అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడి భార్య ఉత్తర. ఉత్తరకు అభిమన్యునకు జన్మించిన వాడు పరీక్షిత్తు.
పరీక్షిత్తు మహారాజుకు వేట అంటే మక్కువ ఎక్కువ. ఒక రోజు పరీక్షిత్తు వేటకు వెళ్లాడు. ఒక మృగాన్ని చూచాడు. దానిని తరుముతూ చాలా దూరం వెళ్లాడు. ఒక ఆశ్రమం లోకి ప్రవేశించాడు. అది శమీక మహర్షి ఆశ్రమము. ఆ సమయంలో శమీకుడు మౌన వ్రతంలో కళ్లు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు.
పరీక్షిత్తు శమీకుడిని చూసి "మహాత్మా, నేను వేటాడుతున్న మృగం ఈ వైపు వచ్చినదా?" అని అడిగాడు. మౌన వ్రతంలో ఉన్న శమీకుడు జవాబు చెప్ప లేదు. దానికి పరీక్షిత్తుకు కోపం వచ్చింది. అక్కడే పడి ఉన్న ఒక చచ్చిన పామును తన బాణంతో తీసి శమీకుడి మెడలో వేసాడు. తరువాత హస్తినాపురానికి వెళ్లి పోయాడు.
ఇదంతా శమీకుడి శిష్యుడు కృశుడు అనే వాడు చూచాడు. శమీకుడి పుత్రుడు శ్రుంగి ఆ సమయంలో ఆశ్రమంలో లేడు. కృశుడు వెళ్లి శృంగికి జరిగినదంతా చెప్పాడు. శృంగికి చాలా కోపం వచ్చింది.
"ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకొంటున్న నా తండ్రిని అవమానించిన పరీక్షిత్తు ఈ రోజు నుండి ఏడు రోజుల లోగా తక్షకుడు అనే సర్ప రాజు చేత మరణించు గాక" అని శాపం ఇచ్చాడు.
తరువాత ఆశ్రమానికి వెళ్లాడు. తండ్రి మెడలో ఉన్న చచ్చిన పామును తీసి వేసాడు. తరువాత శమీకుడు కన్నులు తెరిచాడు. శృంగి జరిగిందంతా తండ్రికి చెప్పాడు. దానికి శమీకుడు చాలా బాధ పడ్డాడు.
"కుమారా, కోపము అన్ని అనర్థాలకు మూలము. అందుకే బ్రాహ్మణులకు కోపం తగదు అంటారు. మనం నిర్భయంగా, క్షేమంగా తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాము అంటే ఆ రాజులు మనకు రక్షణ కల్పించడం వల్లనే కదా. పైగా పరీక్షిత్తు సామాన్యమైన రాజు కాడు. ధర్మ రక్షకుడు. ఆకలికి, దప్పికకు ఆగలేక విసుగులో ఆ పని చేసాడు. దానికి నువ్వు ఇంత ఘోరమైన శాపం ఇవ్వాలా. వెంటనే ఆ శాపాన్ని ఉపసంహరించు" అన్నాడు.
దానికి శృంగి ఒప్పుకోలేదు. తన శాపానికి తిరుగులేదన్నాడు. వెంటనే శమీకుడు తన శిష్యుడు గౌరముఖుడు అనే వాడిని పిల్చి
"నీవు పరీక్షిత్తుకు వద్దకు వెళ్లి, జరిగిన విషయం చెప్పి, ఈ ఆపద తొలగే ఉపాయం చూసుకోమని చెప్పు" అని చెప్పి పంపాడు.
గౌరముఖుడు పరీక్షిత్తు వద్దకు వెళ్లి, జరిగిందంతా చెప్పాడు. ఇదంతా విని పరీక్షిత్తు చాలా బాధ పడ్డాడు. శృంగి శాపానికి భయపడ్డాడు. దానిని నివారించే ఉపాయం ఆలోచించమని మంత్రులను అడిగాడు. వారి సలహా మీద ఎత్తైన ఒంటి స్తంభం మేడ కట్టించుకున్నాడు. అందులో మత్రులతో సహా నివసిస్తున్నాడు. మంత్ర తంత్రాలు తెలిసిన వాళ్లను, విషాన్ని హరించే వైద్యులను తన దగ్గర ఉంచుకున్నాడు.
