Skip to main content

Story of Snakes and Eagle




కృతయుగంలో కశ్యపప్రజాపతి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. వినత, కద్రువ. పుత్ర సంతానము కోరి వారు కశ్యపుని ప్రార్ధించారు. కశ్యపుడు వారిని చూచి

" మీకు ఎలాంటి సంతానం కావాలి" అని అడిగాడు.

కద్రువ తనకు "ప్రకాశ వంతులైన, పొడవైన దేహముగల వెయ్యి మంది కుమారులు కావాలి" అని అడిగింది.

వినత కొంచెం ఆలోచించి తనకు "కద్రువ కుమారుల కంటే బలవంతులైన ఇద్దరు సుపుత్రులు కావాలి" అని కోరింది.

కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేసాడు. వినత కద్రువలు గర్భం ధరించారు. కద్రువకు వెయ్యి అండ ములు (eggs), వినతకు రెండు అండములు కలిగాయి. వారు ఇద్దరు ఆ అండములను జాగ్రత్తగా కాపాడుతున్నారు..

కొంత కాలానికి కద్రువకు కలిగిన అండములు పగిలి, అందులోనుండి, వాసుకి, శేషుడు, తక్షకుడు మొదలైన సర్పములు (పాములు) బయటకు వచ్చాయి. కాని వినతకు కలిగిన అండములు ఎంతకూ పగలలేదు. వినతకు ఉక్రోషం వచ్చింది. ఎలాగైనా తను కూడా సంతానం పొందాలని, రెండు అండములలో ఒక అండమును బలవంతముగా చిదిమింది.

అందులో నుండి, అపరార్ధ కాయవిహీనుడు (నడుము కింద దేహము లేని వాడు అంటే నడుము నుండి పైన మాత్రమే దేహముకలవాడు, బయటకు వచ్చాడు. అతని పేరు అరుణుడు.

అరుణుడు తల్లి వినతను చూచి "అమ్మా, ఎందుకమ్మా తొందర పడి అండాన్ని చిదిపావు. నేను సగం దేహంతో పుట్టాను. సవతి మత్సరంతో అండాన్ని చిదిమావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉండు ము." అని 

శపించి, "అమ్మా, రెండవ అండాన్ని జాగ్రత్తగా రక్షించు. అందులో నుండి పుట్టబోయేవాడు మహాబల సంపన్నుడు. వాడు నీ దాసీత్వాన్ని పోగొడతాడు" అని చెప్పాడు.. నీ తరువాత, సూర్యభగవానుడి రధానికి సారధిగా వెళ్లాడు.

జరిగిన దానికి బాధపడ్డ వినత, రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడ సాగింది.

ఇది ఇలా ఉండగా, దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మధించడానికి నిశ్చయించారు. సముద్రాన్ని ఎలా మధించాలి, దానికి కవ్వం ఏది, తాడు ఏది అని చర్చించ సాగారు. బ్రహ్మ, విష్ణువులతో చర్చిం చారు.. బాగా ఎత్తుగా, పొడవుగా ఉన్న మంధర పర్వతాన్ని కవ్వముగాను, వాసుకిని తాడుగాను నిశ్చయించారు.

సర్ప రాజు అయిన ఆదిశేషువు మంధర పర్వతాన్ని పెకలించాడు. దేవతలు, అసురులు, ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో నిలబెట్టారు. కాని అది లోపలకు కుంగి పోతూ ఉంది. ఆదికూర్మమును మంధర పర్వతం కింద ఉంచారు. అప్పుడు మంధర పర్వతం నిటారుగా నిలబడింది. సర్ప రాజు వాసుకిని తాడుగా చేసారు. తల వైపు అసురులు, తోక వైపు దేవతలు పట్టుకొని సముద్రాన్ని చిలకడం ఆరంభించారు.

మొట్టమొదట సముద్రంలో నుంది హాలాహలం పుట్టింది. దానిని మహా శివుడు తీసుకొని తన కంఠంలో నిలుపుకున్నాడు.

