశ్వా మిత్రుడు తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకు ఇంద్రుడు భయపడ్డాడు. విశ్వామిత్రుని తపస్సు భగ్నం చెయ్యాలి అని అనుకున్నాడు. వెంటనే మేనక అనే ఒక అప్సరసను పిలిచాడు.
"మేనకా, నీవు ఎలాగైనా విశ్వామిత్రుని వద్దకు వెళ్లి ఆయన తపస్సు భగ్నం చెయ్యాలి" అని చెప్పాడు.
మేనక భయపడింది. "దేవేంద్రా, విశ్వామిత్రుని వద్దకు పోవడానికే మీరు మొదలుకొని అందరూ దేవతలు భయపడుతుంటారు. మరి నన్ను ఆయన వద్దకు పోయి ఆయన తపస్సు భగ్నం చెయ్యి అని అడగడం తగునా? చెప్పండి. కానీ నా శక్తి కొలది ప్రయత్నించి ఆయన మనసును మారుస్తాను" అని చెప్పి మేనక విశ్వామిత్రుని వద్దకు వెళ్లింది. ఘోరమైన తపస్సు చేస్తున్న విశ్వామిత్రుని చూచింది. ఆయనకు నమస్కారం చేసింది. తన చెలికత్తెలతో, ఆయన దృష్టిలో పడేవిధంగా పూలు కోస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది.
విశ్వామిత్రుడు మేనకను చూచాడు. ఆయన మనస్సు చలించింది. మేనక మీద మనసు పడ్డాడు. తపస్సు కట్టిపెట్టాడు. మేనకతో కామసుఖాలు అనుభవించ సాగాడు. వారిద్దరికి ఒక ఆడ శిశువు జన్మించింది. వచ్చిన పని అయి పోయినది కాబట్టి మేనక దేవలోకానికి వెళ్లి పోయింది. విశ్వామిత్రుడు తిరిగి తపస్సు చెయ్యడానికి తపోవనానికి వెళ్లాడు.
ఆ పసిబిడ్డ మాత్రం ఏడుస్తూ ఆ ఇసుక తిన్నెల మీద ఉండి పోయింది. అక్కడ ఉన్న పక్షులు తమ రెక్కలను అడ్డంగా పెట్టి నీడ కల్పిస్తూ ఆ బిడ్డను కాపాడాయి. అప్పుడు నా తండ్రి కణ్వ మహాఋషి తన శిష్యులతో అక్కడకు వెళ్లారట. నదీ తీరంలో ఒక ఇసుక తిన్నె మీద, పక్షులచేత రక్షింపబడుతున్న ఆ ఆడ బిడ్డను చూచారట. ఆ బిడ్డను తీసుకొని ఆశ్రమానికి వచ్చారట. ఆ ఆడ శిశువును నేనే. శకుంతములతో రక్షింబడినది కాబట్టి నాకు శకుంతల అని నామకరణం చేసారు. అప్పటి నుండి నన్ను తన కన్న కూతురి లాగా పెంచుతున్నారు. నేను వారిని నా తండ్రి లాగా ఆదరిస్తున్నాను" అని చెప్పింది శకుంతల.
శకుంతల తాను విశ్వామిత్రుని కూతురు అని చెప్పగానే దుష్యంతునకు ఆమె మీద మనసు కలిగింది.
విశ్వామిత్రుడు క్షత్రియుడు. కాబట్టి శకుంతల క్షత్రియ కన్య.
దుష్యంతుడు శకుంతలను చూచి "ఓ కోమలీ, నీవు అతిలోక సౌందర్యవతివి. నీవు ఈ నార చీరలు కట్టుకొని ఆశ్రమవాసం చెయ్య తగవు. నీవు అందమైన రాజ సౌధములలో, రాజ్య సంపదలను అనుభవింపవలసిన దానవు. నాకు నీ మీద ప్రేమ కలిగింది. నిన్ను ఎనిమిది రకాలైన వివాహ విధులలో ఒకటైన గాంధర్వ విధి ప్రకారం వివాహం చేసుకుంటాను." అని అన్నాడు దుష్యంతుడు.
{వివాహ విధులు ఎనిమిది రకాలు, అవి (1)బ్రాహ్మము (2) దైవము (3) ఆర్షము (4) గాంధర్వము (5)ఆసుర ము (6)రాక్షసము (7) ప్రాజపత్యము (8)పైశాచ ము}
"మహారాజా, నా తండ్రి కణ్వుల వారి ఆశ్రమములో లేరు. వారు వచ్చి కన్యాదానము చేసిన నన్ను మీరు స్వీక రింపవచ్చును" అని చెప్పింది.