ఇది ఇలా ఉండగా, పాములన్నీ లోకానికి హాని చేస్తున్నాయి అని తెలిసి, బ్రహ్మదేవుడు, పాముల విషం చేత మరణించిన వారిని తిరిగి జీవింప చేసే విద్యను, కశ్యపుడు అనే మునికి ఉపదేశించాడు.
పాము కాటుతో మరణించబోయే పరీక్షిత్తును రక్షించడానికి కశ్యపుడు బయలు దేరాడు. తక్షకుడు
కూడా శృంగి ఇచ్చిన శాపాన్ని అమలు చేసేందుకు బయలుదేరాడు. దారిలో తక్షకుడు కశ్యపుడిని కలుసుకున్నాడు.
ముని పుంగవా, తమరు ఎవరు? ఎక్కడకు వెళుతున్నారు?" అని అడిగాడు తక్షకుడు.
"నా పేరు కశ్యపుడు. తక్షకుడు అనే సర్పము బారి నుండి పరీక్షిత్తును రక్షించి తగు బహుమానం పొందడానికి వెళుతున్నాను" అన్నాడు కశ్యపుడు.
దానికి తక్షకుడు నవ్వి "నేనే ఆ తక్షకుడిని. పిడుగు పడ్డ వాడైనా బతకవచ్చు కాని, నేను కాటు వేసిన వాడు బతకడం కష్టం. నీ మంత్రాలు, తంత్రాలు పనిచెయ్యవు. కాబట్టి తిరిగి వెళ్లిపో" అన్నాడు.
కశ్యపుడు ఒప్పుకోలేదు.
"అట్లా ఐతే, నేను ఈ మహావృక్షాన్ని నా విషంతో భస్మం చేస్తాను. నీకు చేతనైతే మరల బతికించు" అన్నాడు తక్షకుడు. తక్షకుడి కాటుకు అంత పెద్ద వృక్షం కాస్తా బూడిద అయిపోయింది.
కశ్యపుడు ఆ బూడిద నంతా కుప్పగా చేసి, తన మంత్ర శక్తి చేత, ఆ మహావృక్షాన్ని పూర్వము ఉన్న మాదిరి జీవింప చేసాడు. తక్షకుడు ఇది చూచి ఆశ్చర్య పోయాడు.
"మహాత్మా, శృంగి ఇచ్చిన శాపం తిరుగులేనిది. పరీక్షిత్తు బతకడు. కాబట్టి, ఆ మహా రాజు ఇచ్చే కానుకలకన్న ఎక్కువ కానుకలు నేను ఇస్తాను. తీసుకొని వెనక్కు వెళ్లండి" అని చెప్పాడు తక్షకుడు.
కశ్యపుడు జరగబోయేదానిని దివ్య దృష్టితో తెలుసుకొని, తక్షకుడు ఇచ్చిన కానుకలు తీసుకొని వెనక్కు వెళ్లాడు.
ఇదంతా ఎలా తెలిసిందంటే, ఆ చెట్టు బూడిద కాక ముందు, ఆ చెట్టు మీద ఒకడు కట్టెలు కొడుతూ ఉన్నాడు. చెట్టుతో కూడా వాడు కూడా భస్మం అయ్యాడు. కశ్యపుని మంత్ర శక్తితో చెట్టు తిరిగి బతికినప్పుడు వాడూ బతికాడు. వాడు హస్తినా పురానికి వచ్చి జరిగిందంతా అందరకూ చెప్పాడు.
అలా కశ్యపుడు వెళ్లి పోయిన తరువాత, తక్షకుడు కొందరు సర్ప కుమారులను పిలిచాడు. వారందరికి బ్రాహ్మణకుమారుల వేషం వేసాడు. వారందరకు పూలు, పండ్లు ఇచ్చాడు. అందులో ఒక ఫలంలో తాను, ఒక నల్లని క్రిమిలాగ దాక్కున్నాడు. పళ్లను తీసుకు వెళ్లి జనమేజయునికి ఇమ్మని సర్ప కుమారులకు చెప్పాడు. తక్షకుడు చెప్పినట్టు, సర్పకుమారులు, పూలు, పండ్లు తీసుకొని పరీక్షిత్తు మహారాజు వద్దకు వెళ్లారు. ఆ బ్రాహ్మణ కుమారులను చూచి, పరీక్షిత్తు వారందరిని సాదరంగా ఆహ్వానించాడు. వారు ఇచ్చిన పళ్లను పూలను స్వీకరించాడు. కొన్ని ఫలాలనూ అక్కడ ఉన్న మంత్రులకు ఇచ్చాడు.