తరువాత, లక్ష్మీదేవి, కౌస్తుభమణి పుట్టాయి. వాటిని విష్ణువు స్వీకరించి తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు. తరువాత ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రము, ఐరావతము అనే తెల్లటి ఏనుగు పుట్టాయి. వాటిని మహేంద్రుడు స్వీకరించాడు. తరువాత అమృత కలశము పుట్టింది. ఆ అమృత కలశాన్ని రాక్షసులు స్వీకరించారు. కానీ విష్ణుమూర్తి, మోహినీ రూపంతో రాక్షసులను వంచించి, ఆ అమృత కలశాన్ని దేవతలకు ఇచ్చాడు. అమృతం తాగడానికి దేవతలు అందరూ కూర్చున్నారు.

రాహువు అనే రాక్షసుడు దేవతల రూపం ధరించి వారితో పాటు అమృతం తాగడానికి కూర్చున్నాడు. రాహువుకు అమృతం ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని సూర్యుడు, చంద్రుదు గుర్తించారు. వెంటనే విష్ణువుకు ఈవిషయం చెప్పారు. విష్ణువు తన చక్రాయుధంతో రాహువు తల తెగ నరికాడు.

కానీ అప్పటికే అమృతము రాహువు కంఠం దాకా వెళ్లింది కాబట్టి, తల మాత్రం అమృతత్వాన్ని సంతరించుకుంది. మొండెం మాత్రం తల నుండి వేరయి పడిపోయింది. అప్పటి నుండి రాహువుకు, సూర్య చంద్రులకు బద్ధ వైరం ఏర్పడింది.

కష్టపడి సముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించినా, విష్ణువు చేసిన మాయ వల్ల, రాక్షసులకు అమృతం దక్కలేదు. వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్లు బలి చక్రవర్తితో ఆలోచన చేసారు. ఇక దేవతలతో పొత్తుకుదరదు అనుకున్నారు. దేవతలతో యుద్ధం ప్రకటించారు.

దేవ దావన యుద్ధం జరిగింది. దేవతల పక్షాన నరుడు, నారాయణుడు యుద్ధం చేసారు. వాళ్ల ధాటికి రాక్షసులు తట్టుకోలేక పోయారు. ఓడి పోయారు. సముద్రంలోకి పారి పోయారు. దేవతలు విజయం సాధించారు. మంధర పర్వతాన్ని ఇది వరకు ఉన్న చోట పెట్టారు. స్వర్గానికి వెళ్లి సుఖంగా ఉన్నారు. అమృత కలశాన్ని దేవేంద్రునికి ఇచ్చారు. దేవేంద్రుడు అమృత కలశాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాడు.

ఇది ఇలా ఉండగా, ఒక రోజు, దేవేంద్రుడి దగ్గర ఉన్న ఉచ్ఛైశ్రవము అనే తెల్లని గుర్రము, సముద్రం ఒడ్డున విహరిస్తూ ఉంది. కశ్యపప్రజాపతి భార్యలు అయిన, వినత, కద్రువ కూడా సముద్రపు ఒడ్డుకు విహారానికి వెళ్లారు.

అప్పుడు కద్రువ దూరం నుండి ఆ తెల్ల గుర్రాన్ని చూచింది. వినతను చూచి "వినతా, చూచావా. ఆ గుర్రం ఎంత తెల్లగా ఉందో. కాని ఆ తోక మాత్రం అంత నల్లగా ఉందేమే?" అన్నది పరిహాసంగా.

వినత కూడా చూచింది. ఆ గుర్రం తోక తెల్లగా పాల నురగ లాగా ఉంది.

"అదేమిటి అక్కా! ఆ గుర్రం తోక తెల్లగా ఉంది. నల్లగా ఉంది అంటావేమిటి?" అంది.

దానికి కద్రువకు పట్టుదల పెరిగింది. "కాదు, ఆ గుర్రం తోక నల్లగా ఉంది" అంది. వినత ఒప్పుకోలేదు.

"ఐతే ఒక పందెం, ఆ గుర్రం తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చెయ్యాలి. 

నువ్వు చెప్పినట్టు గుర్రం తెల్లగా ఉంటే, నేను నీకు దాస్యం చేస్తాను" అంది కద్రువ.

వినత దానికి ఒప్పుకుంది. "పద అక్కా వెళ్లి చూద్దాము" అంది వినత.

"వద్దులే. ఇప్పుడు పొద్దు పోయింది. ఆ గుర్రం ఎక్కడకు పోతుంది. రేపు చూద్దాము" అంది.