"కోమలీ, గాంధర్వమునకు పెద్దల అనుమతి తోనూ, మంత్ర తంత్రములతో పని లేదు. అత్యంత రహస్యంగా జరిగేదే గాంధర్వము." అని ఆమెకు చెప్పి ఒప్పించాడు.
"దుష్యంత మహారాజా, నేను నిన్ను వివాహ మాడిన, మన ఇరువురకు పుట్టబోయే పుత్రుని నీ సువిశాల సామ్రాజ్యానికి మహారాజును చేయడానికి తమరు అంగీకరించిన, నేను ఈ వివాహమునకు ఒప్పుకొనెదను" అని శకుంతల చెప్పింది.
దానికి దుష్యంతుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. శకుంతలా దుష్యంతులకు గాంధర్వ విధిన వివాహం జరిగింది. దుష్యంతుడు ఆమెతో కామ సుఖాలను అనుభవించాడు.
"శకుంతలా, నేను వెళ్లి నిన్ను సగౌరవంగా రాజధానికి తీసుకురావడానికి నా మంత్రులను పంపిస్తాను" అని శకుంతలను ఒప్పించి దుష్యంతుడు వెళ్లి పోయాడు.
ఈ విషయమంతా తెలిస్తే తన తండ్రి కణ్వుడు కోపగిస్తాడేమో అని శకుంతల భయపడుతూ ఉంది.
కణ్వ మహాముని ఆశ్రమానికి వచ్చాడు. శకుంతలలో కనపడుతున్న నునుసిగ్గు, హావభావాలు చిత్రంగా కనపడ్డాయి. తన దివ్య దృష్టితో చూచి జరిగిందంతా తెలుసుకున్నాడు.
శకుంతలను చూచి "అమ్మా, గాంధర్వ వివాహము శాస్త్ర సమ్మతమే. నీకు తగిన భర్తనే ఎన్నుకున్నావు. గర్భాదానం కూడా జరిగింది. నీకు పుట్టబోయే పుత్రుడు ఈ సువిశాల భరత సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు." అని దీవించి "అమ్మా శకుంతలా, నీవుకోరిన వరం ఇస్తాను కోరుకో అమ్మా" అన్నాడు.
శకుంతల తండ్రికి నమస్కరించి "తండ్రీ, నా మనసు ఎప్పుడూ ధర్మం తప్పకుండా ఉండాలి. నాకు పుట్టబోయే కొడుకు దీర్ఘాయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి ఉండాలి. మహాబలవంతుడై ఉండాలి. మంచి యశోవంతుడు కావాలి" అని అడిగింది
ఆమె కోరినట్టుగా ఆమెకు వరాన్ని ప్రసాదించాడు కణ్వుడు. ఆమెకు చక్రవర్తి లక్షణాలతో భరతుడు జన్మించాడు.
భరతుడు మహాబలవంతుడు. చిన్నప్పుడే, అడవిలో ఉండే పులులను సింహాలను, ఏనుగులను పట్టి తెచ్చిచెట్లకు కట్టేసేవాడు. ఏనుగుల పైన స్వారీ చేసేవాడు. అతని చేష్టలను చూచి ఆశ్రమంలో ఉన్న మునులు అతనికి "సర్వదమనుడు" అని పేరుపెట్టారు.
ఒక రోజు కణ్వ మహాముని శకుంతలను చూచి "అమ్మా శకుంతలా, ఆడపిల్ల పుట్టిన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండటం క్షేమం కాదు. ఉచితం కాదు. పెండ్లి అయిన ఆడపిల్ల భర్త దగ్గర ఉండటమే ధర్మం. కాబట్టి నీవు నీ భర్త అయిన దుష్యంతుని వద్దకు వెళ్లు" అని చెప్పి తన శిష్యులను తోడు ఇచ్చి శకుంతలను దుష్యంత మహారాజు వద్దకు పంపాడు. శకుంతల తన కుమారునితో, శిష్యులతో దుష్యంతుని వద్దకు వెళ్లింది.
కాని దుష్యంతుడు ఆమెను గుర్తించ లేదు. ఆశ్రమంలో తన పట్ల చూపిన వలపు, ఆదరణ, ఆసక్తి అతనిలో కనిపించలేదు. శకుంతలకు అనుమానం కలిగింది.