తాను ఒక పండు తీసుకొని దానిని ఒలిచాడు. అందులో నల్లని క్రిమిలాగా దాక్కున్న తక్షకుడు బయటకు వచ్చాడు. ఆ నల్లని క్రిమి చూస్తూ ఉండగానే విషాగ్నులు చిమ్ముతూ పెద్దదిగా అయింది. తక్షకుడు పరీక్షిత్తును కాటు వేసాడు. ఇది చూసి అక్కడ ఉన్న మంత్రులు, సేవకులు పారిపోయారు. ఆ విష జ్వాలలకు పరీక్షిత్తు ఉన్న భవనం భస్మం అయింది. తరువాత బ్రాహణులు పరీక్షిత్తుకు కర్మకాండలు జరిపించారు.
కాని ఓ జనమేజయ మహారాజా! ఇది యుక్తము కాదు అని కూడా తలచకుండా, ఆ తక్షకుడు ఒక బ్రాహ్మణుడి ప్రేరణతో, నీ తండ్రి మరణానికి కారకుడు అయ్యాడు. కాబట్టి నువ్వు కూడా బ్రాహ్మణులను రావించి, సర్పయాగము చేసి, తక్షకుడితో సహా పాములను అన్నింటిని అంతం చెయ్యి " అని మంత్రులు జనమేజయునకు వివరించారు.
ఇదంతా విని జనమేజయుడు మండి పడ్డాడు. తన తండ్రిని దారుణంగా చంపిన తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. రుత్విక్కులను పిలిచి సర్పయాగం చేయడానికి ఏర్పాట్లు చేసాడు. సర్పయాగం చెయ్యాడానికి ఒక యాగశాలను నిర్మించాడు. తన భార్య వపుష్టమతో యాగం చెయ్యడానికి సిద్ధం అయ్యాడు.
ఇంతలో ఒక వాస్తు విద్యా నిపుణుడు జనమేజయునితో ఇలా పలికాడు.
"ఓ జనమేజయ మహారాజా, సర్పయాగం చెయ్యాలి అనే నీ సంకల్పం మంచిదే కాని ఈ యజ్ఞం పూర్తి కాదు. మధ్యలో ఆగిపోతుంది" అని చెప్పాడు.
కాని ఆ మాటలు జన మేజయ మహారాజు వినలేదు. వ్యాసుడు, వైశంపాయనుడు మొదలైన మహా మునుల సమక్షంలో యాగం చెయ్య తలపెట్టాడు. సర్పయాగం మొదలు అయింది. రుత్విక్కులు మంత్రాలు పలుకుతూ పాములన్నిటిని పిలుస్తున్నారు. అప్పుడు పాములన్నీ వచ్చి హోమగుండంలో పడి భస్మం అవుతున్నాయి. ఇదంతా చూచి తక్షడు భయంతో తల్లడిల్లి పోయాడు.
ఇంద్రుడి వద్దకు వెళ్లి "దేవేంద్రా నన్ను కాపాడు" అని అడిగాడు. ఇంద్రుడికి బ్రహ్మ గారు కొన్ని పాములకు అభయం ఇచ్చిన విషయం తెలుసు. అందుకే "తక్షకా నీకేం భయం లేదు" అని చెప్పాడు.
అన్నిపాములు వస్తున్నాయి కాని తక్షకుడు రావడం లేదు. తక్షకుడు ఇంద్రుని ఆశ్రయం పొందినట్టు తెలిసింది. అందుకే రుత్విక్కులు, "ఇంద్రుడితో సహా తక్షకుడు వచ్చు గాక" అని మంత్రాలు చదవ సాగారు.
ఇది విని ఇంద్రుడు భయపడ్డాడు. "తక్షకా, నీ దారిన నువ్వు వెళ్లు. నేను నిన్ను రక్షించలేను" అని తక్షకుడిని స్వర్గం నుండి పంపేసాడు.