సరే అని ఇద్దరు ఇళ్లకు వెళ్లారు. ఆ రోజు రాత్రి కద్రువ తన కొడుకులైన పాములందరిని పిలిచింది. తనకు, వినతకు జరిగిన పందెం విషయం చెప్పింది.

"కుమారులారా, మీ తల్లి దాసి కాకుండా మీరే కాపాడాలి. రేపు ఉదయం ఆ గుర్రం తోక నల్లగా కన పడాలి" అంది కద్రువ.

ఆమె కొడుకులు దానికి ఒప్పుకోలేదు. "అమ్మా, తల్లి చెప్పినదని అధర్మానికి పాల్పడ వచ్చునా? తప్పు కాదా? ఇంత నీతి లేనిపని ఎలా చెయ్య మంటావు అమ్మా" అన్నారు.

దానికి కద్రువ కోపించింది. "మీరు తల్లి మాట వినలేదు. కాబట్టి, పరీక్షిత్ మహా రాజు కుమారుడైన జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి పాములన్నియు చనిపోవు గాక" అని శాపం ఇచ్చింది.

ఇదంతా చూచి కర్కోటకుడు అనే పాము భయపడ్డాడు. "అమ్మా... నేను నీ కోరిక నెరవేరుస్తాను అమ్మా" అన్నాడు. కద్రువ అతని మాటలకు సంతోషించింది.

వెంటనే కర్కోటకుడు వెళ్లి, సముద్రం ఒడ్డున ఉన్న ఆ గుర్రపు తోకకు చుట్టుకున్నాడు. అప్పుడు ఆ తోక నల్లగా కనపడ సాగింది.

మరునాడు ఉదయమే, వినత, కద్రువ సముద్ర తీరానికి వెళ్లారు. దూరం నుండి గుర్రాన్ని చూశారు. తోక నల్లగా కనపడింది. వినత ఓడిపోయినట్టు ఒప్పుకుంది. అప్పటి నుండి వినత కద్రువకు దాసి అయింది.

కొంత కాలం గడిచింది. వినత జాగ్రత్తగా కాపాడుతున్న అండము పగిలింది. అందులో నుండి అత్యంత బల సంపన్నుడు, అమిత వేగముకల వాడు అయిన గరుడుడు పుట్టాడు. బయటకు రాగానే అత్యంత వేగంతో ఆకాశంలోకి ఎగిరాడు. వెంటనే కిందికి వచ్చి తల్లి పినతకు నమస్కరించాడు. తరువాత కద్రువకు కూడా నమస్కరించాడు. అత్యంత బలసంపన్నుడైన గరుడుని చూచి కద్రువకు అసూయ కలిగింది.

"గరుడా, నీ తల్లి వినత నాకు దాసి. కనుక నువ్వు దాసీ పుత్రుడవు. నువ్వు నా కుమారులకు దాస్యం చెయ్యాలి. ప్రతిరోజూ పాములన్నింటిని నీ వీపు మీద ఎక్కించుకొని విహారానికి తీసుకెళ్లు" అని ఆజ్ఞాపించింది.

"సరే" అన్నాడు గరుడుడు.

ఒక రోజు, గరుడుడు పాములను తన వీపు మీద ఎక్కించుకొని సూర్య మండలం దాకా ఎగిరాడు. అక్కడ ఉన్న వేడిమికి పాములు తట్టుకోలేక మాడిపోయి మూర్చపోయాయి. ఇది చూసి కద్రువ దుఃఖించింది. ఇంద్రుడిని ప్రార్ధించి వర్షం కురిపించింది. ఆ వాన జల్లులో తడిసి, పాములన్నీ సేదతీరాయి. జరిగిన దానికి కద్రువ గరుడుని దూషించింది.

అది సహించలేక పోయాడు గరుడుడు. తల్లి అయిన వినతను చూచి "అమ్మా, ఏమిటమ్మా, నువ్వు ఎందుకమ్మా కద్రువకు దాస్యం చేస్తున్నావు. కారణ మేమిటమ్మా?" అని అడిగాడు.

వినత తనకు, కద్రువకు జరిగినదంతా చెప్పింది. పందెం విషయం చెప్పింది.

"గరుడా నీ వల్ల నా దాస్యం తొలగిపోతుంది అని నీ అన్నయ్య అరుణుడు చెప్పాడు. అందువల్ల ఇప్పటి దాకా ఈ దాస్యాన్ని అనుభవిస్తున్నాను" అని చెప్పింది.