"దుష్యంతుడు నిజంగా తనను గుర్తించ లేదా. లేక తెలిసి తెలియనట్టు ఉన్నాడా. లేదా రాజ్య కార్యాల లోపడి తనను మరిచిపోయాడా. లేక తనను పెండ్లి చేసుకున్న నాడు చెప్పిన మాటలు మరిచి తనను వదిలి వేసాడా. ఎవరన్నా దేనినన్న మరిచిపోతే తిరిగి జ్ఞాపకం చెయ్యవచ్చును. అసలు తెలియనపుడు, తెలియ చెప్ప వచ్చును. కానీ ఇలాగా తెలిసి కూడా తెలియనట్టు నటించే వారికి చెప్పడం బ్రహ్మ తరం కాదు. అయినా ఇంత దూరం వచ్చి, తిరిగి ఆశ్రమానికి తిరిగి వెళ్లి పోవడం మంచిది కాదు. ఆ రోజు జరిగినది అంతా చెప్పి, ఈ కుమారుని చూపిస్తాను" అని మనసులో నిశ్చయించుకుంది శకుంతల.
"ఓ రాజా, ఆ రోజు నువ్వు వేటకు అడవికి వచ్చావు. నా తండ్రి కణ్వ మహామునిని దర్శించుకోడానికి మా ఆశ్రమానికి వచ్చావు. నన్ను చూశావు. మోహించావు. నన్ను గాంధర్వ విధిని వివాహమాడావు. నాకు పుట్టబోయే కుమారుని రాజును చేస్తాను అన్నావు. ఇడుగో నీ కుమారుడు" అని తన కుమారుడు భరతుని చూపించింది.
ఇది అంతా చూశాడు దుష్యంతుడు. అతనికి అంతా తెలుసు. కానీ ఏమీ తెలియని వాని వలె "నీవు ఎవ్వరివో నాకు తెలియదు. నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు. నీవు ఎక్కడ నుండి వచ్చావో అక్కడకు పో" అని అన్నాడు.
శకుంతలకు దుఃఖం పొర్లుకు వచ్చింది.
"మహా రాజా, అన్నియు తెలిసీ, ఏమీ తెలియని వాని వలే ఎందుకు మాట్లాడతావు. ఆ రోజు జరిగిన మన వివాహానికి సాక్షులు ఎవ్వరూ లేరని ఇలా అబద్ధాలు ఆడ వచ్చునా! ఇది మీకు తగునా! కాని మనలను, సూర్య చంద్రులు, పంచభూతాలు, యముడు, రాత్రి పగలు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి.
కట్టుకున్న భార్యను తిరస్కరించే వాడికి ఇహ లోక సుఖం గాని, పరలోక సుఖం గాని దక్కవు. పుత్ర సంతానాన్ని పొందాలంటే భార్య కావాలి. ధర్మము, అర్ధము, కామము, మోక్షము అనే పురుషార్థాలను సాధించడానికి, వంశాన్నినిలపడానికీ, ఉత్తమ గతులు పొందడానికి, హృదయానికి ఆనందం కలిగించడానికి భర్తకు భార్య అవసరం. భార్యాబిడ్డలను ఆదరంతో చూచేవాడికి ఎలాంటి కష్టాలు రావు.
అదియును కాక భార్య భర్తలో అర్ధభాగము. అందుకని భర్తకంటె భార్య ముందు చనిపోయినా, స్వర్గంలో భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ భర్త ముందు చనిపోతే, భార్య కూడా అతనితో సహగమనం చేస్తుంది. అలాంటి భార్యను అవమానించడం ధర్మం కాదు.
పురుషుడు తన భార్య శరీరంలో ప్రవేశించి, తిరిగి ఆమెకు పుత్రుడుగా జన్మిస్తాడు. కాబట్టి కొడుకులో భర్తను చూచుకుంటుంది స్త్రీ. తండ్రి కూడా, తన రూపానికి ప్రతి రూపమైన కొడుకును చూచి ఆనందిస్తాడు.
పైగా పున్నామ నరకం నుండి ఉద్దరించే వాడు పుత్రుడు. ఒక దీపం నుండి మరొక దీపం వెలిగినట్టు నీ శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టాడు. కాబట్టి నీ పుత్రుని కౌగలించుకొని, ఆనందించు.
నీ కొడుకు నీ వంశ కర్త అవుతాడని సరస్వతి చెప్పింది. మన వివాహం జరిగిన రోజు తమరు నాకు ఇచ్చిన మాటను మరవడం తగునా. మనకు పుట్టిన ఈ కుమారుని నిరాకరించడంతగునా.
ఈ లోకంలో సత్యం పలకడంకన్నా మంచి పని మరొకటిలేదు. వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలం, ఒక సత్య వాక్యంతో సమానము. ఎన్ని తీర్థాలు సేవించినా, వేదాలు అన్ని చదివినా, అవి సత్యం చెప్పడంతో సాటి రావు. నేను అప్సరస అయిన మేనకకు, రాజర్షి అయిన విశ్వామిత్రునికి పుట్టిన దానను. ధర్మం తప్పి నేను అసత్యం పలుకను. కాబట్టి, తమరు నాకు కణ్వాశ్రమములో చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని, నన్ను, మన కుమారుని స్వీకరింపండి." అని పలికింది శకుంతల.