సర్పయాగంలో పడటానికి, తక్షకుడు ఆకాశంలో తిరుగుతున్నాడు. ఇది ఇలా ఉండగా, పెద్ద పెద్ద పాములన్నీ సర్పయాగ హోమగుండంలో పడి మరణించడం చూచి వాసుకి భయపడ్డాడు. తన చెల్లెలు జరత్కారువును పిలిచి "అమ్మా, చూశావా, పాములన్నీ జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో పడి చనిపోతున్నాయి. దీనికి పరిష్కారం నువ్వే చెయ్యాలి. అందుకే నిన్ను నీ పేరు కల జరత్కారువుకి ఇచ్చి వివాహం చేసాను. బ్రహ్మ వాక్కు ప్రకారం, మీ ఇరువురికి పుట్టిన కుమారుడు ఆస్తీకుడు ఈ సర్పయాగాన్ని నివారిస్తాడు. అందువల్ల నువ్వు నీ కొడుకు ఆస్తీకుడిని పంపి ఆ యాగాన్ని నిలుపు చెయ్యి" అని కోరాడు.
ఇది విన్న జరత్కారువు ఆస్తీకుడిని పిలిచి "కుమారా, నీ మేనమామ వాసుకి కోరిక విన్నావు కదా. నీవు వెంటనే వెళ్లి సర్పయాగాన్ని ఆపు చేయుము" అని చెప్పింది. దానికి ఆస్తీకుడు సరే అన్నాడు. వాసుకిని భయపడవద్దని చెప్పి, వెంటనే జనమేజయుని వద్దకు వెళ్లాడు.
ఆస్తీకుడిని చూచి జన మేజయుడు అతనిని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి మర్యాదలు చేసాడు.
"జనమేజయ మహారాజా! నీ పూర్వీకులైన, మాంధాత, రఘువు, దశరధుడు, రాముడు, ధర్మరాజు మొదలైన మహా రాజులలో ఉన్న ఉత్తమ గుణాలన్నీ నీలో ఉన్నాయి. నీవు యజ్ఞ యాగాలు చేసి, పునీతుడవైనావు. ఇప్పుడు నువ్వు చేస్తున్న సర్పయాగం నిర్వహిస్తున్న వారు, సమస్త శాస్త్రాలు ఎరిగిన వారు. వ్యాసుడు, వైశంపాయనుడు మొదలైన మహామునులు నీ యాగానికి వచ్చారు అంటే, ఆ యాగం ఎంతో గొప్పది. నీకు అన్ని శుభములు కలుగు గాక." అని జనమేజయ మహారాజును పొగిడాడు.
దానికి జనమేజయుడు సంతోషించి, "మహాత్మా, మీకేమి కావాలో కోరుకోండి తప్పక ఇచ్చెదను" అని అన్నాడు.
అప్పుడు ఆస్తీకుడు "జనమేజయ మహారాజా, నీవు వెంటనే ఈ సర్పయాగాన్ని ఆపుచేయాలో. నాకు బంధువులైన పాములను కాపాడండి." అని కోరాడు.
జనమేజయుడు ఆలోచనలో పడ్డాడు. కాని అక్కడ ఉన్న రుత్విక్కులు, బ్రాహ్మణులు "మహారాజా, ఆస్తీకుడు గొప్ప తపస్వి, తగినవాడు. కాబట్టి అతను కోరినట్టు ఈ సర్పయాగాన్ని ఆపించండి" అని చెప్పారు.
అటు ఆస్తీకుని కోరిక, ఇటు సకల బ్రాహ్మణుల ప్రార్థనలను మన్నించి, జనమేజయుడు సర్పయాగాన్ని ఆపించాడు.
సర్పయాగంలో పడటానికి సిద్ధంగా ఉన్న తక్షకుడినిచూచి ఆస్తీకుడు "ఓ తక్షకా, నిలువుము, నిలువుము. సర్పయాగం ఆగి పోయింది. మరలి పొమ్ము" అని అరిచాడు.
"బతుకు జీవుడా" అంటూ తక్షకుడు నాగ లోకం వెళ్లి పోయాడు.
ఆస్తీకుడు సర్పయాగాన్ని ఆపించినందుకు, మిగిలిన పాములను కాపాడినందుకు, యాగశాల లోని వారంతా సంతోషించారు. ఆస్తీకుడిని ప్రశంసించారు.
Comments
Post a Comment