వెంటనే గరుడుడు కద్రువ వద్దకు, పాముల వద్దకు వెళ్లి "మీకు ఏమి చేస్తే నా తల్లి దాస్య విముక్తి అవుతుంది" అని అడిగాడు.

అప్పుడు పాములన్ని గరుడుని చూచి "దేవలోకంలో ఉన్న అమృత కలశం తెచ్చి మాకు ఇస్తే, నువ్వు, నీ తల్లి దాస్య విముక్తులవుతారు" అని చెప్పారు.

దానికి గరుడుడు అంగీకరించాడు. తల్లి వినత వద్దకు వెళ్లాడు. "అమ్మా! నేను దేవ లోకం నుండి అమృతం తెచ్చి, నీకు దాస్య విముక్తి కలిగిస్తాను నన్ను అశీర్వదించమ్మా" అన్నాడు.

వినత సంతోషంగా కొడుకును దీవించి పంపింది. గరుడుడు ఆకాశంలోకి ఎగిరాడు. దేవలోకానికి పోతూ దారిలో తండ్రి అయిన కశ్యపుని కలిసాడు.

కశ్యపుని చూచి గరుడుడు "తండ్రీ, నేను నా తల్లి దాస్యము నివృత్తి చేయుటకు అమృతము తెచ్చుటకు దేవలోకము వెళ్లుచున్నాను. నాకు ఆకలిగా ఉన్నది. నాకు తగిన ఆహారము కావలెను" అని అడిగాడు.

కశ్యపుడు "కుమారా, విభావసుడు, సుప్రతీకుడు అని ఇరువురు అన్నదమ్ములు ఉన్నారు. తమ పిత్రార్జితమైన ఆస్తిలో భాగము ఇవ్వమని సుప్రతీకుడు తన అన్న గారైన విభావసుడిని అడిగాడు. దానికి అన్న విభావసుడు కోపించి తమ్ముడిని "నువ్వు ఏనుగువు కమ్ము" అని శపించాడు. దానికి తమ్ముడు సుప్రతీకుడు కూడా కోపించి "నువ్వు తాబేలువు కమ్ము" అని ప్రతి శాపం ఇచ్చాడు. అప్పుడు వారు ఇరువురు, మూడు యోజనముల పొడవు, పదియోజనముల వెడల్పు కల తాబేలు కానూ, ఆరు యోజనముల పొడవు, పన్నెండు యోజనముల వెడల్పుకల ఏనుగు గాను మారి పోయారు. కాని వారు ఇంకా ఆస్తి కోసం తగవులాడుకుంటూనే

ఉన్నారు. నీవు ఆ ఏనుగును, తాబేలును భక్షించి నీ ఆకలి తీర్చుకొనుము" అని చెప్పాడు కశ్యపుడు.

గరుడుడు సంతోషించి, ఆ ఏనుగు తాబేలు ఉండే చోటికి వెళ్లి, వాటిని తన రెండు కాళ్లతోషపట్టుకొని ఆకాశంలోకి ఎగిరాడు. మధ్యలో రోహణము అనే మహా వృక్షాన్ని చూచాడు.

అప్పుడు రోహణుడు గరుడుని చూచి "గరుడా, నువ్వు నా కొమ్మ మీద కూర్చుని ఆ ఏనుగును, తాబేలును తినుము" అని కోరాడు.

గరుడుడు అలాగే అని, ఒక పెద్ద కొమ్మ మీద వాలాడు. కాని ఆ ఏనుగు, తాబేలు, గరుడుని బరువుకు తాళ లేక ఆ కొమ్మ విరిగి పోయింది. గరుడుడు కంగారుపడ్డాడు. ఆ కొమ్మ భూమి మీద పడితే, ఆ కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకొంటున్న వాలఖిల్యులు అనే మునులు కింద పడిపోతారేమోనని భయపడి, ఆ కొమ్మను నోట కరుచుకొని మరల ఆకాశంలోకి ఎగిరాడు.