కాని దుష్యంతుడు అంగీకరింపలేదు.
"నేను మహారాజును. నువ్వు సామాన్య ఋషి కన్యవు. నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు. ఆడు వారు అబద్ధాలు ఆడుదురు అనే మాట సార్థకం చేస్తున్నావు. ఎత్తుగా,బలంగా కనపడుతున్న ఇతడిని నా కొడుకు అని చెపుతున్నావా. ఇలాంటి అబద్ధాలను నేను అంగీకరించను. నీవు నీ ఆశ్రమానికి తిరిగిపొమ్ము" అని తిరస్కరించాడు దుష్యంతుడు.
"మహా రాజా, నాకు ఈ తిరస్కారాలు కొత్త కాదు. పుట్టిన నాడే తల్లి తండ్రులచేత విడువ బడ్డాను. ఇప్పుడు భర్త చేత విడువబడ్డాను. నేను నోచిన నోములు అంతే అని సరిపెట్టుకుంటాను. ఇంత కన్నా ఏమీ కాదు కదా. ఇంక నాకు ఆ భగవంతుడే దిక్కు" అంటూ కొడుకును తీసుకొని వెనక్కు తిరిగి వెళ్ల బోయింది.
అప్పుడు ఆకాశం నుండి ఒక వాక్కు వినిపించింది
"ఓ దుష్యంత మహారాజా!. శకుంతల నిజమే చెప్పింది. ఈ శకుంతల నీ భార్య. ఈ భరతుడు నీకు శకుంతలకు పుట్టిన వాడు. వీరిని స్వీకరించుము."
ఇది విని దుష్యంతుడు లేచి సభలో ఉన్న వారితో ఇలా అన్నాడు.
"సభా సదులారా. ఆ రోజు నేను ఈ శకుంతలను గాంధర్వ విధిని వివాహమాడిననాను, నాకు ఈమెకు తప్ప వేరే ఎవరికి తెలియదు. లోక నిందకు పెరిచి ఇప్పటిదాకా ఈమె నాకు తెలియదు అని అన్నాను. కాని ఇప్పుడు ఆకాశ వాణి అందరకూ నిజం తెలియ చేసింది. నేను నా భార్యా పుత్రులను స్వీకరిస్తున్నాను" అని పలికి, శకుంతలను, భరతుని సాదరంగా స్వీకరించాడు. భరతుని యువరాజుగా చేసాడు.
కొంత కాలం రాజ్య సుఖాలు అనుభవించి, కుమారుడైన భరతునికి రాజ్యం అప్పగించి, భార్యతో తపోవనానికి వెళ్లాడు. భరతుడు ఈ సువిశాల సామ్రాజ్యాన్ని, జనరంజకంగా పాలించాడు. భరత వంశానికి వంశ కర్త అయ్యాడు.
అటువంటి భరతునికి భుమన్యుడు జన్మించాడు. భుమన్యుడి కొడుకు సువోత్రుడు. సువోత్రుడి కొడుకు హస్తి. అతని పేరు మీదనే హస్తినా పురం వెలసింది. అదే కౌరవుల రాజధాని అయింది. (నేటికీ మనకు రాజ ధాని హస్తినాపురం (Delhi)).
హస్తి కొడుకు వికుంఠనుడు. వికుంఠనుడి కొడుకు అజ మీఢుడు. అజమీఢుడికి 124 మంది కుమారులు. అందులో సంవరణుడు అనే వాడు సూర్యుడి కుమార్తె అయిన తపతిని వివాహం చేసుకున్నాడు. వారికి మరొక వంశ కర్త అయిన కురు జన్మించాడు. అతని పేరు మీదనే కురు వంశం మొదలైంది. భారత యుద్ధం జరిగిన ప్రదేశం కూడా అతనిపేరు మీదనే కురుక్షేత్రం అని పిలువ బడింది.
కురునకు విదూరధుడు పుట్టాడు. విదూరధుని కొడుకు అనశ్వుడు. అనశ్వుని కొడుకు పరీక్షిత్. పరీక్షిత్ కొడుకు భీ మసేనుడు. భీ మసేనుడి కొడుకు ప్రదీపుడు. ప్రదీపుని కొడుకు ప్రతీపుడు. ప్రతీపుని కుమారుడు శంతనుడు. శంతనుడికి గంగాదేవి కి దేవవ్రతుడైన భీష్ముడు పుట్టాడు. శంతనునికి యోజన గంధి అయిన సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు.
Comments
Post a Comment