మరల తండ్రి అయిన కశ్యపుని వద్దకు వెళ్లాడు. గరుడుడు పడుతున్న అవస్త చూసి కశ్యపుడు, ఆ మహామునులతో "మహాత్ములారా, గరుడుడు ఒక కార్యము నిమిత్తము దేవలోకానికి వెళుతున్నాడు. దయ చేసి మీరు ఈకొమ్మను విడిచిపెట్టి, వేరేచోటికి వెళ్లి తపస్సు చేసుకోండి" అని ప్రార్ధించాడు.

దానికి ఆ మునులు సమ్మతించి, ఆ కొమ్మను విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్లారు. తరువాత గరుడుడు ఆ కొమ్మను ఎవరూ లేని చోట జార విడిచాడు. హిమాచలం మీద ఉన్న ఒక కొండ శిఖరం మీద కూర్చుని ఆ ఏనుగును, తాబేలును తిన్నాడు. వెంటనే దేవ లోకానికి వెళ్లాడు.

గరుడుడు దేవ లోకం సమీపించగానే, దేవేంద్ర సభలో దుశ్శకునాలు గోచరించాయి. దేవ గురువు, బృహస్పతి, దేవేంద్రుడిని చూచి,

"దేవేంద్రా, కశ్యపుని కుమారుడు గరుడుడు, తన తల్లి వినత దాస్య విముక్తి కొరకు, అమృతాన్ని అపహరించడానికి వస్తున్నాడు" అని చెప్పాడు. అప్పుడు దేవేంద్రుడు తన భటులతో "అమృతాన్ని జాగ్రత్తగా కాపాడండి" అని ఆజ్ఞాపించాడు. గరుడునికి అమృత రక్షకులకు ఘోర యుద్ధం జరిగింది. గరుడుడు దేవతలను తన ముక్కుతోనూ, కాలి గోళ్ళ తోనూ, రెక్కలతోనూ, గాయపరిచాడు. గరుడుని ధాటికి తట్టుకోలేక అమృత రక్షకులైన దేవతలు పారి పోయారు. గరుడుడు అమృతం ఉన్న చోటికి చేరుకున్నాడు. అమృత కలశాన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరాడు. 

అప్పుడు విష్ణువు గరుడుని వద్దకు వచ్చాడు. "గరుడా నీ శౌర్యానికి, సాహసానికి మెచ్చాను. నీకు ఏమి వరం కావాలో కోరుకో!" అని అడిగాడు.

దానికి గరుడుడు " దేవా, నేను అమృతం సేవించకుండానే, నాకు ముసలితనం, చావు లేకుండా, ఎల్లప్పుడూ నిన్ను సేవించే వరం ప్రసాదించు" అని అడిగాడు. విష్ణువు దానికి సంతోషించి, "గరుడా నీవు కోరిన వరం ఇస్తున్నాను. ఇంక నుండి నువ్వు నాకు వాహనంగానూ, నా పతాకంగానూ ఉండు" అని అన్నాడు.

గరుడుడు విష్ణువుకు నమస్కరించి, మరల పైకి ఎగిరాడు. ఇంతలో దేవేంద్రుడు, తన వజ్రాయుధాన్ని గరుడుని మీదికి విసిరాడు. వజ్రాయుధం గరుడుని మీదికి వస్తూ ఉంది. వజ్రాయుధాన్ని చూచి

"ఓ వజ్రాయుధమా, నీవు ఒక మహా ముని (దధీచి) నుండి పుట్టినావు కాబట్టి నిన్ను అవమానించను. నువ్వు దేవేంద్రుని ఆయుధం కాబట్టి, నిన్ను గౌరవించుచున్నాను. కాని నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. అందుకని, నా రెక్కలో ఉన్న ఒక ఈకను త్రుంచుము" అని చెప్పాడు.

ఇది అంతా చూసి దేవేంద్రుడు గరుడిని శక్తికి ఆశ్చర్యపోయాడు. గరుడునితో స్నేహం చెయ్యాలనుకున్నాడు.

"ఓ గరుడా, నేను నీకు స్నేహితుడిని. నువ్వు ఈ అమృతాన్ని క్రూరులైన పాములకు ఇస్తున్నావు. అప్పుడు వారిని దేవతలు కూడా జయింపలేరు. కాబట్టి అమృత కలశాన్ని తిరిగి నాకు ఇమ్ము. నువ్వు కోరినది ఇస్తాను" అన్నాడు.

దానికి గరుడుడు "మహేంద్రా, ఈ అమృత కలశాన్ని నేను పాములకు ఇస్తే నా తల్లి వినత దాస్య విముక్తి అవుతుంది. నేనూ నా తల్లి దాస్యవిముక్తులమై వెళ్లి పోతాము. తరువాత నువ్వు ఈ అమృత కలశాన్ని పాముల నుండి సంగ్రహించు" అని చెప్పాడు.



"గరుడా నువ్వు నాకు అమృతాన్ని ఇస్తున్నావు. నీకు ఏమి కావాలో కోరుకో" అన్నాడు.

దానికి గరుడుడు, "నాకు నా తల్లికి అపకారం చేసిన పాములు నాకు ఆహారం అయ్యేట్టు అనుగ్రహించు" అన్నాడు. దానికి మహేంద్రుడు అలాగే అని వరము ఇచ్చాడు.

తరువాత గరుడుడు పాముల వద్దకు అమృత కలశాన్ని తీసుకొని వెళ్లాడు. దేవేంద్రుడు అతనిని అనుసరించాడు. గరుడుడు అమృతకలశాన్ని ధర్భల మీదపెట్టాడు. పాములను పిలిచి

మీరు కోరినట్టు అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. నేను నా తల్లి దాస్య విముక్తులమయ్యాము. మేము వెళుతున్నాము. మీరు స్నానం చేసి శుచి అయి వచ్చి ఈ అమృతాన్ని సేవించండి" అని చెప్పి, తన తల్లి వినతను వీపు మీద ఎక్కించుకొని ఎగిరిపోయాడు.

అమృతం దొరికిందన్న ఆనందంతో పాములన్నీ స్నానం చేసి రావడానికి వెళ్లాయి. అక్కడే దాక్కుని ఉన్న దేవేంద్రుడు వచ్చి అమృత కలశాన్ని సంగ్రహించి, స్వర్గానికి తీసుకు వెళ్లాడు. అమృతకలశాన్ని యధాస్థానంలో ఉంచాడు.

ఇక్కడ పాములు స్నానం చేసి వచ్చి చూస్తే అమృత కలశం కనపడలేదు. చాలా దుఃఖించారు. కనీసం అమృతం పెట్టిన ధర్బలను నాకితే నన్నా ఫలితం ఉంటుందని, ఆ ధర్భలను తమ నాలుకలతో నాకారు. ధర్భలు వాటి నాలుకలను రెండుగా చీల్చాయి.

అప్పటి నుండి పాములు ద్విజిహ్వులు అయ్యాయి అంటే పాములకు రెండు నాలుకలు ఏర్పడ్డాయి. అమృత కలశం ధర్భల మీద ఉంచబడింది కాబట్టి అప్పటి నుండి ధర్భలు పవిత్రం అయ్యాయి.

ఈ విధంగా పాములకు అమృతం దక్కలేదు. ఇది అంతా చూసి ఆది శేషువు తన తల్లి, తమ్ములు చేసిన పనులకు చాలా బాధ పడ్డాడు. అసహ్యించుకుని వెళ్లి పోయాడు. బ్రహ్మను గూర్చి తపస్సు చేసాడు.

బ్రహ్మ ప్రత్యక్షం అయి "ఓ ఆది శేషూ, నీ సత్య సంధతకు, ధర్మ నిష్టకు సంతోషించాను. ఈ

భూభారాన్ని మొయ్యడానికి నువ్వే సమర్ధుడివి. వేరే ఎవ్వరూ ఈపని చెయ్యలేరు. కాబట్టి, ఇప్పటి నుండి ఈ భూభారాన్ని నువ్వు మోస్తూ ఉండు" అని చెప్పాడు. అప్పటి నుండి ఈ భూ భారాన్ని ఆది శేషువు తన పడగల మీద మోస్తున్నాడు.


Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

తెలుగు సంధులు

                    తెలుగు   సంధులు సంధి వివరణ:                  మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది.    'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని  సంధి  అంటారు.                   ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది.  వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను  సంధి  అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును  సంధికార్యము   అని అంటారు.   సంధిలో రెండు పదాలు ఉంటాయి. వీటిల...

సంస్కృత సంధులు

                                           సంస్కృత సంధులు సంధి వివరణ:                    మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి   మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది.    'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని  సంధి  అంటారు.                   ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది.  వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను  సంధి  అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే...